****శ్రీ వెంకటేస్వరుని కధలు


శ్రీ శేషశైల గరుడాచల 

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్ |
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 15 ||

సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ
రక్షోంబునాథ పవమాన ధనాధి నాథాః |
బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 16 ||

ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః |
స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 17 ||

సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి
స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః |
త్వద్దాసదాస చరమావధి దాసదాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 18 ||

తత్-పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః |
కల్పాగమా కలనయా‌உ‌உకులతాం లభంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 19 ||

త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః

స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః |

మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 20 ||

శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే
దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే |
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 21 ||

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే |
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 22 ||

కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే
కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే |
కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 23 ||

మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర |
శేషాంశరామ యదునందన కల్కిరూప
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 24 ||

ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం
దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణమ్ |
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్ || 25 ||

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః |
శ్రీవైష్ణవాః సతత మర్థిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్ || 26 ||

బ్రహ్మాదయా స్సురవరా స్సమహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః |
ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 27 ||

లక్శ్మీనివాస నిరవద్య గుణైక సింధో
సంసారసాగర సముత్తరణైక సేతో |
వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 28 ||

ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః | 
తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం
ప్రఙ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే || 29 ||

--(())--


1. గురుదేవా ఏడుకొండలవాడా, 2. స్నానం - వాటిభేదాలు!

3. శ్రీ వారి ప్రసాదాలు, 5. --: శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామం :--
6. తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా?
7. తిరుమల లీలామృతం, 8. ముక్కోటి ఏకాదశి,9 . శ్రీ  వేంకటేశ్వర సుబ్రభాతం 

10. “హాథీరాం బావాజీ”


1. గురుదేవా ఏడుకొండలవాడా శ్రీనివాస నమస్తే నమస్తే నమస్తే
స్వామి కొన్ని విషయములు మీతో మనవి చేయాలి




1. మీ విగ్రహమూర్తి చుట్టూ ఒక ఆవరణ ఉంది ఆ ఆవరణకు పైభాగంలో ఒక రాక్షసి బొమ్మ ఉంది ఇది ఎందుకు ఉన్నది అన్నది నా మొదటి ప్రశ్న

2. మీ కుడిచేయి అనగా కుడి హస్తము క్రిందికి చూపిస్తూ ఉంటుంది. అనగా పాదాలను చూపిస్తూ ఉంది. మీ చేయి పాదాలను ఎందుకు చూపిస్తుంది అన్నది నా రెండవ ప్రశ్న

3. మీ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూడక కేవలం మీ పాదాలను మాత్రమే మే ఆశ్రయించాలి అని మీ యొక్క విగ్రహం లోని బోధ కనిపిస్తూ ఉంది. నేను అడిగేది అదే, సమస్త మైనటువంటి మీ విగ్రహం చూడకుండా కేవలం పాదాలను మాత్రమే ఎందుకు చూడాలి. ఇది నా మూడవ ప్రశ్న గోవిందా ఈ విషయంలో మా మిత్రుల యొక్క సమాధానాలను వినాలని నాకనిపిస్తుంది. అడుగు దామా మరి. మిత్రులారా దయచేసి ఈ నా మూడు ప్రశ్నలకు ఎవరైనా తెలిసి ఉంటే సమాధానం ఇవ్వగలరని విన్నపం చేస్తున్నాను. 

--(())--


2. స్నానం - వాటిభేదాలు!

స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తే తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తే బద్ధకం పోతుంది. వేణ్ణీళ్ల స్నానం చేస్తే మసాజ్‌లా ఉంటుంది. ఆవిరి స్నానం చేస్తే నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. గులాబీ రేకుల స్నానం చేస్తే చర్మానికి లాలన దొరుకుతుంది. అరోమ స్నానం చేస్తే ఒక క్రొత్త లోకంలో విహరిస్తున్నట్టుంది. ఇలా పలు విధాలుగా అనిపిస్తుంది. అసలు స్నానం అంటే ఏమిటి? ఇన్ని రకాల స్నానాల వల్ల మనకోచ్చేలాభాలేమిటి అంటే ఇది పూర్తిగా చదవవలసినదే.!
మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి 1.జలము మరియు 

2.అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. వాటిల్లో నేను నేర్చుకున్నవీ, చదివి, విని తెలుసుకున్నవీ అన్నిటినీ క్రోడీకరించి ఇక్కడవివరిస్తున్నాను.

స్థూలంగా స్నానాలని అయిదు విధములుగా చెప్పినా , చాలా రకాలుగా మనం విభజించు కోవచ్చును. స్నానం ఎప్పుడు చేస్తాం అనే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే స్నానాలు 

మూడు విధములు. అవి
1 నిత్య స్నానం : ప్రతీరోజూ చేసే స్నానం నిత్య స్నానం.

2 నైమిత్తిక స్నానం :
ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం. ఉదా : గ్రహణం సమయములో, కక్కిన వెంటనే, క్షౌరం చేసుకున్న తరువాత, చెడ్డకలలు కన్న తరువాత, సంసారసుఖం అనుభవించిన తరువాత, ఎముకను పట్టుకొన్నపుడు, స్మశానానికి వెళ్ళినపుడు స్నానం చేయాలని పెద్దల అభిప్రాయం.
ప్రసవించిన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, రజస్వలయైన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని అనుసరించి వెళ్ళిన తరువాత, ఇలా ఒక కారణం చేత చేసే స్నానం నైమిత్తికమన్నమాట.
 

3 కామ్య స్నానం : ఒక కోరికతో చేసేది కామ్య స్నానం. ఉదా : తీర్థాదులలో, పుష్కరాలలో, రధసప్తమికి, కార్తీక మాసంలో, మాఘఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి, తన జన్మనక్షత్రం, వ్యతీపాత, వైదృతి, యను యోగాలు కలిసే రోజుల్లోగాని, పర్వతిథులలో చేసేది కామ్య స్నానం.
స్నానానికి ఉపయోగించే పదార్ధాన్ని బట్టి స్నానాలు రెండు విధములు. అవి
ముఖ్య స్నానం : ఇది నీటిని ఉపయోగించి చేసేది ఇది మళ్ళీ రెండు రకాలు --
మంత్రం లేదా బ్రాహ్మ్యం : వేదములలో చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేసేది "మంత్ర స్నానం".మంత్రించిన నీళ్ళని నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం.

"ఓం ఆపోహిష్టామ యోభువః
తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్య భాజయతేహనః
ఉశతీరివ మాతరః
తస్మారంగా మామవో
యస్యక్షయాయ చ తనః
ఆపో జన యధాచనః "
అనే మంత్రముతో పైన నీటిని చల్లుకుంటారు. పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ, యమునేచ, గోదావరీ, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అని నీళ్ళని మంత్రించి పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవస్య, ఆత్మానం సంప్రోక్ష్య అని మంత్రించిన నీళ్ళని చల్లాకనే పూజా విధానాలు మొదలుపెడతాం.
వారుణం : ఇది మామూలు నీళ్ళతో చేసేది. మనమందరం ఎక్కువగా చేసేది ఇదే. మనలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ, ఎప్పటికప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. ఇలా నిరంతరం జరుగుతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ ప్రక్రియను "electro-magnetic activity” అంటారు. నిజానికి శుచితో పాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తిని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశ్యం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి విద్యుచ్ఛక్తిని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి విద్యుచ్ఛక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది. పుణ్య నదులలో స్నానం ఆచరించడాన్ని కూడా వారుణ స్నానం అంటారు.
అముఖ్యం లేదా గౌణ స్నానం : నీరు లేకుండా చేసే స్నానాన్ని గౌణ స్నానం అంటారు (మీరు చదివినది నిజమే! నీరు లేకుండా కూడా స్నానం చేయచ్చు). ఇది అయిదు రకాలు
* ఆగ్నేయస్నానం : హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూది స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. అదెక్కడి స్నానం అనుకుంటున్నారా? చెప్తాను వినండి కాదు రాస్తాను చదవండి. భస్మానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా. అప్పుడే ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే అలానే నీరు కూడా ఒక రకం బూడిదే. ఉదజని వాయువుని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టడం జరిగింది.


"శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|
లోకే వశీకరణం పుంసాం భస్మం త్రైలోక్య పావనం||"
 

పరమ పవిత్రమైన, అనారోగ్యాలను పోగొట్టే, సంపదలను చేకూర్చే, బాధలను నివారించే, అందరినీ వశంలో ఉంచుకునే విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను- అని ఈ శ్లోక భావం. విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాలనుండి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం. విభూది అంటే ఐశ్వర్యం అనే భావన కూడా ఉంది కనుక ఈ విభూది స్నానం చేస్తే ఐశ్వర్యవంతులం అవుతామన్న ఉద్దేశ్యంతో కూడా దీనిని ఆచరిస్తాం.
 

* భౌమస్నానం : పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేసేది "భౌమ స్నానం". దీనినే మృత్తికాస్నానం(mud bath) అంటారు. పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, మనకు సర్వాన్నీ ప్రసాదించే చేట్టుచేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరం. మట్టి లేకపోతే మనకు మనుగడే లేదు. పుట్టింది మొదలు, చనిపోయేవరకూ మట్టితో మనకు విడదీయరాని సంబంధం ఉంటుంది. చివరికి తుది శ్వాస విడిచిన తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. భస్మ స్నానం, మృత్తికా స్నానం పూర్తయిన తర్వాతనే క్రొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలనేది శాస్త్రం. మట్టిలో ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తితో పాటు గాయాలని మాన్పగల శక్తి కూడా ఉంది.
 

* వాయవ్యస్నానం : ముప్పయి మూడు కోట్ల దేవతులు నివశించియున్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడం. విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ పురాణం చెప్తోంది. గోధూళిలో ఉండే కమ్మటి వాసన మనకు అనుభవమే! అది శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.
 

* దివ్యస్నానం : లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వర్షం నీటిలో తడవడాన్నే దివ్య స్నానం అంటారు. అంటే, ఒక్కోసారి ఎంతమాత్రం మబ్బు పట్టకుండా ఎండలోనే వాన వస్తుంది కదా! అలాంటి వర్షంలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు. ఇది చాలా అరుదైనది. అవకాశం వస్తే వదలకండి.
 

* మానసిక స్నానం : అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు. నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది. పైపై స్నానాలు కాకిస్నానాలు ఎన్ని చేసినా లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది.
 

ఖస్థితం పుండరీకాక్షం చింతయేత్ పురుషోత్తమం| 
అనంతాదిత్యసంకాశం వాసుదేవం చతుర్భుజం||
 

శంఖచక్ర గదా పద్మధారిణం వనమాలినం| 
ధ్వజ వప్ర అంకుశైర్లక్ష్య పాదపద్మం సునిర్మలం||
 

త్వత్పాదోదజాం గంగాం నిపతంతీం స్వమూర్ధని| 
చింతయేత్ బ్రహ్మరంధ్రేణ ప్రవిశంతీం స్వకాంతమం||
 

తయా సంక్షాళయే త్సర్వమంతర్దేహగతం మలం| 
తత్ క్షణాత్ విరజా మర్త్యో జాయతే స్ఫటికోపమ:||
 

ఇదం మానసికం స్నానం ప్రోక్తం హరిహరాదిభి:| 
సార్దత్రికోటి తీర్ధేషు స్నానాత్కోటి గుణాధికం||
 

యోనిత్యమాచరేద్దేవం సవియెనారాయణ స్మృత:| 
కాలమృత్యు మతిక్రమ్య జీవత్యేవ నసంశయ:||
 

అంటే పరమాకాశంలో ఉండే పురుషోత్తముడయిన వాసుదేవుడిని, నాలుగు భుజములు కలవాడిని, శంఖ చక్ర గద పద్మము వనమాలలను ధరించినవానిని, ధ్వజాదులనే మంగళకరమైన గుర్తులున్నవానిని ధ్యానించాలి. వాని పాద పద్మముల నుండి పుట్టిన గంగను తన శిరస్సుపై పడి బ్రహ్మరంధ్రం వెంబడి హృదయంలో ప్రవేశించే దానిగా భావించాలి. ఆ గంగచేత తన పాపలు పోతున్నట్లుగా చింతించాలి. అప్పుడు స్ఫటికం మాదిరిగా మలినాలు లేకుండా నిర్మలంగా ఉండి మృత్యువును దాటగలరు. ఇలా హరిహరులను తలుచుకుంటూ చేసే మానసిక స్నానం కోటి పుణ్య నదులలో చేసిన స్నానం కన్నా గొప్పది అని దీని భావము.
 

ఇడా భాగీరథీ గంగా, పింగళా యమునా స్మృతా| 

తయోర్మధ్యగతా నాడీ, సుషుమ్నాఖ్యా సరస్వతీ||
 

జ్ఞానహ్రదే ధ్యానజలే రాగద్వేష మలపహే| 
య:స్నాతి మానసే తీర్ధే సయాతి పరమాం గతిం||
 

అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అహం హరి:| 
ఆనందోహం అశేషోహం అజోహం అమృతోస్మ్యహం||
 

నిత్యోహం నిర్వికల్పోహం నిరాకారోహం అవ్యయ:| 
సచ్చిదానందరూపోహం పరిపూర్ణోస్మి సర్వదా||
 

బ్రహ్మైవాహం నసంసారీ, ముక్తోహమితి భావయేత్| 
ఆశక్నువన్ భాపయితుం వాక్యమేతత్ సమభ్య పెట్టడం సేత్||
 

ఏవం య: ప్రత్యహం స్మృత్వా, మానసం స్నానమాచరేత్| 
సదేహాంతే పరబ్రహ్మపదం యాతి నసంశయ:||
 

ఎడమ ముక్కులోనున్న ఇడానాడిని భాగీరథిగా, కుడి ముక్కులో నున్న పింగళనాడిని యమునగా, వాటి మధ్యలో నున్న సుషుమ్నును సరస్వతిగా భావించాలి. రాగద్వేషాలనే మాలిన్యాన్ని పోగొట్టే జ్ఞానమనే సరస్సులో స్నానం చేసినట్లు భావించి నేనే అచ్యుతుడను, గోవిందుడను, హరిని, ఆనందరూపుణ్ణి, చావు పుట్టుకలు లేని పరమాత్మ స్వరూపాన్ని నేనే అని భావిస్తూ మనస్సులోనే స్నానం చేస్తున్నట్లుగా భావించి తరించాలి అని దీని భావము.
 

అభ్యంగన స్నానం : ఇక మిగతా రకాల స్నానాల గురించి చెప్పుకోవాలంటే అభ్యంగన స్నానం ఒకటి. నఖ శిఖ పర్యంతము తలస్నానము చేయుట . ఇది కనీసం నెలకి రెండు సార్లయినా అందరూ చేయాలి! మరి దాని వలన ప్రయోజనాలేమిటో చూద్దాం -

1. వేడినీటి స్నానం --చర్మాన్ని బలపరచి, చర్మంపైగల క్రిములను సంహరిస్తుంది. నూనె మర్దన శరీరంలో రక్తసరఫరా మెరుగుపరచి ఆరోగ్యవంతమైన చర్మాన్నిస్తుంది.
 

2. సౌనా పేరుతో నేడు చేయబడే స్టీం బాత్ లు --చర్మకణాలను పూర్తిగా శుభ్రపరచి, చర్మ రంధ్రాలు స్వేచ్ఛగా గాలి పొందేలా చేస్తాయి.
3. శరీర వెనుక భాగ చర్మం, పిరుదులు, భుజాలు, మొదలైనవి గట్టిగా వుంటాయి. వేడినీరు తగిలితే ఆ భాగాల లోని నొప్పులు, మంటలు మొదలైనవి తగ్గుతాయి. ముఖంపైన, తలపైన వేడినీరు వాడటం వలన జుట్టు ఊడే ప్రమాదం కూడా వుంది.
 

4. వేడి నీటి తలంటు స్నానం చర్మానికి నూనెను ఇచ్చి మెత్తబడేట్ల చేస్తుంది. నూనెతో మర్దన, పసుపు శనగపిండిలతో కూడిన పేస్టు రోగాలను తెచ్చే క్రిములను నశింపజేస్తుంది. చర్మం దురదలు, మం
ట తగ్గుతాయి. అపుడపుడూ అభ్యంగన స్నానం చేస్తే, మైండ్ చక్కటి రిలాక్సేషన్ పొంది చురుకుగా వుంటుంది. వేడినీటిలో సువాసన ద్రవ్యాలు వేస్తే అవి చర్మానికి సహజ కాంతి నిచ్చి చెడు వాసనలను పోగొడతాయి.
ఇవే కాక
 

నేతితో స్నానం చేయుట వలన ఆయుర్దాయం పెరుగుతుంది;
పెరుగు, ఆవుపేడతో స్నానం చేయుట వలన లక్ష్మీ వర్ధనము;
దర్భలతో చేయుట వలన సర్వ పాపాలు తొలగుతాయి;
సర్వ గంధాలతోటి స్నానం చేస్తే సౌభాగ్యము, ఆరోగ్యము అభివృద్ది చెందుతాయి;
ఆమలక స్నానము అంటే ఉసిరికాయని వేసి చేసిన స్నానం వలన దారిద్ర్యాలు తొలగుతాయి;
నువ్వులు మరియు తెల్ల ఆవాలతో చేసిన స్నానం అమంగళనివారకము; నువ్వులతో కాని తెల్ల ఆవాలతో కాని ప్రియంగువుతో కాని స్నానం చేస్తే సౌభాగ్యం .
 

వర్ధనము; మోదుగ, మారేడాకులు, రెల్లు, తామర, కలువ, కడిమి పువ్వులతో స్నానం చేస్తే లక్ష్మీ వర్ధనమే కాక శుభప్రదం;
నవరత్నాలతో స్నానము చేస్తే యుద్ధ విజయం;
బంగారము వేసిన నీటితో స్నానం చేస్తే ఆయుష్షు, మేధా శక్తి పెరుగుతాయి అని రక రకాల స్నానముల వలన కలిగే ఫలితాలను గురించి శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణములో చెప్పబడింది.
 

సముద్ర స్నానము...........
మానవుడు సముద్రములో మునుగగనే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును.
 

కార్తీక స్నానము................
కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విస్మరించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరీ సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.


--(())--

3. శ్రీ వారి ప్రసాదాలు

గారెల రాజ్యంలో పులిహోర పురం రాజధానిగా, దద్దోజనం చక్రవర్తి , చక్రపొంగలి రాణితో ,మలై కాజా మహా మంత్రి సలహాలతో ,సమోసా సైన్యధిపతిగా, పరిపాలిస్తుండగా, అతడి తమ్ముడు అప్పాలు ,వంకాయ బజ్జీ వంకర మాటలువిని, వేడి వేడి పకోడీల్లా వేరుపడి.......
.కుడుముల రాజ్యం చేసుకుని, రవ్వ లడ్డు రాజధానిగా , మిరపకాయ బజ్జీ మంత్రిగా, సేమ్యాపాయసం సేనానిగా రాజ్యపాలన చేయాలని నిప్పంట్టంత నీల్గి ,నీరుల్లి వడలా వగ పడ్డాడు.
మడత కాజా లెవల్లోని లేఖకునితో అన్నకు కట్లెట్ భాషలో కమ్మగా వ్రాసి కలాకండతో కబురంపాడు. లడ్డు బుట్టలో లేఖ పట్టుకుని, మిర్ఛి బజ్జీ బండిలో, తీపి గారెల కబుర్లు వింటూ,
కలాకండ వెళుతుండగా, ఇది వేసవి కాలం కావటాన....
వేరుశనగ ఉండల్లా వడదెబ్బతగిలి , పరమాన్నపురంలో , సున్నుండల సలహాతో,
ఇడ్లీ ఇంట విశ్రమించి , మినపట్టు మెడికల్ సేవలతో, మొక్క జొన్న వడల మందేసుకుని,
టమాట జామ్ తో సేదతీరి, పాయసం ఫలహారం చేసి, మసాలా పకోడితో మంచం దిగి, బ్రెడ్ హల్వా బండిలో , కరివేప వడ కళ్ళెం పట్టుకోగా , పాలకోవా బాట చూపగా, పుణుగులు కట్టిన బండి పరుగెత్తసాగింది.
.
వెజిటబుల్ వడ వెంట వస్తుండగా, బర్ఫీ బిగువుతో , సున్ని ఉండల కొండలూ, కజ్జికాయల కోనలూ, పూతరేకుల పర్వతాలూ, సగ్గుబియ్యపాయస సముద్రాలూ, ఖర్జూరం హల్వా కోనేరునూ, కొబ్బరి పాయసపు కొలనునూ, జాంగ్రీల జాగీరు నూ దాటుకుని , ఆలూ వడ అరణ్యంలో ప్రవేసించగా, బూరెల దొంగలూ, కట్లెట్ కర్రలతో, అడ్డుకోగా , రవ్వ కజ్జి కాయల రక్షకులు ,బూందీ లడ్డు బూరలూది , కాజాల జాగిలాలను రప్పించి, సేమ్యా హల్వా శూలాలతో , బొబ్బట్లు బొబ్బల తో భయపెట్టగా , తొక్కుడు లడ్డు దొంగలంతా , ఆవడల అరణ్యంలోకి పారిపోయారు.
.
రాజభక్తి గల రవ్వ కేసరి , వడియాల వేగులూ , బఠానీ వడబంట్రోతులు , చెర్రి జామ్ చారులూ, కలాకండ కారణం లేని రాక తెల్సుకుని, అన్నం పరవాన్నం పారించి, ఉల్లిపాయ పకోడి, అరటికాయ బజ్జీలూ దారికడ్డం వేసి ,అరిసెలు బండి అడ్డంపెట్టి , ఊతప్పం తో వళ్ళంతా వాతలేసి, గవ్వలతో గవదలూడ గొట్టి, పాలకోవా బిళ్ళలతో పళ్ళు పీకి, బాదం కేకుతో బాది, కొబ్బరి ఖీర్ కొరడాతో కొట్టి, గులాబ్ జామ్లతో గుచ్చి గుచ్చి , ఉల్లిపాయ వడియపు తాళ్లతో కట్టేసి, పాయసం తో పనిష్ చేసి, బొంగుమిఠాయ్ తో బొమికెలు విరగ్గొట్టి ,అదిరి పోయే అల్లం ,బెల్లం పచ్చడి- మిర్చి బజ్జీతో మిక్స్ చేసి పట్టించి, ఖర్జూరం హల్వా ఖైదులో వేశారు.
.
చిమ్మిరుండల చారులూ, సజ్జప్పాల సమాచరకులూ, వెనిల్లా వేగులూ ,అప్పచ్చుల ఆత్మీయులూ అదించిన ఈ సమాచారం విని , బూంది బాబాయ్ పెట్టిన భయంతో , కొబ్బరి వడలా వణికిపోయి, మిర్ఛి బజ్జీ మైత్రితో, పెసరట్టు దొంగ ప్రేమతో, మైసూరుపాక్ మైత్రితో , జీళ్ళ జాయింట్లు జారిపోయి ,చిలకడ దుంపల లడ్డులా చింతించి, సజ్జ బూరెల్లా స్వాంతనపడి, పెసర అప్పడాల్లా పశ్చాత్తాపపడి, ఖర్జూరం హల్వాలా కుళ్ళికుళ్ళీ ఏడ్వగా,కరుణగల క్యారట్ పాయసపుదేవుని కారుణ్యంతో, మైసూరు బజ్జీ బుజ్జగింపులతో మనసుమారి, మినప్పిండి అప్పడాల్లా ముసిరిన ఆలోచనలు వదిలి, నువ్వుండల నయ వంచకత్వం , చెగోడీల చెప్పుడు మాటలూ, బీరకాయ బజ్జీ బీరాలూ ,జిలేబీల జాడ్యాలూ అంటించినవి వదలుకుని , అప్పాల్లా ఆగి ఆగి, క్యారట్ కేక్ లా కేకలేసి, ఉండ్రాళ్ళ లాపొర్లి పొర్లి, హల్వా లా అరచి అరచి, బొబ్బట్ల లా బొబ్బలేసి, వేరుశనగ ఉండలా వేరుపడాలన్న తన చెడు చింతనకు , పూర్ణం లా పూర్తిగా మారిపోయి, బాదం ఐస్ క్రీం లా పశ్చాత్తాపపడి, బాస్మతి బియ్యపు పరవాన్నంలో , స్పాంజ్ కేక్ తోస్నానం, చేసి , సగ్గుబియ్యం వడియంలా శుధ్ధిపడి, బ్రెడ్ హల్వాకేకుతో భయంతీరి, జీడిపప్పు మైసూరుపాక్ లాంటి "అన్నప్రేమ " తల్చుకుని, మైమరచి, ఐస్ క్రీం లాంటి అన్నతనను క్షమించే లా చేయమని , ఉప్మా తో దేవుని ఉపాసించి , పైనాపిల్ కేక్ లా ఫ్రండ్సును పక్కకు నెట్టి , తనకు జీడిపప్పు అచ్చు జాడ్యం వదలి నందుకు , పిండి వడియంలా పరవసించి, అప్పడాల వంటి అన్నను చూడాలని, పకోడి పళ్ళెం పట్టుకుని, బూరెల బ్యాగ్ భుజానికి తగిలించుకుని, కొబ్బరి బొబ్బట్లు కొన్ని తీసుకుని, ప్రియమైన వదిన కోసం పెసరపిండి వడియాలు , స్నేహితుల కోసం సొరకాయ వడియాలు, మరికొందరి కోసం కొబ్బరి క్యాబేజి వడలు, ప్రేక్షకుల కోసం పాన్ కేక్సూ , కొలువులోవారి కోసం కొబ్బరి ఉండలు , సేవకుల కోసం సగ్గు బియ్యం పాయసం,తీసుకుని అన్నపు పాయసం లాంటి అన్నను చేరి, , కొబ్బరి హల్వా పాయసం వంటి పాదాలు పట్టుకుని , కోకోనట్ కేక్ లా కేక లేసి ఏడ్వగా , అన్న ఆల్మండ్ చాకొలెట్‌ బార్ లా కౌగలించుకుని , తీపికాజా లాంటి తమ్ముడ్ని, ఆవడలా ఆలింగనం చేసుకుని , బూడిద గుమ్మడి వడియాలవంటి బుగ్గలు ముద్దాడి, బిడియ పడవద్దని బియ్యం పిండి వడియాల విందిచ్చాడు. రవ్వ లడ్డు లాంటి వారి లవ్వుకు శాండ్ విచ్ వంటి సభికులంతా ఆవపెట్టిన పనసపొట్టు కూరలా ఆనందించారు 😁
--(())--



4. లక్ష్మీదేవిహరినివరించుట!
(పోతనామాత్యుడు...భాగవతం ..అష్టమ స్కంధము.)
.
తన చుట్టూ అన్ని వైపులా పరివేష్టించి ఉన్న యక్షులూ, రాక్షసులూ, సిద్ధులూ, సాధ్యులూ, దేవతలూ, గరుడులూ, గంధర్వులూ, చారణులు మొదలైన వారందరినీ లక్ష్మీదేవి పరికించి చూసింది.
వరునికై చూస్తున్న ఆ నిత్య సౌభాగ్యవతి, నిండు జవరాలు, కన్యకారత్నం అయిన ఇందిర ఇలా ఆలోచించింది. . .
-సీ.
ఐదువనై యుండ నలవడ దొక చోట;
నొకచోట సవితితో నోర్వ రాదు
తగ నొకచోట సంతత వైభవంబుఁ గా;
దొకచోట వేఁడిమి నుండఁ బోల
దొకచోటఁ గరుణ లే దొక్కింత వెదకిన;
నొకచోట డగ్గఱి యుండఁ బెట్ట
నెఱయంగ నొకచోట నిలుకడ చాలదు;
చర్చింప నొకచోట జడత గలదు
-ఆ.
కొన్నిచోట్ల కామగుణ గరిష్ఠంబులు
క్రోధ సంయుతములుఁ గొన్ని యెడలు
గొన్ని మోహలోభకుంఠితంబులుఁ గొన్ని
ప్రమద మత్సరాను భావకములు.
భావము:
ఒకచోట పునిస్త్రీగా ఉండటానికి వీలుండదు.(మన్మథుడు విగతదేహుడు).
ఒకచోట సవతి వల్ల ఓర్చుకోడం కష్టం. (శివుడు అర్థనారీశ్వరుడు).
ఒక చోట వైభవం స్థిరంగా ఉండదు. (ఇంద్రుడికి రాక్షసులతో యుద్దాలు ఓడటం). ఒకచోట తాపం భరించలేము. (సూర్యుడు).
ఒకచోట ఎంత వెతికినీ దయ అన్నది కనిపించదు. (యముడు).
ఒకచోట దగ్గరగా ఉండలేము. (అగ్ని),
ఒకచోట నిలకడలేదు. (వాయుదేవుడు).
ఒకచోట జడత్వం ఎక్కువ. (వరుణుడు).
కొన్ని చోట్ల కామ గుణం ప్రబలంగా ఉంటుంది.(గంధర్వులు).
కొన్ని చోట్ల క్రోధపూరితములు. (రుద్రుడు).
కొన్నిచోట్ల మోహము లోభమూ నిండిన మొరటుదనం ఉంటుంది.
కొన్ని చోట్ల గర్వమూ, మచ్చరమూ కూడి ఉంటాయి. (రాక్షసులు).
అని లక్ష్మీదేవి అక్కడ ఉన్న గొప్పవారిని తరచి చూసి భావిస్తున్నది.
.
(ఈ పద్యంలో జాలువారుతున్న కవితాధార, దానికి తగ్గ తేనెకన్నా మధురమైన శైలి, శైలీతో నిండుగా పాత్రపోషణా ఎంతో చక్కగా సహజ అలంకారంగా అమిరాయి.)
అలా అక్కడ ఉన్న గొప్పవారందరి నడవడికల గురించి భావించుకొని వారి సంగతి వదలివేసి. . . .
-సీ.
అమర ముత్తైదువనై యుండ వచ్చును;
వరుసకు సవతు లెవ్వరును లేరు
వెలయంగ నశ్రాంత విభవ మీతని యిల్లు;
శృంగార చందన శీతలుండు
గలఁగఁ డెన్నఁడు శుద్ధకారుణ్యమయమూర్తి;
విమలుండు గదిసి సేవింప వచ్చు
నెఱి నాడి తిరుగఁడు నిలుకడఁ గలవాఁడు;
సకల కార్యములందు జడత లేదు;
-ఆ.
సాధురక్షకుండు షడ్వర్గ రహితుండు
నాథుఁ డయ్యె నేని నడప నోపు
నితఁడె భర్త యనుచు నింతి సరోజాక్షుఁ
బుష్ప దామకమునఁ బూజచేసె.
భావము:
విష్ణుమూర్తిని నచ్చుకుంటూ ఇలా అనుకుంది. “విష్ణువు (శాశ్వతుడు కనుక) దగ్గర అయితే (నిత్య) సౌభాగ్యవతిగా ఉండవచ్చు, వంతుకు వచ్చే సవతులు లేరు, ఇతని ఇల్లు ఎడతెగని సంపదలకు నిలయం. ఇతడు అందగాడు, చందనం వలె చల్లని వాడు. ఎప్పుడూ కలత చెదడు. దయామయుడు, నిర్మలమైన వాడు. ఇతనిని చేరి సేవించవచ్చు. ఆడినమాట తప్పడు. స్థిరత్వం కలవాడు, ఏ పనిలోనూ ఆలస్యం లేని వాడు. సజ్జనులను కాపాడే వాడు, కారం క్రోధం మొదలైన చెడ్డగుణాలు లేని వాడు”. “ఇతడు నాకు తగిన భర్త” అని నిశ్చయించుకుంది. పద్మాలవంటి కన్నులు గల విష్ణుమూర్తి మెడలో పూలమాల వేసి వరించింది.
-క.
ఇందీవర దామమున ము
కుందునిఁ బూజించి తనకుఁ గూడి వసింపన్
మందిరముగఁ దద్వక్షము
నందంద సలజ్జదృష్టి నాలోకించెన్.
భావము:
లక్ష్మీదేవి కలువపూలమాలతో మోక్షదాయకుడైన విష్ణువు వరించింది. తాను చేరి నివసించడానికి ఆయన వక్షస్థలాన్ని ఎన్నుకొని, సిగ్గుతో కూడిన చూపులతో మరీ మరీ చూసింది.
-ఆ.
మోహరుచుల వలన ముద్దియ దల యెత్తు
సిగ్గువలన బాల శిరము వంచు
నింతి వెఱపు వలన నెత్తదు వంపదు
తనదు ముఖము ప్రాణదయితుఁ జూచి.
భావము:
ఇందిర పెల్లుబికిన ప్రేమతో తల ఎత్తింది. కానీ మొలకలెత్తిన సిగ్గుతో తల వంచింది. తన ప్రాణవల్లభుడైన విష్ణుని చూడడం వలన కలిగిన తొట్రుపాటు వలన ఆమె మోము ఎత్తనూ ఎత్తదు, దించనూ దించదు.
-క.
హరి చూచిన సిరి చూడదు
సిరి చూచిన హరియుఁ జూఁడ సిగ్గును బొందున్
హరియును సిరియునుఁ దమలో
సరిఁజూపులఁజూడ మరుఁడు సందడి పెట్టెన్.
భావము:
విష్ణుమూర్తి తన కేసి చూస్తే లక్ష్మి చూసేది కాదు. లక్ష్మీదేవి తనని చూస్తే విష్ణువు చూడటానికి సిగ్గు పడేవాడు. లక్ష్మీ విష్ణువు ఒకరినొకరు సరిసమానంగా చూసుకునేలా మన్మథుడు తొందరలు పెట్టాడు.
-చ.
జగముల తండ్రియై తనరు శౌరి జగంబుల తల్లి నిందిరం
దగ నురమందుఁ దాల్చె; నటఁ దత్కరుణారసదృష్టిచేఁ బ్రజల్
మగుడఁగఁ దొంటి భంగి నతిమంగళసాధ్వి పతిత్వసంపదన్
నెగడిన లోకముల్ గని; రనేక శుభంబులఁ బొంది రత్తఱిన్.
భావము:
లోకాలకు తండ్రి అయిన విష్ణుమూర్తి, లోకాలు తల్లి అయిన లక్ష్మీదేవిని తన వక్షస్థలమునందు చేర్చుకున్నాడు. అప్పుడు ఆమె కరుణారస పూరిత చూపులు వలన ప్రజలు ఎన్నో శుభాలను పొందారు. అటువంటి మహా మంగళకరమైన ఆ సాధ్వీమణి పూర్వం వలె భర్తతో చేరిన పుణ్య సంపద వలన లోకాలు పెంపొందాయి.
.
ఇలా లక్ష్మీదేవి వరించి విష్ణువును చేరబోతున్న సమయంలో, కడలిరాజు అయిన సాగరుడు, అల్లుడైన విష్ణుమూర్తికి తనలో ఉన్నట్టి కౌస్తుభం అనే అమూల్యమైన రత్నాన్ని కానుకగా ఇచ్చాడు. దానిని తన వక్షస్థలం మీద విష్ణువు ధరించాడు. అప్పుడు ఆ ఆదిలక్ష్మి శ్రీవత్సమూ, కౌస్తుభమూ, వైజయంతిమాలా, ముత్యాలహారమూ మొదలైన విభూషణాలతో భూషితమైన ఆ పద్మనయనుడైన శ్రీ మహావిష్ణువు ఎదపై నివసించింది. అప్పుడు. . . .
-శా.
మ్రోసెన్ శంఖ మృదంగ వేణురవముల్ మున్నాడి; పెంజీఁకటుల్
వాసెన్; నర్తన గాన లీలల సురల్ భాసిల్లి; రార్యుల్ జగ
ద్వాసుల్ విష్ణుని బ్రహ్మ రుద్ర ముఖరుల్ తల్లింగమంత్రంబులం
బ్రాసక్తిన్ వినుతించి రుల్లసిత పుష్పశ్రేణి వర్షించుచున్.
భావము:
ఆ లక్ష్మీదేవి నారాయణుని చేరిన కల్యాణ సమయంలో; ముందుగా శంఖ, మృదంగ ధ్వానాలూ, మురళీరవాలూ మ్రోగాయి. పెనుచీకట్లు తొలగిపోయాయి. ఆట పాటల వేడుకలతో దేవతలు విలసిల్లారు. సర్వలోక పూజ్యులూ, బ్రహ్మాది దేవతలూ విష్ణునామాంకితాలు అయిన మంత్రాలతో స్తోత్రాలు చేశారు.
-క.
ఆ పాలవెల్లి కూఁతురు
దీపుల చూపులను దోఁగి తిలకింపఁ బ్రజల్
చేపట్టిరి సంపదలనుఁ;
బ్రాపించెను మేలు; జగము బ్రతికె నరేంద్రా!
భావము:
ఆ సముద్రరాజపుత్రి లక్ష్మీదేవి చల్లని చూపులతో తియ్యగా చూసింది. ప్రజలను 


 --(())--

5. --: శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామం :--

---------------------------------------------

1) ఓం నమో వేంకటేశాయ శేషాద్రినిలయాయ చ |

వృషదృగ్గోచరాయ అథ విష్ణవే సతతం నమః ||


2) సదంజనగిరీశాయ వృషాద్రిపతయే నమః |
మేరుపుత్రగిరీశాయ సరస్స్వామితటీజుషే ||


3) కుమారాకల్పసేవ్యాయ వజ్రిదృగ్విషయాయ చ |
సువర్చలాసుతన్యస్తసేనాపత్యభరాయ చ ||


4) రామాయ పద్మనాభాయ సదావాయుస్తుతాయ చ |
త్యక్తవైకుంఠలోకాయ గిరికుంజవిహారిణే ||


5) హరిచందనగోత్రేంద్రస్వామినే సతతం నమః |
శంఖరాజన్యనేత్రాబ్జవిషయాయ నమోనమః ||


6) వసూపరిచరత్రాత్రే కృష్ణాయ సతతం నమః |
అబ్ధికన్యాపరిష్వక్తవక్షసే వేంకటాయ చ ||


7) సనకాదిమహాయోగిపూజితాయ నమోనమః |
దేవజిత్ప్రముఖానంతదైత్యసంఘప్రణాశినే ||


8) శ్వేతద్వీపవసన్ముక్తపూజితాంఘ్రియుగాయ చ |
శేషపర్వతరూపత్వప్రకాశనపరాయ చ ||


9) సానుస్థాపితతార్క్ష్యాయ తార్క్ష్యాచలనివాసినే |
మాయాగూఢవిమానాయ గరుడస్కంధవాసినే ||


10) అనంతశిరసే నిత్యం అనంతాక్షాయ తే నమః |
అనంతచరణాయ అథ శ్రీశైలనిలయాయ చ ||


11) దామోదరాయ తే నిత్యం నీలమేఘనిభాయ చ |
బ్రహ్మాదిదేవదుర్దర్శవిశ్వరూపాయ తే నమః ||


12) వైకుంఠాగతసద్ధేమవిమానాంతర్గతాయ చ |
అగస్త్యాభ్యర్థితాశేషజనదృగ్గోచరాయ చ ||


13) వాసుదేవాయ హరయే తీర్థపంచకవాసినే |
వామదేవప్రియాయ అథ జనకేష్టప్రదాయ చ ||


14) మార్కండేయమహాతీర్థజాతపుణ్యప్రదాయ చ |
వాక్పతిబ్రహ్మదాత్రే చ చంద్రలావణ్యదాయినే ||


15) నారాయణనగేశాయ బ్రహ్మక్లుప్తోత్సవాయ చ |
శంఖచక్రవరానమ్రలసత్కరతలాయ చ ||


16) ద్రవన్మృగమదాసక్తవిగ్రహాయ నమోనమః |
కేశవాయ నమో నిత్యం నిత్యయౌవనమూర్తయే ||


17) అర్థితార్థప్రదాత్రే చ విశ్వతీర్థాఘహారిణే |
తీర్థస్వామిసరస్స్నాతజనాభీష్టప్రదాయినే ||


18) కుమారధారికావాసస్కందాభీష్టప్రదాయ చ |
జామదగ్నసముద్భూతపోత్రిణే కూర్మమూర్తయే ||


19) కిన్నరద్వంద్వశాపాంతప్రదాత్రే విభవే నమః |
వైఖానసమునిశ్రేష్ఠపూజితాయ నమోనమః ||


20) సింహాచలనివాసాయ శ్రీమన్నారాయణాయ చ |
సద్భక్తనీలకంఠార్చ్యనృసింహాయ నమోనమః ||


21) కుముదాక్షగణశ్రేష్ఠసైనాపత్యప్రదాయ చ |
దుర్మేధఃప్రాణహర్త్రే చ శ్రీధరాయ నమోనమః ||


22) క్షత్రియాంతకరామాయ మత్స్యరూపాయ తే నమః |
పాండవారిప్రహర్త్రే చ శ్రీకరాయ నమోనమః ||


23) ఉపత్యకాప్రదేశస్థశంకరధ్యాతమూర్తయే |
రుక్మాబ్జసరసీకూలలక్ష్మీకృతతపస్వినే ||


24) లసల్లక్ష్మీకరాంభోజదత్తకల్హారకస్రజే |
శాలగ్రామనివాసాయ శుకదృగ్గోచరాయ చ ||


25) నారాయణార్థితాశేషజనదృగ్విషయాయ చ |
మృగయారసికాయ అథ వృషభాసురహారిణే ||


26) అంజనాగోత్రపతయే వృషభాచలవాసినే |
అంజనాసుతదాత్రే మాధవీయాఘహారిణే ||


27) ప్రియంగుప్రియభక్షాయ శ్వేతకోలవరాయ చ |
నీలధేనుపయోధారాసేకదేహోద్భవాయ చ ||


28) శంకరప్రియమిత్రాయ చోళపుత్రప్రియాయ చ |
సుధర్మిణీసుచైతన్యప్రదాత్రే మధుఘాతినే ||


29) కృష్ణాఖ్యవిప్రవేదాంతదేశికత్వప్రదాయ చ |
వరాహాచలనాథాయ బలభద్రాయ తే నమః ||


30) త్రివిక్రమాయ మహతే హృషీకేశాయ తే నమః |
అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రినిలయాయ చ ||


31) నమః క్షీరాబ్ధినాథాయ వైకుంఠాచలవాసినే |
ముకుందాయ నమో నిత్యం అనంతాయ నమోనమః ||


32) విరించాభ్యర్థితానీతసౌమ్యరూపాయ తే నమః |
సువర్ణముఖరీస్నాతమనుజాభీష్టప్రదాయినే ||


33) హలాయుధజగత్తీర్థసమస్తఫలదాయినే |
గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః ||

--((*))--



6. తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా?
1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి
7. నారాయణాద్రి.
ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు,పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్య మైనది కాదు.


అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||

వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |

ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||

వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామానివింశతిః


ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు.
1. వృషభాద్రి - అంటే ఎద్దు :

వ్రుశాభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4కొమ్ములుంటాయి. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)                            వాక్కు అంటే - శబ్దం శబ్దం అంటే - వేదం 0

వేదం అంటే - ప్రమాణము, వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.


2. వృషాద్రి - అంటే ధర్మం :
ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను, పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.


3. గరుడాద్రి - అంటే పక్షి - ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం. షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క

పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి.పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది.

ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు.


భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ == ఉన్నవాడు, కళ్యాణగుణ సహితుడు, హేయగుణ రహితుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.


4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూడవలసినవి మాత్రమే
చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటతాడు.

5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు, తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు) తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.


6. వేంకటాద్రి - వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా  బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా కనవడుతారు. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని,
పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

7. నారాయణాద్రి - అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. వేంకటాచలంలో ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుకుకోవడం ఏడు కొండలు ఎక్కడం.


--((**))--

7. తిరుమల లీలామృతం

వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి

ఒకనాడు చోళరాజు (చక్రవర్తి) వద్దకు కృష్ణశర్మ అనే విప్రుడు వచ్చి తన తండ్రి మరణించిన కారణాన అతడికొరకు గంగాస్నానానికి బయలుదేరుతున్నానని, తన భార్య, పసిగుడ్డైన తన చిన్న పిల్లవానిని తీసుకు వెళ్ళలేనని, అందుకు క్షేమంగా చూసుకోవలసిన బాధ్యత రాజుగా నీదేనని, ఆరు మాసాలలో తిరిగి రాగలనని, అంతవరకు వారి పోషణ చేసి రక్షించమని వేడుకుంటాడు. కోరిక వింతగా వున్నా, చక్రవర్తి ధార్మికుడు, బ్రాహ్మణభక్తి కలవాడు కనక, ఆ బ్రాహ్మణుడు కూడా సాత్వికుడు, జ్ఞాని, భక్తుడుగా కనబడుతున్నాడు కనుక కాదనలేకపోయాడు. రాజు తన అధికారులను పిలిచి కృష్ణశర్మ భార్యా, తనయుల రక్షణభారం అప్పగించి వారికొక ప్రత్యేక గృహం ఏర్పాటు చేసి ఆరునెలలవరకు కావలసిన తినుబండారాలు, సుకర్యాలు, దాసదాసీజనంతో అందివ్వాలని ఆదేశించాడు.

అంతే కాదు వారి బాగోగులు రోజు, తరువాత వారానికోసారి, పదిరోజులకొకసారి వాకబు చేసేవాడు, తరువాత రాజ్యభార ఒత్తిడిలో ఆ విషయం పట్టించుకునే అవకాశం దొరకలేదు. అక్కడ కృష్ణశర్మ అంత దూరం వచ్చాడు కదా అని మరికొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకుని ఆరు నెలలలో కాక చాలా కాలం గడిచాక తిరిగివచ్చి వారి భార్య పిల్లలను అప్పగించమని రాజును అడుగుతాడు. రాజు మ్రాన్పడిపోతాడు. తాను ఆరు నెలలకు సరిపడ్డా సరంజామా ఇమ్మన్నాడు, ఇప్పుడు వారు ఎలా వున్నారో అని భయపడి వారు కొండపైకి దర్శనానికి వెళ్ళారు, అని అతడిని విశ్రాంతి తీసుకోమని చెప్పు రాజు అధికారులను పిలిచి విచారిస్తాడు. అతడి ఇంటికి వెళ్లి చూడగా ఆ తల్లీకొడుకులు ఆ ఇంట్లో చచ్చిపడిఉంటారు, దేహాలు పూర్తిగా మాంసరహితమై శుష్కించిపోయి ఉన్నాయి. రాజుకు ఏమి చెయ్యాలో పాలుపోక హుటాహుటిన వేంకటాచలానికి తనను తాను నిందించు కుంటూ పరుగేడుతాడు. తాను చేసిన అపరాధాన్ని మన్నించి తనను రక్షించమని ప్రార్ధిస్తాడు. రాజు చేసిన ఉత్సవాలు, కైంకర్యాలు ఉత్తినే పోతాయా?

భగవంతుడు తన సేనాపతి విహ్వాక్సేనుని పిలిచి వేంకటాచల క్షేత్రంలో ఉన్న అస్తికూట తీర్ధం నుండి జాలం తీసుకువచ్చు వారి దేహాలకు అభిషేక ప్రోక్షణ చెయ్యమని ఆజ్ఞాపిస్తాడు. ఆ నీటిలో తత్వాభిమాన దేవతలందరూ విశేషసన్నిధానంతో ఆ దేహాలను ప్రేరణ చేసి ఆరోగ్యంగా మారుస్తారు. వారు నిద్రనుండి లేచినట్లు లేస్తారు. చక్రవర్తికి భగవంతుడు “వారి ప్రాణాలు నా దగ్గరే క్షేమంగా ఉన్నాయి, యమునివద్దకు పోలేదు. మీరిద్దరూ నా భక్తులు కావున మీ రక్షణ బాధ్యత నాది” అని చెప్పి రక్షిస్తాడు అనంత కరుణామయుడు, భక్తవత్సలుడు, భక్తాపరాధసహిష్ణుడు.
దీనిలో తత్త్వవిచారం రేపటి టపాలో
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని ఆభరణాలు

శ్రీనివాసుని సంపద వేల కోట్ల రూపాయలన్నది అందరికీ తెలిసిన విషయమే. స్వామివారు ధరించే ఆభరణాల విలువ కూడా కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఎన్నో సంవత్సరాల క్రితం రాజులు సమర్పించిన వజ్ర, వైఢూర్యాలతో ఆభరణాలు స్వామివారికి ఇప్పటికీ ఉన్నాయి. పురావస్తు శాఖ అధికారులే స్వామివారికి ఉన్న ఆభరణాల విలువను వెలకట్టలేకపోతున్నారు. అదీ స్వామివారి మహత్యం. అసలు శ్రీవారికి ఏయే ఆభరణాలు అలంకరిస్తారో.. ఇప్పడు చూద్దాం...

 1. శ్రీవారి పాదాల క్రింది పద్మపీఠం - బంగారు రేకుల పద్మపీఠం
2. బంగారు పాద కవచాలు రెండు 1.కుడిపాదం, 2.ఎడమ పాదం
3. స్వర్ణపీతాంబరం (బంగారు రేకు)
4. బంగారు ఖడ్గం అనబడే సూర్యకఠారి
5. వైకుంఠ హస్తమునకు అలంకరింపబడే బంగారు కవచం రేకు
6. వైకుంఠ హస్తమునకు అలంకరింపబడే పొడవైన బంగారు సాదారేకు
7. వైకుంఠ హస్తమునకు సాతుబడి అయ్యే బంగారు కుడి నాగాభరణం
8. వైకుంఠ హస్తనాగాభరణం క్రింద ఉండే కడియం
9. కటి హస్తమునకు అలంకరించే బంగారు సాదారేకు
10. కటి హస్తమునకు అలంకరింపబడే బంగారు కడియం
11. కటి హస్తమునకు అలంకరింపబడే పొడవైన బంగారు కవచం రేకు
12. బంగారు కటిహస్త కవచం బంగారు రేకు
13. కటి హస్తమునకు అలంకరింపబడే రత్నాలదస్తుబందు
14. ఎడమచేయి నాగాభరణం
15. బంగారు నాగాభరణం అనే వడ్డాణం
16. వక్షస్థలం అమ్మవార్ల బంగారు కంటె, రత్నాలతో
17. బంగారు సహస్రనామ సాలిగ్రామాలు
18. బంగారు తులసీహారం
19. కమ్మరపట్టె అనే బంగారు వడ్డాణం
20. ఆరుపోర్వల బంగారు యజ్ఞోపవీతం
21. బంగారు కాసుల దండ
22. నాలుగు పేటల బంగారు మొహరీల గొలుసు
23. భుజకీర్తులు రెండు
24. రత్నాలు పొదిగిన బంగారు శంఖం రేకు
25. రత్నాలు చెక్కిన బంగారు చక్రం రేకు
26. రత్నాలు చెక్కిన బంగారు ఎడమ కర్ణపత్రం
27. రత్నాలు చెక్కిన బంగారు కుడికర్ణపత్రం
28. రత్నాలు చెక్కిన బంగారు బావలీలు, కుడి, ఎడమ,
29. చంద్రవంక తరహా బంగారు కంటె
30. బంగారు గళహారం
31. బంగారు గంటల మొలతాడు
32. బంగారు రేకు కర్ణ పత్రముల జంట
33. బంగారు రెండు పేటల గొలుసు
34. బంగారు సాదాకంటెలు
35. బంగారు కిరీటం
36. కొత్తగా చేయించిన బంగారు శంఖ చక్రముల కవచరేకులు
37. బంగారు ఐదుపేటల గొలుసు
38. శ్రీ స్వామివారి మకరతోరణం
39. వక్షస్థలంలో తగిలించి ఉన్న భూదేవి ప్రతిమ

నిత్యం సమర్పణ అయ్యే ఈ ఆభరణాలన్నీ అర్చకుల ఆధీనంలో ఉంటాయి. వీటి విలువ కోట్ల రూపాయలన్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని స్వామివారికి అలంకరింపబడగా, మిగిలినవి శ్రీవారి ఆయలంలోనే భద్రపరచడం జరుగుతుంది. వజ్ర మకుట ధర గోవిందా.. గోవిందా...!

--((**))--

8. ముక్కోటి ఏకాదశి.... 
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. 
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. 
సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. 
ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. 
ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు 
కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. 

ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. 

ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం. 

విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. 

అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. 

తిరువతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు

తిరువతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు
భక్తులు దర్శనము చేసుకొని మోక్షము  పొందాలని ఉద్దేశ్యము.

దినకరుడు చల్లని చూపులు చూపే 
దినము నంతా చల్లని గాలులు వీచే 
ఇక్కడికి ముక్కోటి దేవతలు కలసి వచ్చే   
వైకుంఠద్వార దర్శనామ్ చేసాము శ్రీ వెంకటేశ్వర 

గోవింద నామములతో మారు మ్రోగే 
వెన్నల కమ్మినట్లుగా ప్రజలు చూసే 
ముత్యాల దండా లంకారము చూసి 
మనసులోని కోరికను తెలియ పరిచి 

నిన్ను చూసి బంతి పూవులా ముఖం విచ్చి 
ఉషోదయమునకు ముందే దర్శనము చేసి
స్వామీ ప్రసాదమును ఆరగించితిమి 
మొక్కులు సమర్పించాము శ్రీ వెంకటేశ్వరా 
-((*))--

9 . శ్రీ  వేంకటేశ్వర సుబ్రభాతం 

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ || 1 ||

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ |
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు || 2 ||

మాతస్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే |
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ || 3 ||

తవ సుప్రభాతమరవింద లోచనే
భవతు ప్రసన్నముఖ చంద్రమండలే |
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృశ శైలనాథ దయితే దయానిధే || 4 ||

అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి |
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 5 ||

పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః
త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి |
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 6 ||

ఈశత్-ప్రఫుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాలికానామ్ |
ఆవాతి మందమనిలః సహదివ్య గంధైః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 7 ||

ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః
పాత్రావసిష్ట కదలీ ఫల పాయసాని |
భుక్త్వాః సలీల మథకేళి శుకాః పఠంతి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 8 ||

తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా
గాయత్యనంత చరితం తవ నారదో‌உపి |
భాషా సమగ్ర మసత్-కృతచారు రమ్యం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 9 ||

భృంగావళీ చ మకరంద రసాను విద్ధ
ఝుంకారగీత నినదైః సహసేవనాయ |
నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 10 ||

యోషాగణేన వరదధ్ని విమథ్యమానే
ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః |
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 11 ||

పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః |
భేరీ నినాదమివ భిభ్రతి తీవ్రనాదమ్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 12 ||

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో 
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో |
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 13 ||

శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః
శ్రేయార్థినో హరవిరించి సనందనాద్యాః |
ద్వారే వసంతి వరనేత్ర హతోత్త మాంగాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 14 ||



10. “హాథీరాం బావాజీ”

>> తిరుమల ఆలయంలో ప్రతిరోజూ జరిగే సుప్రభాత సేవలో, ప్రతిరోజూ స్వామివారికి “గోక్షీర నివేదన” & “నవనీత హారతి” కూడా జరుగుతాయి. వీటిని “మహంతు హాథీ రాంజీ” మఠం నుండే వస్తాయి. ప్రతిరోజూ ఉదయమే, “హాథీ రాంజీ” మఠం నుండి ఒక ఏకాంగి సుప్రభాతానికి ముందే అప్పుడే పిటికిన ఆవుపాలు & అప్పుడే తీసిన వెన్న , పచ్చకర్పూర తాంబూలాన్ని కలిపి ఒక వెండిపళ్ళెంలో ఉంచి, వాటిపై ఒక పట్టు వస్త్రాన్ని కప్పుకొని బంగారువాకిలి వద్ద వేచి ఉంటారు. ద్వారాలు తెరవగానే, సన్నిధి గొల్ల, అర్చకులతో పాటుగా “హాథీ రాంజీ” మఠం నుండి వచ్చిన ఈ ఏకాంగి కూడా తాను తెచ్చిన పాలు – వెన్న – తాంబూలాలతో లోనికి ప్రవేశిస్తారు. లోపల అర్చకులు మఠం నుండి తెచ్చిన ఆవుపాలను నివేదించి, తాంబూలాన్ని సమర్పించి, వెన్నతో నవనీత హారతినిస్తారు. సుప్రభాతానంతరం, తాళ్ళపాకం వారికి, తరిగొండ వారికి, తదుపరి “మహంతు మఠం” వారికి కూడా “తీర్థ – చందన – శఠారి” మర్యాదలు జరుగుతాయి. ఇలా నిత్యమూ జరిపే నవనీత హారతి మాత్రమే కాక, ప్రతి సంవత్సరమూ ఆలయంలో జరిగే ఉగాది, శ్రీరామనవమి, ఆణివారాస్తానం, దీపావళి ఆస్థానం, బ్రహ్మోత్సవాల్లోని రథోత్సవం సందర్భాల్లో కూడా “హాథీ రాంజీ” మహంతు మఠం వారి తరఫున శ్రీవారు హారతులందుకొంటారు. మఠం ప్రతినిధులకు శఠారి మర్యాదలు కూడా జరుగుతాయి. అలాగే, పారువేత ఉత్సవం రోజున, వేట తరువాత ఆలయం చుట్టూ ఈ మహంతు మఠం వారి ఆధ్వర్యంలోనే ఊరేగింపు జరుగుతుంది. తదుపరి ఆలయ మర్యాద ఉంటుంది. వీరినే “హాథీ రామ్ బావాజీ” అనికూడా పిలుస్తారు..
=> తిరుమల ఆలయంలో ఇంత ప్రాధాన్యం ఉన్న ఆ “మహంతు హాథీ రాంజీ” ఎవరు ???
=> ఆయనకు ఆలయంలో ఇంత ప్రాముఖ్యత ఎందుకు ???
=> ఉత్తర భారతం నుండి వచ్చి, ఇలా తిరుమలలో మఠ స్థాపన ఎందుకు చేశాడు ???.
….. ఈ వివరాలన్నీ తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. వీరి గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి..
>> సుమారు 500 ఏళ్లక్రితం రాజస్థాన్ లో నాగోర్ జిల్లాలోని ఒక గ్రామంలోని వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో వీరు జన్మించినట్లు తెలుస్తోంది.( హథీరాం బావాజీ రాజస్థాన్ లోని బంజారా వంశస్థుడు …బ్రాహ్మణుడు కాదు అని కొంతమంది చెపుతారు )… వీరి తల్లిదండ్రులకు సంతానం లేక తీర్థయాత్రలకు బయలుదేరి, తిరుమలకు వచ్చాక, స్వామి అనుగ్రహంతో కల్గిన సంతానమే ఈ “హతీ రాంజీ”. చిన్నప్పటి నుండీ వాళ్ళింట్లో తిరుమల బాలాజీనే ఆరాధించడం వల్ల, ఆ బాలాజీతో అప్పటినుండే అనుబంధం పెరిగింది. వీరి చిన్నతనంలోనే తల్లితండ్రులు కాలంచేయడంతో, తిరుమల వెళ్ళాని బయలుదేరి, దారిలో కాశీలో “అనుభవానంద” అనే గురువు సేవచేసి, కొంత జ్ఞానం సంపాదించుకొని, వారి ఆశీర్వాదంతో తిరుమల బాలాజీ దర్శనానికి ఒక “బైరాగి”గా వచ్చారు..
>> అలా బైరాగిగా తిరుమల చేరుకొన్న ఈయనపట్ల అక్కడి అర్చకులు గానీ, ఆలయాధికారులు గానీ, పెద్దగా ఆదరణ చూపలేదట.! రోజూ పుష్కరిణిలో స్నానం చేసి, స్వామివారి దర్శనంతో రోజులు వెళ్లదీస్తున్నా ఈ బైరాగి, ఆలయ అధికారులను ఏదైనా పని ఇప్పించమని అభ్యర్థించారు. సరేనంటూ, స్వామివారి నైవేద్యాలకోసం రోజూ అడవినుండి వంటచెరుకు తెమ్మని చెప్పారు. అలా అలా స్వామివారి సేవలో నిమగ్నమైపోయారు. కొంతకాలానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనపడి, స్వామి తపస్సు చేయమని సూచించాడు. అలా కొంతకాలం తపస్సు చేసిన ఈ బైరాగి, తనకు భగవత్ సాక్షాత్కారం కలగకపోవడంతో నిరుత్సాహపడితే, ఆ వృద్ధ బ్రాహ్మణుడు మళ్ళీ కనిపించి, తానే భగవంతుడనని, దివ్యదృష్టినిచ్చి. నిజరూపదర్శనం చేయించాడు. తాను ఎప్పుడు కోరుకొంటే అప్పుడే సాక్షాత్కరిస్తానని చెప్పి, ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడట.!.
>> ఇలా భగవంతునితో మొదలైన సంబంధం వల్ల బైరాగితో అతని ఇంట్లో ప్రతిరోజూ, ఏకాంతంలో స్వామి ఇష్టాగోష్టి జరిపేవాడనీ, అతనితో పాచికలు ఆదేవాడనీ రకరకాల కథలు ప్రచారంలోనికి వచ్చాయి. ఈ విషయం ఆనోటా ఈనోటా వెళ్ళి, నాటి యాదవరాజులు (చంద్రగిరి పాలకులు) వరకూ వెళ్ళి, వీరి దర్శనార్థం ఆరాజు రావడం, ఈ బైరాగికి శిష్యుడవడం కూడా జరిగిపోయాయి. అప్పటినుండి ఈ బైరాగికి తిరుమలలో గౌరవం, ఆలయంలో మనుగడ పెరిగాయి..
>> తరవాత కొద్దికాలానికి ఈ బైరాగి, “ఉత్తరభారత యాత్రికుల సదుపాయాల కోసం” ఒక “బైరాగి ఆశ్రమం” ప్రారంభించాడు. తదనంతరకాలంలో అదే ఒక “మఠం” గా రూపుదిద్దుకొంది. రాజాశ్రయం పొందిన వీరికి, “స్వామివారి అంతరంగ భక్తుడుగా” చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ పరిణామాలన్నీ ఆనాటి అర్చకులకు, ఆలయ అధికారులకూ నచ్చకపోయినా, రాజాశ్రయం ఉన్నవాడు కనక చేయగలిగిందేమీ లేదని మిన్నకుండిపోయారు..
…. అనంతర కాలంలోనే ఈ బైరాగి “మహిమలు” ప్రజలకు తెలియజేయడానికి భగవంతుడే లీలచేశాడని రకరకాల కథలు పుట్టుకొచ్చాయి..
>> యధావిధిగా, ఈ బైరాగి ఆశ్రమంలోనికి పాచికాలాడడానికి వచ్చిన స్వామివారు, తన “కంఠాభరణాన్ని” బైరాగి దగ్గరే వదిలి అంతర్థానమైపోతాడు. ఉదయం ఆలయం తెరవగానే, ఆ ఆభరణాన్ని స్వామికి సమర్పించడానికి ఆలయంలోనికి వెళతాడు. అప్పటికే, స్వామివారి ఆభరణం కనపడకపోవడంతో కంగారులో ఉన్న అర్చకులు, అధికారులూ వెదుకుతుండగా, చేతిలో ఆభరణంతో లోనికి వస్తున్న ఈ బైరాగిని పట్టుకొన్నారు. సాక్ష్యాత్తూ స్వామివారే ఈ ఆభరణాన్ని తన ఆశ్రమంలో వదిలివెళ్ళారనీ, దాన్ని తిరిగివ్వడానికే తాను వచ్చాననీ ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా అతనిని బంధించి, రాజుకు తెలియజేశారు. రాజుకూడా ఏమిచేయాలో తోచక, నీకేలాగో ప్రతిరోజూ స్వామి సాక్షాత్క్జారం కలుగుతుందికదా, మరి మానవమాత్రులు చేయలేనిపనిని నీకు అప్పజెబుతాము. ఆ భగవంతుని అనుగ్రహంతో చేసి చూపమని పరీక్ష పెట్టాడు రాజు..
>> ఈ బైరాగిని బంధించిన గదిలో నిండుగా చెరుకుగడలు వేసి, వాటిని తెల్లారేలోపు తినేసి పిప్పిచేయాలని ఆదేశించి, తాళంవేసి, సీళ్ళు వేసి వెళ్ళిపోయారు. ఇదంతా చూస్తున్న బైరాగికి ఏమిచేయాలో తోచక, స్వామివారి లీలగానే భావించి, స్వామి ధానంలో లీనమైపోతాడు. అంతలోనే స్వామివారు ఏనుగు రూపంలో ఆ గదిలోనికి ప్రవేశించి, ఆ చేరుకును పీల్చి పిప్పిచేస్తాడు. లోపల ఏనుగు చేరుకును తింటున్న విషయాన్ని సైనికులు రాజుకు తెలియజేస్తారు. వేసిన సీళ్ళు వేసినట్లే ఉన్నాయి, తాళాలు కూడా వేసి ఉన్నాయి, మరి ఏనుగెలా లోనికి వెళ్ళింది, అన్న పశ్నలతో సతమతమైన రాజు, ఆ స్వామివారే ఈ బైరాగికి ఏనుగు రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించాడని నిశ్చయించుకొని, బైరాగి కాళ్లపై పడి క్షమాపణ కోరి, అతనికి శిష్యుడయ్యాడు..
>> ఈ బైరాగి “రామ భక్తుడు” – భగవంతుడు దర్శనం “ఏనుగు”(హాథీ) రూపంలో జరిగింది కాబట్టి, ఈ సంఘటన అనంతరం “హాథీ రాంజీ” అనే పేరు వచ్చిందట.! అనంతరకాలంలో ఉత్తరభారతం నుండి వచ్చే భక్తులకు “హాథీ రామ్ బాబాజీ”గా విస్తృత ప్రచారంలోనికి వచ్చాడు. అలా ఆయన మఠం “హాథీ రాంజీ మఠం”గా ప్రసిద్ధి చెందింది. సాక్ష్యాత్తూ రాజే వీరికి శిష్యుడయ్యేసరికి, అప్పటినుండే రాజోపచారాలు కూడా ప్రారంభమయ్యాయి. సింహాసనం – కిరీటం – నాగారాలు – భేరీలు మోగించడం – పల్లకీలు – ధ్వజాలు గట్రా ఏర్పాటయ్యాయి. అలా, బైరాగి కాస్తా “బైరాగి చక్రవర్తి”గా రూపాంతరం చెందారు. అంతేకాదు, తిరుమలలో రాజ విడుదులుగా ఉన్న భవనాలు మహంతు మఠాలుగా మారాయి. లేదా, మహంతు మఠాలు రాజమందిరాలవలే నిర్మాణం చేయబడ్డాయి. తిరుమల ఆలయానికి ఆగ్నేయంలో ఎత్తుమీద ఉన్న ఒక పెద్ద భవనం నేటికీ “హాథీ రాంజీ”మఠంగానే ఉంది. దీన్ని నాటి యాదవరాజులు నిర్మించారు. వీరి లీలలపై మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ అప్రస్తుతం.
>> అలా మొదలైన వీరి ప్రస్థానం, “హాథీ రాంజీ” తరవాత 12 తరాల మహంతులు ఈ మఠం వ్యవహారాలు చూస్తూ వచ్చారు. యాత్రికులకు, మరీ ముఖ్యంగా ఉత్తర భారత యాత్రికుల అవసరాలు తీర్చడంలో వీరి కార్యక్రమాలు సాగేవి. ముఖ్యంగా దేశంలోని ఏ బైరాగి తిరుమల వచ్చి సాధన చేసుకోవాలన్నా వసతి, భీజాన సదుపాయాలు చేయడం ప్రధాన కర్తవ్యంగా పెట్టుకొన్న మఠం ఇది. యాత్రికులు, దాతలు ఇచ్చే విరాళాలతోనే నడపబడే ఈ మఠం వారికి ఇష్టదైవం “ఆంజనేయ స్వామి”. రాములవారికి హనుమంతుడు సేవచేసినట్లు, మహంతులు శ్రీనివాసుడి సేవ చేయాలన్నది వీరి ఆశయం. 1843 లో తిరుమల ఆలయాల పరిపాలనా బాధ్యతలు వచ్చేవరకూ, వీరికి పేరు ప్రఖ్యాతులే తప్ప, పెద్దగా ఆస్తిపాస్తులు ఉండేవి కావు..
>> వీరి నిస్వార్థ సేవ “ఈస్ట్ ఇండియా కంపెనీ” అధికారులకు నచ్చి, ఆలయ ఆధిపత్యాన్ని వీరికి అప్పగించారు. 90 సంవత్సరాల వీరి పాలనలో ఆలయ అభివృద్ధికి మహంతులు చాలా తోడ్పడ్డారు. 1843లో లక్ష రూపాయలు కలిగిన తిరుమల ఆలాయాల ఆదాయం, 1907-08 సంవత్సరానికి గాను దాదాపు 4లక్షలకు పెరిగింది. అప్పటివరకూ, ఆలయ పూర్తి బాధ్యతలు, ఖర్చులు పోనూ మిగులు నిధుల వినియోగ బాధ్యత ఈ మహంతులదే..
>> ఇక “హాథీ రాంజీ” వారి విషయానికొస్తే, చాలాకాలం శ్రీవారి సేవలో గడిపిన వారు, వృద్ధాప్యంలో, తిరుమల గోగర్భమ్, ఆకాశగంగ తీర్థాల నడుమ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఏకాంతంగా తపస్సుచేసుకొంటూ గడిపారు. అదే ఆశ్రమంలో “వేణుగోపాల స్వామి ఆలయాన్ని” నిర్మించారు. అలా జీవితాన్ని పరిపూర్ణం చేసుకొన్న “హాథీరాం బావాజీ”గారు, ఒకానొక ఆశ్వయుజ మాసం, బహుళ త్రయోదశి రోజున, వేణుగోపాల స్వామి ఆలయానికి సమీపంలోనే సజీవసమాధి అయ్యారు. ప్రతి ఏడాదీ ఆరోజున, “శ్రీ హాథీ రామ్ బావాజీ వారి బర్శి”(సమాధి) ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆరోజున ఆలయమర్యాదలతో వారిని గౌరవిస్తారు. ఈ మఠం నేడు ప్రభుత్వం ఆధీనంలోని దేవాదాయ – ధర్మాదాయ శాఖ వారి ఆధీనంలో నడుస్తూ ఉంది.
> తిరుమల ఆలయంలో ధ్వజస్తంబం తరవాత వచ్చే వెండివాకిలి ప్రవేశమార్గంలో దక్షిణంవైపు గోడపై, “హాథీరాం బావాజీ – స్వామివారు పాచికలు ఆడుతున్న శిల్పం” చెక్కబడి ఉంటుంది..
ఇవీ “హాథీరాం బావాజీ” కి సంబంధించిన క్లుప్తమైన వివరాలు.sekarana)
వెంకటరమణ సంకటహరణ గోవిందా గోవిందా






Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ