ప్రాంజలి ప్రభ..8/04


....




సుభాషితం - 457

---------------

🌺బహుభిమూర్ఖ సంఘా

     తైరన్యూన్యం పశు వృత్తిభిః ౹

     ప్రాచ్చాద్యంతే గుణాః సర్వే

     మేఘైరివ దివాకరః ౹౹🌺

      గుణాలు స్వయం ప్రకాశమైనా కూడా చాలామంది  మూర్ఖుల వల్ల ఆవరించబడి గత్యంతరం లేక తమ ప్రభావాన్ని పోగొట్టుకుంటారు.సూర్యుడి ప్రభావానికి సరిసాటిగా ఎవరు లేకపోయినా మేఘాలలో అంతటి సూర్యుడే కొన్నిసార్లు మాయమవుతూ ఉంటాడు.

🌺✍🏼ప్రభ,

       

నేను మా ఊరికి వెళ్లేందుకు బస్టాండ్‌లో వేచి ఉన్నాను. బస్సు ఇంకా  రాలేదు..

నేను అక్కడ కూర్చుని పుస్తకం చదువుతున్నాను. 

నన్ను చూసి, దాదాపు 10 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి నా దగ్గరకు వచ్చి, "సార్, ఈ పెన్నులు కొనుక్కోండి, నేను మీకు నాలుగు పెన్నులు రూ.10కి ఇస్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఏదైనా తినడానికి ఉంటుంది." 

ఆమెతో పాటు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు, బహుశా ఆమె తమ్ముడనుకుంటాను. 

నేను, "కానీ, నాకు పెన్ను అవసరం లేదమ్మా", అన్నాను. 

ఆమె తర్వాత చాలా ముద్దుగా ఇలా అడిగింది,   "అప్పుడు మేము ఏం తింటాం?"

"నాకు పెన్ను వద్దు, కానీ నువ్వు తప్పకుండా ఏదోకటి తింటావు" అన్నాను. 

నా బ్యాగ్‌ లో రెండు బిస్కెట్ల ప్యాకెట్లు ఉన్నాయి. నేను ఆ రెండు ప్యాకెట్లను తీసి, ఇద్దరికీ చెరొకటి ఇచ్చాను.

కానీ ఆమె ఒక ప్యాకెట్ తిరిగి ఇచ్చేసి, "అయ్యగారు! ఒక్కటి చాలు, ఇద్దరం పంచుకుంటాం" అని చెప్పడంతో నేను చాలా ఆశ్చర్యపోయాను. 

 నేను మళ్ళీ "ఫర్వాలేదు, ఈ రెండూ ఉంచుకో!" అన్నాను.

దానికి ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న నన్ను, నా హృదయాన్ని, నా ఆత్మను కూడా కదిలించింది.

”అప్పుడు మీరు ఏమి తింటారు?" అని అడిగింది.

కోట్లాది కోట్లు సంపాదిస్తున్న మనుషులు మానవత్వాన్ని పక్కనపెట్టి విజయం పేరుతో ప్రజలను విపరీతంగా దోచుకుంటున్న ఈ ప్రపంచంలో, ఆకలితో ఉన్న ఓ చిన్నారి అమ్మాయి నాకు మానవత్వపు ఉన్నతమైన పాఠాన్ని నేర్పింది.

ఆత్మతో సంతృప్తి చెందేవాళ్ళు ఇలాగే ఉంటారేమో అని నాలో నేనే అనుకున్నాను.

దురాశతో వాళ్ళ వంతు కూడా తినేసేంతగా ఎదుటివారి వద్ద నుండి తీసుకోకండి ..!!

🙏💐🙏శుభోదయం 🙏💐🙏

*క్రియాయోగం- ఆధ్యాతిక మార్గం

(సద్గురు జగ్గీ వాసుదేవ్ గారి వివరణ)

ప్ర్రాథమికంగా క్రియ అంటే అంతర్గతంగా జరిగే పని. మీరు అంతర్గతంగా పనిచేసేటప్పుడు మీ మనసును, శరీరాన్ని ఉపయోగించరు. ఎందుకంటే ఆ రెండూ మీకు బాహ్యంగా ఉన్నవే! మీకు మీ శక్తిని ఉపయోగించి క్రియచేసే నేర్పు ఉంటే, అప్పుడు అది క్రియ అవుతుంది.

మీరు బాహ్యంగా పని చేస్తుంటే దాన్ని కర్మ అంటాం. మీరు ఆంతరంగికంగా చేసే పని క్రియ. ఒక రకంగా చెప్పాలంటే రెండూ ఒక విధమైన కర్మలు, ఒక విధమైన క్రియలు. సాధారణంగా, సంప్రదాయ పరంగా, బంధనాన్ని కలిగించేది కర్మ అని, ముక్తిని ఇచ్చేది క్రియ, అని మనం అర్థం చేసుకుంటాం. మీరు శరీరంతో ఏ పని చేసినా, అంటే మీ ఆలోచనలు, మీ దృక్పథం అనేవి, ఇవాళ ఒక మార్గంలో వెళ్ళవచ్చు. రేపు ఎవరో వచ్చి మీ ఆలోచనలను ప్రభావితం చెయ్యవచ్చు, అవి మరో మార్గంలో వెళతాయి. అలాగే మీ శరీరంతో చేసే పనులు కూడా! ఇవాళ మీ శరీరం ఆరోగ్యంగా ఉంది. మీరు వేసే ఆసనాలు దానికి నచ్చుతాయి. రేపు మీ శరీరం కొద్దిగా బిగుసుకొని ఉంటే, మీకు ఈ ఆసనాలు కష్టంగా అనిపిస్తాయి.

మీ మనోభావాలనుకూడా నమ్మటానికి వీలులేదు. ఏ క్షణంలోనైనా అవి అటునుండి ఇటు, ఇటు నుండి అటు మారిపోతాయి. కానీ మీ శక్తులు భిన్నమైనవి. ఒకసారి మనం శక్తిని ఒక విధంగా ఉపయోగించి పనిచెయ్యటం ప్రారంభిస్తామో, అప్పుడు దానివల్ల జీవితంలో ఒక గాఢత ఏర్పడుతుంది. మీ శక్తులన్నీఒక ప్రత్యేక విధంగా స్పృశించబడి, క్రియాశీలం చెయ్యడం వల్ల హఠాత్తుగా జీవితానికి సంబంధించిన ప్రతి కోణంలోనూ ఒక కొత్తపరిమాణం చోటు చేసుకుంటుంది.

ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి పనికి వచ్చే శక్తిమంతమైన విధానం క్రియాయోగం. అయితే అందుకు ఎంతో మూల్యం చెల్లించ వలసి ఉంటుంది. క్రియాయోగి చెల్లించ వలసిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలపు చదువుకున్న వ్యక్తికి క్రియా యోగం అమానుషంగా ఉంటుంది, ఎందుకంటే దానికి క్రమశిక్షణ, జీవితంలోని ప్రతి విషయం పట్ల ఒక ఖచ్చితత్వం కావలసి ఉంటాయి. చాలామందికి క్రియాయోగానికి కావలసిన శారీరక, మానసిక, మనోభావపరమైన నిలకడ ఉండటం లేదు. ఎందుకంటే, అందరూ బాల్యం నుండీ చాలా సుఖంగా జీవించటానికి అలవాటు పడ్డారు. సుఖం అంటే భౌతికమైన సుఖం కాదు. సుఖంగా కుర్చీమీద కూర్చోవడం సాధనకు అడ్డంకికాదు. కానీ మీ జీవం మొత్తం సుఖాన్నే ఆశిస్తూ ఉంటే, సమస్య. మీరు దేనిమీదో హాయిగా కూర్చుంటే, ఆనందించండి. అందులో సమస్య లేదు. కానీ మీరు నిరంతరం అదే ఆనందాన్ని కోరుతూ ఉంటే, ఆ రకమైన మానసికత, మనోభావం, క్రియాయోగానికి సరిపడదు. స్థిరత్వం లేకుండా ఊగిస లాడుతూ, నిరంతరం సుఖం కోసం పరితపించే వారు, అన్ని సందర్భాల్లోనూ ‘‘స్వేచ్ఛ’’ గురించి మాట్లాడేవారు. ‘‘నాకు ఇది చేసే స్వాతంత్ర్యం లేదా? అది చేయటానికి స్వేచ్చ లేదా? నేనిది తినలేనా? నేనక్కడ నిద్రించలేనా?’’ అంటూ మాట్లాడే వారు క్రియాయోగాన్ని చేయలేరు.

క్రియా యోగాన్ని అనుసరించాలని అనుకున్న వారు ఎవరైనా – ఒక వేళ నేను తల క్రిందకు, కాళ్ళు పైకి పెట్టుకొని నిద్రపోమని చెపితే, మీరు మారు మాట్లాడక అలా నిద్ర పోవలసిందే. ఎందుకంటే అందులోని అన్ని విషయాలను వివరించటం ఎన్నటికీ సాధ్యం కాదు. ముందుకు వెళ్ళినకొద్దీ మీకు అర్థం అవుతుందోమో, కాని వివరించటం సాధ్యం కాదు. ఒకవేళ దాన్ని వివరించాలి అంటే క్రియా యోగ సారాన్ని కోల్పోవలసి ఉంటుంది. మూఢంగా తర్కంతో ప్రశ్నిస్తే క్రియాయోగాన్నిబోధించటం సాధ్యం కాదు.

భౌతికమైన అభ్యాసంగా క్రియలను బోధించాలంటే నేను దాన్ని గూర్చి ఒక పుస్తకాన్నే వ్రాయగలను. మీరు దాన్ని చదివి నేర్చుకోగలరు. కానీ మీకు అదొక సచేతన ప్రక్రియగా ఉండాలంటే, క్రియ మీ వ్యవస్థలో ఒక పద్ధతిలో ముద్రింపబడాలంటే అందుకు అంకిత భావం, క్రమశిక్షణ అవసరం. మీరు గురువుపై విశ్వాసంతో, మీ శక్తులన్నింటినీ సుముఖతతో ఆయనకు అప్పగించి, ఏమి జరిగినా సిద్ధం అనే రీతిలో మీరు ఉండాలి. ఆయన మీతో ఏమైనా చెయ్యవచ్చు. మొదట ఈయన మనతో ఏమి చేస్తున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే క్రియాయోగ ప్రారంభంలో మనం జ్ఞానాన్ని పొందుతున్నామో, పిచ్చెక్కి పోతున్నామో అర్థంకాని పరిస్థితి ఉంటుంది. ఆ స్థితిని అధిగమించే వరకు గురువుపై విశ్వాసం ఉంచాలి. లేనప్పుడు క్రియా యోగం కష్టమౌతుంది.

అందువల్ల క్రియాయోగ గురువులు శిష్యులను నిరీక్షంప చేస్తారు. మీరు వచ్చి క్రియ కావాలంటే, గురువు ఇల్లు తుడవ మంటారు. “లేదు నాకు క్రియాయోగం కావాలి” అంటే, ‘అందుకే కదా ఇల్లు తుడవ మన్నాను’ అంటాడాయన. మీరు ఒక సంవత్సరం పాటు ఇల్లు తుడిచి క్రియా యోగాన్ని కోరితే, “అయితే ఒక సంవత్సరం పాటు అంట్లు తోమ” మని అంటారు. అలా అతన్ని నిరీక్షంప చేస్తారు. అతన్ని వాడుకుంటారు, దుర్వినియోగం చేస్తారు, నిందిస్తారు. అయినా అతని విశ్వాసం సడలరాదు. “ఎదో కారణం వుంది’’ అనుకోవాలి. ఆ స్థితికి వచ్చినప్పుడు అతన్ని క్రియా యోగంలో ప్రవేశ పెట్టవచ్చు. లేనట్లయితే, అతని మనోభావాలు, దృక్పథాలు సరియైనవిగా లేనప్పుడు అతని వ్యవస్థ చాలా స్పందనాత్మకంగా ఉన్నప్పుడు మీరు అతనికి ఒకవిధమైన శక్తిని కలుగ జేస్తే అతను తనకు తానే ఎంతో హాని చేసుకుంటాడు.

కాని నేటి పరిస్థితులలో ఒక శిష్యుడిని అలా నిరీక్షంప చెయ్యటం, అటువంటి నమ్మకం వారికి కలిగేలా చేయడం, ఆతరువాత వారికి క్రియా యోగం అందించడం అంతగా సాధ్యం కాదు. కాని, అది అసాధ్యమైతే కాదు. కాకపొతే ఈ ఆధునిక ప్రపంచంలో అది అరుదుగా జరుగుతుంది.

జ్ఞానాన్ని పొందటం మాత్రమేకాక అంతకు మించి ఏదోసాధించాలి అనుకున్నప్పుడే క్రియా యోగం ప్రధానమవుతుంది. మీరు ఏదో ఒకలాగా ఈ పంజరం నుండి తప్పించుకొని పోవాలనుకుంటే మీకు కావలసినది కేవలం ముక్తి, జ్ఞానం. మీకు క్రియాయోగంతో పనిలేదు. ఎందుకంటే క్రియలు చాలా విస్తృతమైనవి. అందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. మీకు ముక్తి కావాలంటే క్రియలను కొద్ది మాత్రంగా ఉపయోగించు కోవచ్చు. వాటిపై అంతగా దృష్టి నిలపనవసరం లేదు. అందుకు క్రియను మాత్రమే మార్గంగా ఎంచుకోనక్కరలేదు. ఎందుకంటే, దానికి ఎంతోకృషి చేయవలసి ఉంటుంది.

మీరు గురువు లేకుండా క్రియయోగ మార్గాన్నితీవ్రంగా అనుసరించాలి అనుకుంటే, మీరు పరిణతి చెందటానికి కొన్ని జన్మలు పడుతుంది. ఎవరైనా ప్రత్యక్షంగా మీకు తోడుంటే అప్పుడు అది, ఈ జన్మలో జరిగే అవకాశం ఉంది. లేనప్పుడు క్రియాయోగం చుట్టుతిరుగు మార్గం. క్రియా యోగంతో మీరు జ్ఞానాన్నే కాక జీవన సాంకేతికతను కూడా తెలుసుకోవచ్చు. మీరు జీవితాన్ని ఎలానిర్మించాలో తెలుసుకోవాలనుకుంటున్నారు. దానితో మీరు ఏమో చేయాలనుకుంటున్నారు. అందుకే అది చాలా పెద్ద ప్రక్రియ.

క్రియాయోగ మార్గంలో పైకివచ్చిన వారి ఉనికి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వారి శక్తులపై వారికి పూర్తి పట్టు ఉంటుంది. వారు జీవితాన్ని విడదీసి, మళ్ళీ కూర్చగలరు. మీరు గనక ఇతర మార్గాల్లో పయనించదలచుకుంటే, ఉదాహరణకు జ్ఞానమార్గంలో ఉన్నారనుకోండి! మీరు పదును పెట్టిన కత్తిలా, మీ బుద్ధితో ఎన్నో చేయగలరు. కాని మీ శక్తితో మీరేమి చెయ్యలేరు. మీరు భక్తి మార్గంలో ఉంటే మీరేమీ చెయ్యలేరు. అసలు పట్టించుకోరు, మీరు లీనం అయిపోవాలనుకుంటారు. మీరు కర్మయోగంలో ఉంటే ప్రపంచంలో మీరు ఎన్నో పనులు చేయగలరు. కానీ మీతో మీరు ఏమీ చేసుకోలేరు. క్రియాయోగులు శక్తితో తమను తాము ఏమైనా చేసుకోగలరు, ఈ ప్రపంచంతోనూ చెయ్యగలరు.

యోగి, మార్మికుడు, సద్గురు క్రియాయోగం అంటే ఏమిటో వివరిస్తూ, జీవ ప్రక్రియలోని సాంకేతికతలను పరిశోధిస్తున్నారు...

పరమాత్మ ప్రసాదం

మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః స్సఙ్గ వర్జితః

నిర్వైర స్సర్వభూతేషు యస్సమాయేతి పాణ్డవః''

''ఎవరు నా కోసం శ్రోత్రాది కర్మల్ని చేస్తూ ఉంటాడో, ఎవరు నన్నే లక్ష్యంగా పెట్టుకుంటాడో, ఎవడు అన్ని విధాలా ఉత్సాహంతో నన్నే భజిస్తాడో, సంగ దోష రహితుడై ఉంటాడో, ఎవడు సమస్త జీవుల యందు ఆత్మభావం కలిగి ఉంటాడో అట్టి నా భక్తుడు నన్ను పొందుతాడు. అట్టి వానికి ముక్తి లభిస్తుంది'' అని గీతాచార్యుడు చెప్పాడు. జీవుడు సుఖంలో పరమాత్మను మరచి పోతాడు. దుఃఖంలో స్మరణ చేస్తాడు. లౌకిక, పారలౌకిక సుఖాలన్నీ పరమాత్మ అనుగ్రహం చేతనే జీవునికి లభిస్తాయి. అందుకే సుఖమైనా, దుఃఖమైనా పరమాత్మ ప్రసాదమని గ్రహించి ఆచరించాలి.

మానవుడు అంత్యకాలం సమీపిస్తున్నా ఇహ లోక సుఖాల మీద ఆశ వీడడు. మనిషి జీవితం యావత్తూ ప్రలోభాలమయం. కామాది అరిషడ్వర్గం సదా మేలుకొని, ఎప్పుడు మింగేద్దామా అని కాచుకుని ఉంటుంది. అలాంటి కామక్రోధాది వికారాలతో ఎడతెగని పోరు సలిపి, అలిసిపోయినవారు పరితప్త హృదయంతో భగవంతుని శరణువేడితే చాలు ఆదుకుంటాడు. 'తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహం'.. అంటూ ఈ విషయాన్ని పరమాత్మే స్వయంగా తెలిపాడు. 'సమస్తంలోనూ, నన్ను ఉపాసించే వారి యోగక్షేమాన్ని నేను వహిస్తాను' అని దీని అర్థం. 'భర్తయందు పతివ్రతకు ఉండే ప్రేమ, బిడ్డ ఎడల తల్లికి ఉండే ప్రేమ, లౌకికునికి లౌకిక వస్తువులపై ఉండే ప్రేమ.. ఈ మూడు ప్రేమల సమన్వయ ఆకర్షణ శక్తితో భగవంతుని ప్రేమిస్తే ఆయన అనుగ్రహం తప్పక కలుగుతుంది అంటారు. శ్రీ రామకృష్ణ పరమహంస.

శ్రీ కృష్ణుని స్నేహితుడైన కుచేలుడు ఆ స్వామిని భౌతిక సంపద కోరక ముచ్చటగా మూడు వరాలు కోరుతాడు.

మొదటిది.. భగవంతుని పాదకమల సేవ, రెండవది భగవంతుడి భక్తులతో స్నేహము, మూడోది నిరంతరం అపారమైన భూతదయ. కమలము నీటిలో బురదలో ఉన్నా దానికి నీరు, బురద అంటదు. అదే విధంగా భగవంతుని పాదకమల సేవ చేసే వాడు సంసారంలో ఉన్నా వారికి ఆ వాసనలు అంటవు. రెండోది.. భగవంతుడి భక్తులతో స్నేహం. పాండవులు భగవంతుడైన కృష్ణునితో, భగవద్భక్తులతో స్నేహం చేసి తరించారు. గజదొంగ అయిన అంగుళీమాలుడు.. బుద్ధభగవానుడి దయతో భిక్షకుడయ్యాడు. ఇక మూడోది భూతదయ. దయను భక్త లక్షణంగా, దైవీ సంపదగా చెబుతారు.

తనను శరణుజొచ్చిన పావురము కోసం దయార్ద్ర హృదయుడైన శిబి చక్రవర్తి.. తన శరీరంలోని మాంసఖండాలనే డేగకు ఆహారంగా త్యాగం చేశాడు. దయామయుడైన బుద్ధుడు నడవలేక, కుంటుతున్న మేకపిల్లను తన భుజంపై ఎక్కించుకుని మోసుకుని బింబిసారుని యజ్ఞశాలకు వెళ్లాడు. నోరులేని జీవుల్ని బలి ఇవ్వడం పాపమని తెలియజేసి, ఆ యజ్ఞాన్ని విరమింపజేశాడు. ఈ మూడిటి కలయిక అయిన సత్వగుణమే మనను బంధాల నుండి తప్పిస్తుంది. అందుకే సుదాముడు శ్రీకృష్ణుని ఈ కోరికలు కోరి తరించాడు...

.

 684 - శ్రీ విద్యా - శాశ్వతమైన శక్తి / Sri Vidya – The Eternal Energy*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

***

544. పుణ్యశ్రవణకీర్తనా!!

పుణ్య = పవిత్రమైన వాటి, 

శ్రవణ = వినుటకును, 

కీర్తనా = కీర్తించుటకును లక్ష్యమైనది, లేదా - అవకాశమును కలుగ చేయునది.

జీవితములో పుణ్యవంతమైన, పవిత్రమైన వాక్కులను వినుటకు కీర్తనము చేయుటకు అవకాశము అమ్మవారి వలననే కలుగును, లేదా - అట్టి వాటినే వినుచుండెడిది అని అర్థం చెప్పుకోవచ్చును.

పుణ్యే విహితకర్మరూపే శ్రవణకీర్తనే యస్యాః - సా

పుణ్యమైన విహితకర్మలను వినుట పొగడుట గలది. పరమేశ్వరి యొక్క మంత్ర జపంగాని, కీర్తనలుగాని కధలు, గాధలుగాని వినటంవల్ల పుణ్యఫలం వస్తుంది. కాబట్టి దేవిని గురించిన విషయాలను వినటము, కీర్తించటము వల్ల పుణ్యము వస్తుంది.

పుణ్యప్రదము, శుభప్రదము అయిన విషయాలను శ్రవణం చేయుటయందుగాని, కీర్తనలను వినుటయందుగాని ఆసక్తి గలది. శంకర భగవత్పాదులవారు తమ సౌందర్య లహరిలోని 66వ శ్లోకంలో

విపంచ్యా గాయంతీ వివిధముపదానం పశుపతే

స్వయారట్టే వక్తుం చలితశిరసా సాధువచనే

తదీయై ర్మాథుర్వై రపలపిత తంత్రీకలరవాం

నిజాం వీణాం వాణీ నిచుళయంతి చోళేన నిభృతమ్ ||

సరస్వతీదేవి తన వీణను శృతిచేసి నీ పతి అయిన శివుని వీరగాధలు పాడుచుండగా మెచ్చుకోలుగా నీవు ఆమెను అభినందించావు. 

అప్పుడు నీ వాక్కులు వీణానాదం కన్న మధురంగా ఉండటం చేత సిగ్గుపడి సరస్వతి ఆ వీణను గుడ్డతో కప్పివేసింది. ఈ శ్లోకంలో పరమేశ్వరి తన భర్త అయిన శివుని వీరగాధలు వినటానికి ఆసక్తిగా ఉన్నది అని చెప్పబడింది. ఈ రకంగా పుణ్యాన్ని కలిగించే విషయాలను వినటమునందు

ఆసక్తి గలది.

అమ్మవారికి, అయ్యవారికి ; 'శక్తి, శివులకు - ప్రతీకలైన 'హ' కార 'స' కారాల మధ్య శబ్దం రావాలంటేను - ఏ నామాలు స్మరిస్తేను, ఉచ్చరిస్తేను పుణ్యవంతులౌతారో అటువంటి 'హరి' ! హర' పదాదులను ఉచ్చరించాలంటేను - దేని సహకారం లేకపోతే వీలుకాదో - అటువంటి 'హ్రీం' కార స్వరూపిణి.

1) పుణ్య ప్రదమైన వాక్కులను - వినుటకు, కీర్తనము చేయుటకు అవకాశము కలుగచేయునది.

2) హరి హర పుణ్యపదాదుల ఉచ్చారణ, శ్రవణ, కీర్తనాదులకు దోహదపడు “హ్రీం' కార స్వరూపిణి - అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును.

  పుణ్య విషయములను వినుట, ప్రశంసించుట గలది శ్రీమాత.   పుణ్యమగు కథలను వినుట పుణ్య శ్రవణము. శ్రీమద్రామాయ ణము, శ్రీమద్భాగవతము, శ్రీమహాభారతము కథలను ప్రవచించునపుడు అచట శ్రీమాత కూడ చేరి వినును. అట్లే తన కథలను భక్తులు ప్రవచించుకొనునపుడు శ్రీమాత వినును. 

శాశ్వత కీర్తివంతులగు మహాత్ముల కథలను వినునపుడు కూడ ఆమె ఉత్సాహముతో వినును. హరి కథలు, శివ కథలు, దేవతా విజయములు యిత్యాది ఉపాఖ్యాన ములను వినినపుడు కూడ ఉత్సాహముతో వినును. అనురక్తితో శ్రవణము చేయును. పుణ్య కథలను వినుటయందు శ్రీమాతయే ఉత్సాహపడినపుడు వాటియం దాసక్తి లేనివారు ఎంతటి దురదృష్టవంతులు. 

దేవుని కథలయందాసక్తి లేనివారు అదృష్టహీనులు. వానిని సతతము వినుట, కీర్తించుట, మరల మరల స్మరించుట పుణ్యకార్యము, శౌనకాది మునులు కూడ నిత్యము సూతమహర్షి ప్రవచనములు వినుచుందురని ప్రతీతి.

ఎచ్చట దివ్యకథల శ్రవణము జరుగుచుండునో అచట శ్రీమాత సాన్నిధ్య ముండునని తెలియవలెను. అట్టి తెలివితో ప్రవచించుట, శ్రవణము చేయుట యుండవలెను. 

వినిన కథలను ప్రశంసించుకొను చుండవలెను. పుణ్యకథల విమర్శ, విచికిత్స అహంకార హేతువు. భక్తి శ్రద్ధలతో వినుట, కీర్తించుట శ్రీమాత అనుగ్రహమునకు ఒక చక్కని ఉపాయము.

కీర్తనము సుప్రసిద్ధమగు దేవతా ప్రశంస. దైవ ప్రశంసకు భజన, కీర్తన భారతీయ సంప్రదాయమున ప్రసిద్ధి గాంచినవి. కీర్తన ద్వారా భగవత్ స్మరణము రుచికరముగ సాగును. కీర్తన చేయుకొలది రుచి పెరుగుచు నుండును. తన్మయత్వము సిద్ధించును. 

భక్తి పారవశ్యమున కీర్తనము చేయుచుండగ శ్రీమాత సంతసమున దరి చేరును. సాన్నిధ్య మిచ్చును. శ్రవణము, కీర్తనము దైవమును చేరుటకు గల నవ విధ ఉపాయములలో ప్రధానమైనవి. అందరికిని అందు బాటులో నుండునవి.

 కలియుగమందు నామ సంకీర్తనయే ప్రధానమని భాగవతము తెలుపుచున్నది. హరినామ సంకీర్తనము కలికల్మష నాశనమని, మరియొక గతి లేదని చైతన్య మహాప్రభువు ఘంటా పథముగ తెలిపినాడు. హరి యనగా దిగివచ్చు దివ్యత్వము అని అర్థం.

'యత్ర యత్ర రఘునాథ కీర్తనం' అను శ్లోక మందరికినీ తెలి రామాయణ శ్రవణ సమయమున హనుమంతుని సాన్నిధ్య ముండును. భాగవత శ్రవణమున నారదాది మహర్షులు సాన్నిధ్యముండును. 

దేవతా కథలు, మహాత్ముల కథలు అప్రయత్నముగ సాన్నిధ్య మందించును. ఈ రహస్యము తెలిసిన పెద్దలు ఏకాహములని, సప్తాహములని, సత్రయాగములని యేర్పరచుకొని దివ్య సాన్నిధ్యమును గోలుదురు. కావున పుణ్య శ్రవణము, కీర్తనము ప్రధానము.

అమ్మా ! పుణ్య కీర్తిగా యశస్సు కలిగిన నీవు పుణ్యకార్యముల వల్ల మాత్రమే వశముకాగల మాతవు, నీ నామ సంకీర్తనలు శ్రవణము చేయు వారికి అఖండమైన పుణ్యం లభిస్తుంది, పులోముని కూతురైన శచీదేవిచే ఆరాధించబడింది, అందమైన, చిక్కనైన ముంగురులు కలిగి ఉన్నావు తల్లీ.

ఎవరికైనా పుణ్యం వస్తుందంటే ఆ పని చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. పుణ్యం అంటే మన జీవితంలో మనకు కలిగే లాభాన్ని పుణ్యం అంటారు. 

ఏ పని చేయటం వలన మన జీవితంలో మంచి జరుగుతుందో, లాభం కలుగుతుందో ఆ పనిని పుణ్యకార్యం అంటారు. వాటినే సత్కర్మలు అంటారు. ఒక రకంగా సేవాకార్యాలన్నీ పుణ్యకార్యాలే. ఈ సేవాకార్యాలలో ఎవరైతే ఫలితం ఆశించకుండా చేస్తారో,సేవాతత్పరులుగా, సేవాదురంధరులు అవుతారు. సకల జీవులలో ఆ చైతన్యాన్ని దర్శించగలిగినప్పుడు సేవాచక్రవర్తులౌతారు. అది అనేక వేల జన్మల పుణ్యకర్మల వలన సాధ్యపడుతుంది అని "పుణ్యకీర్తి” నామార్థం.

పుణ్యకార్యం చేయడం అంటే తన పని తాను చేస్తూ, ఆ పనిని భగవదర్పితంగా చేసినప్పుడు తప్పక పుణ్యం లభిస్తుంది. కోరికలు జయించినవారికి వ్రతాలు, నోములు, పూజలతో పనిలేదు అని దేవీభాగవతంలో పుణ్యలభ్యా గురించి చక్కగా వివరించబడింది.

 మనలో మార్పుకు కొలమానం మనలో రాగద్వేషాలు తగ్గాయా, మనలో కోరికలు తగ్గాయా, ఇంట్లోగాని, సంఘంలోగాని ఏం జరిగినా ప్రశాంతంగా ఉండగలుగుతున్నామా, చాంచల్య చాపల్యాలు లేకుండా ఉన్నామా అని పరిశీలించుకోవడం అన్నింటి కంటే ముఖ్యం. భయాన్ని విడిచిపెట్టి అంతా ఒకటే స్వరూపంగా భావిస్తున్నామా అని మనం గ్రహించాలి. ఆధ్యాత్మిక ప్రగతి పొందాలంటే ఎప్పటికప్పుడు స్వీయపరిశీలన ఎంతో ముఖ్యం.

పుణ్య శ్రవణ కీర్తనలను  చెప్పేవాడు, వినేవాడు, ప్రోత్సహించేవాడు, ప్రేరేపించేవాడు, విన్న తరువాత మెచ్చుకునేవాడు అందరూ భాగస్తులే. పుణ్యశ్రవణ కీర్తనలో సరైన పుస్తక స్వాధ్యాయం ద్వారా, వినడం ద్వారా, ధ్యానం ద్వారా జ్ఞానమనే పుణ్యం లభిస్తుంది. 


🕉🌞🌏🌙🌟🚩

***

అత్తగారు! స్వీట్ ప్యాకెట్ లో మైసూర్ పాక్ లేదు, ఏమైందత్తయ్యగారు!


ఏమోనే నాకేం తెలుసు? రాత్రి నువ్వో, మీ ఆయనో తినేసి వుంటారులే, అయినా సంసారంలో అన్ని లెఖ్ఖలేంటే కోడలా!

అత్తయ్యగారు! మీ కడుపులో చక్కెర ఫేక్టరీ వుంది, నిన్న రక్త పరీక్ష లో 450 వుంది!
మీ అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ హెచ్చరిస్తున్నారు, మీ అబ్బాయి అయితే మరో అడుగు ముందుకేసి "నీ అశ్రద్ధ తో మా అమ్మని చంపేసేలాగున్నావు" అంటారు, మీరు చూస్తే ఇలా, చావేదో నాకొచ్చినా బాగుణ్ణు!

కోడలు పిల్లా! ముందు కంటతడి ఆపి ఇలారా తల్లీ!

చెప్పండత్తయ్యగారూ!

నాకు చిన్నప్పటినుంచి మిఠాయిలంటే ప్రాణం!
మంచి వయసులో వుండి, మిఠాయిలు అందుబాటులోనున్నా తినలేకపోయాను,
కారణం
మా అమ్మ "ఒసే! నువ్విలాగ మితం లేకుండా మిఠాయిలు తింటే బాగా వొళ్ళొచ్చేసి నీకు పెళ్ళి అవకుండా పోతుందే "
శోభనముగదిలో అన్నీ వున్నా ఆయనేమనుకుంటారోనని తినలేకపోయాను,
అత్తారింటిలో వుమ్మడి కుటుంబం మూలాన
"భగవంతుడా! ఈ పనులెప్పుడు పూర్తౌతాయి, మగవాళ్ళ భోజనాలెప్పుడవుతాయి, నా కడుపులోకి పిడికెడు మెతుకులెప్పుడెళతాయి" అనిపించేది!
క్రమేపీ నా సంసారమన్నది ఏర్పడ్డాక అంతులేని భాద్యతలతో తిండి మీద ధ్యాస పోయింది!
అమ్మయ్య! కొడుకు బుద్ధిమంతుడు, కోడలు బంగారం ఇక నాకు కావలసిన మిఠాయిలు తినేయొచ్చనుకునేసరికి తోబుట్టువుల్లాగ ఈ చక్కెర, రక్తపోటూ వచ్చి పడ్డాయి, నన్నర్దము చేసుకో తల్లీ!

నిజమే అత్తగారు! ఈ విషయం లో భగవంతుడు మీకు అన్యాయం చేసాడు, ఇకమీదనుండి మీ ఇంట్లో మీరు దొంగతనం చేయాల్సిన పని లేదు, నేనే స్వయంగా నేతి మిఠాయిలు కొని తెచ్చి మీకిచ్చేస్తా, మీ కెన్ని కావాలంటే అన్ని తినొచ్చు!
అయితే మీరు నన్ననుగ్రహించి నా ప్రశ్నకు జవాబు చెప్పాలి!

ఏమిటమ్మ అది?

మీకు కడుపుతీపి అంటే ఎక్కువిష్టమా?
నోటితీపి అంటే ఎక్కువ ఇష్టమా?

కోడలా! నీ అంతరంగం నాకు అద్దంలా కనిపిస్తోంది, నా కొడుకు మీద ఒట్టేసి చెపుతున్నాను "ఇక నేను మిఠాయిలు ముట్టను " ఇదిగో నీ మైసూర్ పాక్!
--((**))--

నేటి కధ . (కలసిన హృదయాలు)


నాన్న నాకప్పుడే పెళ్ళికి తొందరెందుకు, నాకు మంచి ఉద్యోగము రాలేదు, ఈ ట్యూషన్సు వల్ల పెళ్లి చేసుకుంటే కష్టం కదా.


అట్లా నేను అనుకుంటే నాకు అసలు పెళ్లి అయ్యేదే కాదు, ఎందుకంటే నా పెళ్లప్పుడు మునిసి పాలిటీ అత్తర్, చెత్త వ్యాన్ డ్రైవర్  పనిచేసే వాడ్ని, అందరూ  పెళైన కొత్తలో చెత్త బాబాయి అనేవాళ్ళు, వాళ్ళు అలా అన్నారని మీ అమ్మను ఎప్పుడూ భాద పెట్ట లేదు.


నీవేమి భయపడకు ఆ దేవుడు వ్రాసి నట్లే జరుగుతుంది అంతా మనకోసం జరిగిందను కోవాలి ఎంత చెట్టుకు  అంతే గాలి అయిన మానవ ప్రయత్నం చేయాలి కదా, నీవేమి ఆశలకు పోవటం లేదు కదా, కంతకు తగ్గ బొంత కోసం వెతు కుంటున్నావు, ఏమో నాన్న నీవు చెప్పావు కాబట్టి అమ్మాయిని చూసి వస్తా, నాకు నచ్చక పోతే నచ్చ లేదని చెపుతా అంతకు ఇష్ట మైతేనే పిల్లని చూస్తా, సరే నీతోపాటు పక్క ఇంటి గోపాలం గారిని తీసుకొనివెళ్ళు అన్నాడు.

ఆలా పిల్లను చూడటం నచ్చలేదని  నాన్నకు చెప్పఁటం జరిగింది.


ఎందుకు నచ్చలేదో చెప్పాలి, అమ్మాయి వాళ్లు నీచేత కంప్యూటర్

జిరాక్స్ మిషన్ కొని ఇంటర్ నెట్ సెంటర్ పెడుతారుట, స్వతంత్రంగా బ్రతక వచ్చు ఇలా ట్యూషన్సు చెప్పే బదులు ఒక్కసారి ఆలోచించు, అది అంత  తెలికకదా, నిన్ను వదలి వెళ్ళి బతకాలనిలేదు.


అది కాదు నాన్న" పిల్ల ", నాకునచ్చలా పిల్ల కళ్ళు గాజుకళ్ళు, పగలు చూడాలంటే నాకు భయ మేసింది, ఇక రాత్రి విషయం తలుచు కుంటే ఇంకా భయమేస్తుంది.


     సరేరా  మన గోపాలం గారి చుట్టా లెవరో ఉన్నారట చూసి వస్తావా.

నాన్న నేను మాత్రం ముందు చూడను, నీవు చూసి నచ్చింది, చూడరా అంటే చూస్తాను అంతే

చివరికి మానాన్న గారు చూసిన సంభంధము కుదిరింది.   

పెళ్లి రంగ రంగ వైభవముగా జరిగింది, పార్వతి పరమేశ్వరులు అని దీవించారు, నాకు గవర్నమెంటు ఉద్యోగమూ వచ్చింది, నాన్న గారిని వదలి వేరొక ఊరులో ఉద్యోగ నిమిత్తము కాపురం పెట్ట వలసి వచ్చినది. (నాన్న గారు గుడిలో పూజారిగా ఉంటాను, ఈ వయసులో మీ మధ్య నేనెందుకు అని మమ్ము భాగ్య నగరానికి  పంపించారు.


ఇంతకీ నాపేరు చెప్పలేదు కదా, నాపేరు మాధవ్  భార్యపేరు రాధ

ఇక సంసారంలో సరిగమలు వినండి

నన్ను పొద్దున్నే రాధ నిద్ర లేపుతుంది వాకింగ్ పొమ్మంటుంది, తనేమో పాలు ఆలస్యముగా వస్తే వాడితో    గొడవ పెట్టు కుంటుంది, పని అమ్మాయి ముందు వస్తే నా నిద్ర చెడ గొట్టావ్ అని ఎగిరి పడు తుంది, నేను   తిరిగి వచ్చాక కూడా రుస రుస లాడుతూ ఉంటుంది,   పే పరు బాయ్ ఇంటిలోకి విసిరేశాడని వానితో గొడవ పెట్టు కుంటుంది, నేను ఎన్ని సార్లు చెప్పిన వాళ్ళతో తగాదా పడ కూడ దన్నా విని పించుకోదు, నన్నే ఉరిమి  ఉరిమి  చూస్తుంది, అప్పుడను కూనే వాణ్ని ఇలాంటి వాళ్ళను కాలమే బాగు చేయాలి,   నోటితో న్యాయం చెప్పఁటం కన్నా మౌనం గా ఉండుట మేలు అని తలచి కాపురము చేస్తున్నాను. టివి అదే పనిగా చూస్తుంది, సీరియల్సస్ లో లీనమై పోతుంది, వంటకాలు చూసి రోజు కొక  వంటకం తయారు చేస్తుంది .

ఏదన్నా అంటే ఈ వయసులో కాక ఏ వయసులో సుఖపడతాం అంటుంది, పిల్లలు మాత్రం ఇపుడే వద్దంటుంది, మీ సంపాదన పిల్లలు ఉంటే సరి పోదంటుంది. ఎవరు ఏమి చెప్పిన ఇట్టే నమ్మేస్తుంది, ఆఫీసులో ఆలస్య మైనదనుకో ఆరోజు నాకు పస్తే నోరు చేసుకొని కాపురం చేస్తుంది.

       

ఒక రోజు నాన్నగారు మా ఇంటికి వచ్చారు, ఎరా ఆలా ఉన్నావు, కోడల పిల్ల లేవ లేదా, వంట్లో      నలతగా ఉన్నది. అందుకని నేనే గ్రైండర్ లో పప్పు రుబ్బి దోశలు వేయుటకు నేను రడీగా ఉన్నా నాన్న, నీవు కాళ్ళు చేతులు కడుక్కొని రా, నీకు దోశలు పెడతాను, నాకు తొందర లేదురా, ఇప్పుడే రైల్లో దిగి ప్రక్కనే ఉన్న హోటల్లో టిఫిన్  తిని వచ్చానురా, నీవు ఆఫీసుకు పోతావేమోనని తొందరగా వచ్చాను, నీవు అమ్మాయి తినండి,  నీ పరిస్థితి చూస్తుంటే నాకు దిగులుగా ఉందిరా, నాన్న నేను ఆఫీసుకు పోయి  వచ్చాక అన్నీ మాట్లాడు కుందాం, నేను  కూడా నా స్నేహితుని కొడుకు మ్యారేజ్ చూసి వస్తాను . అమ్మాయికి ఒకేమారు చెప్పి పోతాను పిలుస్తావా.

రాధా అని పిలిచాడు.

         మావయ్యగారు ఎప్పుడు వచ్చారు, ఏమిటి  చెప్పకుండా వచ్చారు, సరేలేండి భోజనం చేసి మరి వెళ్ళండి.

ఏమిటే ఆ  మాటలు నాన్నతో

నేనేం తప్పు మాట్లాడ లేదు ఉన్న నిజం చెప్పా అంతేకదా

బాబు మీ సంసారం చూసాక మీకు కొన్ని విషయాలు చెప్పి వెళతాను అన్నాడు అట్లాగే నాన్న.   

ఏమిటండి, మీనాన్న నాకు చెప్పేది అన్నది

 మా నాన్నగారు వెళ్ళేదాకా అన్న నీ నోరు కంట్రోల్లో  పెట్టుకో, లేదా నేను చేయి చేసు కోవాల్సి ఉంటుంది,

ఏమిటి మీ చేయి లేస్తుంది, మీ నాన్న కోసం మీరు చెప్పినట్లుగా బుద్ధిమంతురాలుగా ఉంటాను నోరు ఎత్తను అన్నది.

చూడు బాబు మారాలి మారాలి భార్య అని ఆమె చెప్పిన వన్నీ కోపంతోగాని ప్రేమతో గాని చేయటం తప్పు కాదు,    కాని నేను ఉద్యోగం చేస్తున్నాను అని అహంకారము భార్య ముందు ప్రదర్శించ కూడదు, భార్య భర్తలలో ఎవరికి   ఎవరు ఎక్కువకాదు .. తక్కువ కాదు ... సమానమే

మనస్పర్థలు రాకుండా ఎప్పుడూ నవ్వుతూ ప్రతి విషయము  సాల్వు చేసు కోవాలి, పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆయన ఒకరి కొకరు ప్రేమను పంచుకొని సంసారాన్ని స్వర్గమయం చేసుకోండి, ఇంతకు ముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం నాముందు కీచులాటలు మాత్రం ప్రవర్తించ కండి.

మీ సంతోషానికి నేను అడ్డురాను, మీరు ఏ తిండి పెడితే అదే తింటాను, నాకు   పెన్షన్ వస్తుంది అది కూడా మీకే నేను ఇక్కడ ఉన్నంత కాలము మీకే ఇస్తాను.

మీరు చేయాల్సిందల్లా ఒక్కటే నాకు మనవుడో  మనవరాలో ఇవ్వండి వాళ్ళతో ఆడు కుంటూ ఇక్కడే ఉంటా .


అప్పుడే మావయ్యగారు నన్ను  క్షమించండి  తప్పుగా మాట్లాడితే మన్నించండి, మీరు ఇష్టమున్న రోజులు ఇక్కడ ఉండవచ్చు

నాన్న మీరు ఎక్కడికీ పోనక్కరల్లేదు ఇక్కడే ఉండండి.

మీరు కీచులాట లాడితే మాత్రము ఇక్కడ ఉండలేను ముందే చెపుతున్నాను.       
చీకటి పడింది, మావయ్యగారు పడుకొనే  గది చూపించి, మంచి నీళ్లు పెట్టి ఏ అవసరము వచ్చిన మీ అబ్బాయి నా సెల్లు నెంబర్లు ఇవి ఫోన్ చేయండి అనిచెప్పి పడక గది చేరి భర్తతో ఇంటి పనులు అన్నీ నే చూసు కుంటా, ఆఫీసు పనులు మీరు చూసుకోండి

అబ్బా ఈ రోజు పండు వెన్నలుగా ఉన్నది మంచం పై ఒకరికొకరు తన్మయత్వంలో మునిగి తేలారు, ఏవండీ నేను కూడా ఉద్యోగం చేయనా, మీ నాన్నగారు కూడా ఉన్నారుగా, ఇప్పుడు మనకు డబ్బుని గూర్చి ఆలోచించ వద్దు పిల్లలగురించి ఆలోచిద్దాం, అవునండి మనకు పిల్లలు కావాలి, మీ నాన్నగారు కూడా ఉండాలి,   (శంకరం మనసులో   అను కున్నాడు  ఇంట్లో పెద్దలు ఉంటె ఆ యిల్లు సుఖశాంతితో ఉంటుంది)   అంటూ    వారిరువురి హృదయాలు ఆనందంతో నిండినాయి.   
  --((*))--

మిణుకుమిణుకు కధ

#ఆఫీస్‌ నుండి వచ్చానో లేదో అన్నయ్య నుండి ఫోన్‌ వచ్చింది. వదినకి ఆరోగ్యం బాగా లేదని, బాగా నీరసమై పోయిందని చెప్పేసరికి గాబరా పడ్డాను. రెండిళ్ళ అవతలే అన్నయ్య కుటుంబం వుండేది. ఆలస్యం చెయ్యకుండా పరుగు పెట్టాను. దాదాపుగా అపస్మారక స్థితిలో వుంది వదిన. అబులెన్స్‌ రప్పించి, మా ఊర్లోనే వున్న ప్రసాద్‌ డాక్టర్‌ గారి దగ్గరికి తీసుకువెళ్ళాం. ''షుగర్‌ దాదాపుగా నాలుగు వందలు దాటింది. వెంటనే మీరు విశాఖపట్నం తీసుకెళ్ళిపోండి'' అని చెప్పగానే... అదే అంబులెన్స్‌లో విశాఖపట్నం తీసుకెళ్ళి కనకదుర్గ నర్సింగ్‌హోమ్‌లో జాయిన్‌ చేశాం.

అన్నయ్య గారబ్బాయి, కోడలు, పిల్లలతో కలిసి తిరుపతి వెళ్ళడం వల్ల... పూర్తి బాధ్యత నామీద పడింది. వదినకేమైనా అయితే తాను ఒంటరినై పోతానేమోనని అన్నయ్య భయపడిపోతూ... ఏడుస్తున్నాడు కూడా. అన్నయ్య ఏడవటం నేనెప్పుడూ చూడలేదు.

అందరికీ ఒకటే అనుమానం... వదిన ఇంక బతకదనే వారి నమ్మకం.
మరోవైపు వదినని ఎలాగైనా బతికించుకోవాలని తాపత్రయం నాది.

డాక్టర్లందరితోనూ మాట్లాడుతూనే వున్నాను. వదినకి షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోవడం వల్ల కిడ్నీ కూడా పనిచేయడం తగ్గిపోయింది. ఎవ్వరికీ ఎటువంటి ఆశలూ లేవు... నాకు మాత్రం ఏదో నమ్మకం... చిన్ని ఆశ ఏ మూలనో మిణుకుమిణుకు మంటూ వుండే దీపంలా కన్పిస్తోంది.

అన్నయ్య గారబ్బాయినీ, బంధువుల్నీ, దగ్గరివాళ్ళనీ రమ్మని అందరికీ కబుర్లు పంపేశారు. ఇవాళ్ళో రేపో ప్రాణం పోతుందన్నట్లుగా ఉంది వారి తీరు. నా ప్రయత్నం ఆపలేదు.

నా పరిచయాన్ని ఉపయోగించి మంచి డాక్టర్లనీ రప్పించాను. రెండ్రోజుల్లోనే షుగర్‌ లెవల్స్‌ బాగా తగ్గి, నార్మల్‌కి వచ్చేయి. కిడ్నీ పనితీరు కూడా సాధారణ స్థితికి వచ్చేసింది. వారం రోజుల్లో డిశ్చార్జ్‌ చేసేశారు. వదిన మరలా బతికి ఇంటికి వస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. తనలా వచ్చేసరికి... అన్నయ్య ముఖంలో ఏదో తెలీని ఆనందం. అవధులు లేని ధైర్యం కొట్టొచ్చినట్టుగా కన్పించడమే కాకుండా... నేనంటే అన్నయ్యకి ప్రత్యేకమైన అభిమానం, నమ్మకం ఏర్పడ్డాయి.

ఎవరెంతగా నిరుత్సాహ పరిచినా నేను వెనక్కి తగ్గలేదు. చివరి క్షణం దాకా ప్రయత్నిస్తూనే వున్నాను. ఏదైతేనేం ఫలితం దక్కింది. వదిన మామూలు మనిషయింది.
ఇంత జరిగినా అన్నయ్య ఒక్కడే సంతోషంగా వున్నాడు. మిగిలిన వాళ్ళంతా నిరుత్సాహంగానే వుండటం నేను గమనించకపోలేదు.
డబ్బు బాగా ఖర్చయిపోయిందనీ, తాము చనిపోతుందని చెప్పిన మనిషి, మరలా లేచి కూర్చుందనీ, తాము చెప్పింది నిజం కాలేదనీ... ఇలా ఏవేవో కారణాలతో వారు అసంతృప్తిగా వున్నారనే విషయం స్పష్టంగానే తెలుస్తోంది.
కాలచక్రం గిర్రున తిరిగింది.
ఐదు సంవత్సరాలు ఏమీ కాకుండానే గడిచిపోయాయి. వదిన ఆరోగ్యం పదిలంగానే ఉంది. అన్నయ్య ఆరోగ్యం కాస్త క్షీణించింది. అన్నయ్య నావైపు మరలా ఆశగా చూశాడు. నా ప్రయత్నం మరలా మొదలు పెట్టాను. మరలా విశాఖపట్నం తీసుకెళ్ళాలని నా వుద్దేశం. మరలా డబ్బు ఖర్చయిపోతుందేమోనని వారి భయం. అయినా అన్నయ్యను దక్కించుకోవాలంటే తప్పదు. దాదాపుగా బలవంతంగానే వాళ్ళకి పూర్తిగా ఇష్టం లేకపోయినా నా కారులో ఆసుపత్రి వరకూ తీసుకెళ్ళగలిగాను. పరీక్షలన్నీ అయ్యాయి. అవసరమైన మందులన్నీ ఇచ్చారు. నాకన్నా శ్రద్ధగా అన్నయ్య కోసం ఆలోచిస్తున్నట్లుగానే అన్పించింది. వాళ్ళపై నాకు నమ్మకం కలిగింది.

కానీ అన్నయ్యకు కలగలేదు. లేదు, బాగానే చూపిస్తున్నారులేమని చెప్పి, అన్నయ్యను నమ్మించాను.

దాదాపుగా ప్రతిరోజూ అన్నయ్యను కలిసేవాడిని. గతంలో తిరిగినట్లుగా బయటకు వెళ్ళలేకపోయేవాడు. ఇంటికే పరిమితమయ్యాడు.

ఏం కావాలంటే అవి కొని, ప్రతిరోజూ పట్టుకెళ్ళేవాడ్ని. కాసేపు కబుర్లు చెప్పి వచ్చేసేవాడ్ని.

అనుకోకుండా ఏవో పనులు తగిలినా, అన్నయ్యను కలవటం మానలేదు. అన్నయ్య కొడుక్కి ఇంకేం ట్రీట్‌మెంట్‌ చేస్తే బాగుంటుందో చెప్పి, అలా చేయించమని చెప్పేవాడ్ని ఎప్పటికప్పుడు. అన్నయ్య ఆరోగ్యం బాగవుతుందనే తప్ప, వేరే వుద్దేశ్యం నాకు లేదు.
ఒకసారి అనుకోకుండా అన్నయ్య గారమ్మాయి నుండి నాకు ఫోనొచ్చింది. 

''ఏంటి మీరు మా నాన్నగార్కి హాస్పిటల్‌ ట్రీట్‌మెంట్‌ చేయించమని మా తమ్ముడ్ని రోజూ సతాయిస్తున్నారట. ఆ మధ్య మా అమ్మ కోసమని మూడు లక్షల ఖర్చు పెట్టించారు. ఇప్పుడేమో మా నాన్న కోసం ఖర్చు పెట్టిదామనుకుంటున్నారు. వీళ్ళని చూసుకోవడం తప్ప, మా తమ్ముడింక బాగుపడక్కర్లేదా? జీవితాంతం వాళ్ళ గురించే వున్న డబ్బంతా ఖర్చు చేసేస్తే, ఇంక వాడు బతకక్కర్లేదా?'' దాదాపు నాకు వార్నింగ్‌ ఇచ్చింది.
ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ''అలాగే తల్లీ... నేన్జేసింది తప్పే'' అని మాత్రం చెప్పి ఫోన్‌ పెట్టేశాను.
ఈ సంఘటన జరిగిందగ్గర్నుండి నాకు లోలోపల ఏదో అపరాధ భావన కలిగేది. అన్నయ్య వద్దకు వెళ్దామనుకునేవాడ్ని. మరలా వెనకడుగు వేసేవాడ్ని.
అన్నయ్య ఫోన్‌ చేస్తేనే తప్ప వెళ్ళడానికి సంశయించేవాడ్ని.

అన్నయ్య వెళ్ళిన ప్రతిసారీ ఏవొక ఆరోగ్య సమస్యలు ఏకరువు పెట్టేవాడు. నేను అన్నయ్యని హాస్పిటల్లోకి తీసుకెళ్తే, వారిపరువుకి ఏదో భంగం కలిగినట్లు భావించేవారు. వాళ్ళు తీసుకెళ్ళేవారు కాదు. చివరికి ఒకసారి నేను ఆఫీస్‌ నుండి ఇంటికి చేరుకోగానే కబురొచ్చింది... పిలిచినా అన్నయ్య పలకడం లేదని!

మరలా యథావిధిగా పరుగు పెట్టాను. అప్పటికే అన్నయ్య గుండె ఆగిపోయింది. అంబులెన్స్‌, డాక్టర్లూ... అందర్నీ పిలిచినా వృథా ప్రయత్నమే అయ్యంది. ఏదైతేనేం... అన్నయ్యను మా నుండి దూరం చేసుకున్నాం. చివరకు వదిన ఒంటరయ్యింది. అన్నయ్య లేని జీవితాన్ని అలవాటు చేసుకోవటం మొదలుపెట్టింది. ఏదేమైనా డబ్బు కోసం కొడుకు, కోడలి మీద ఆధారపడాల్సిందే. 
వదిన పేరున కోట్ల విలువైన ఆస్తి వుంది. అన్నయ్య, వదినలకు నలుగురు సంతానం. ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. అబ్బాయికి కూడా పెళ్ళయిపోయింది. ఆడపిల్లలు వాటాలడుగుతారేమోననే భయంతోనో, మరే కారణంతోనో అన్నయ్య కొడుకు... వదిన పేరనున్న ఆస్తినంతా తన పేరున రాయించేసుకున్నాడు. అదే వదిన పాలిట శాపమవుతుందని భావించి వుండదు పాపం! కొడుకు పేరునే కదా అని మరో ఆలోచన లేకుండా సంతకాలు చేసేసింది. 
అనుకోకుండా ఆ వెంటనే వదిన ఆరోగ్యం పాడయింది. మరలా షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోయాయి. తూతూమంత్రంగా ట్రీట్‌మెంట్‌ జరుగుతుందే తప్ప, సరైన చికిత్స అందలేదు. డయాబెటిక్‌ రెటినోపతి వచ్చి కంటి చూపు బాగా తగ్గిపోయింది. వదినకు ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరిపైనా ఆధారపడడం ఇష్టముండేది కాదు. తన వంట తనే చేసుకునేది. కంట్రోల్‌ లేకుండా తినేయటం వల్లే షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోయాయని, అందుకే చూపు కూడా పోయిందని తేల్చింది కోడలు. అన్నయ్యగారబ్బాయి కాదనలేదు. దాంతో వదిన దగ్గరున్న గ్యాస్‌ సిలెండర్‌ను వెనక్కి తీసేసుకున్నారు. ఫలితంగా కోడలు పెట్టిందే తప్ప అంతకు మించి తినే అవకాశం లేకుండా పోయింది. వదినది భారీ కాయం. ఏ మూలకీ రానంత తక్కువ తిండి ఆమెను బలహీనపరిచింది. దానికి తోడు ఆత్మాభిమానం చచ్చి మరింత కుంగిపోయింది. వదినని చూసి బాధపడటమే నా పనయింది.
ప్రతిరోజూ వెళ్ళినా గానీ, ఏం చెప్పినా గాని పట్టించుకునేవాళ్ళే లేకపోయారు. నేనేం తీసుకెళ్ళి పెట్టినా, తిననిచ్చేవారు కాదు. ట్రీట్‌మెంట్‌ చేయిద్దామని చెప్తే, చేయిస్తున్నాం కదా అనేవాళ్ళు. వారికి నచ్చిన మందులు ఇవ్వటమే కాని, డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్ళేవారు కాదు. నాతోపాటు ఇరుగుపొరుగు వారెవరు చెప్పినా వినిపించుకునేవారు కాదు.
వదిన మంచం పట్టింది. లేచి నిలబడే శక్తి కూడా లేకుండా పోయింది. మంచం పైనే అన్నీను. ''ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, తీసుకెళ్దాం'' ఈ సారి గట్టిగానే చెప్పాను.
''హాస్పిటల్‌ ఖర్చు ఎంతయినా నేను భరిస్తాను'' అని చెప్పాను. వారి నుండి అవునని గానీ, కాదనిగానీ ఏ సమాధానమూ లేదు. వదిన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఏం జరిగిందో తెలీదు. తిండితో పాటు, బీపీ టాబ్లెట్లు కూడా తగ్గించేశారేమో... వదిన మాట కూడా పడిపోయింది. తనకి అడిగే శక్తి లేదు. అడగాలనే ఆసక్తి వున్నా, మూగదైపోయిన నోరు ఆమెకు ఆ అవకాశం లేకుండా చేసింది. కళ్ళముందే అంతా జరుగుతున్నా, నైతిక విలువలు, కుటుంబ విలువలూ పతనమవుతున్నా... నేనూ మూగవాడ్నే అయ్యాను. నా మాటలు ఎవరూ వినిపించుకోలేదు. వదిన వేదననీ, నా ఆవేదననీ పట్టించుకునే వారే కరువయ్యారు.

ఏ కొంచెమో తిండి తినగలిగే నోరు, మింగే శక్తి కోల్పోయి, కేవలం ద్రవ పదార్థాల్ని మాత్రమే స్వీకరించే దీనస్థితికి చేరుకుంది.

ఈ సారి నోరు విప్పక తప్పలేదు. ''తల్లిదండ్రులనేవారు మనకి గొప్ప ఆస్తి. వారిని కాపాడుకోవటం మన విధి. కనీస చికిత్స చేయించకుండా వదిలేయటం దారుణం. తిండి తినలేని పరిస్థితుల్లో కూడా, మనం మెడికల్‌గా సపోర్టు ఇవ్వకపోవటం అత్యంత హేయం. ఆమెక ఖర్మకి ఆమెని వదిలేసి ఎప్పుడు చనిపోతుందా అని ఎదురు చూడటం... ఇంతకు మించిన ఘోరం ఇంకేముంటుంది? మీరు తీసుకెళ్తారా లేకుంటే నన్ను తీసుకెళ్ళమంటారా? ఏదో ఒకటి తేల్చుకోండి...'' దాదాపుగా పెద్ద గొడవే చేశాను.
మొక్కుబడిగా తీసుకెళ్ళి, ఒక్క రోజు మాత్రమే ఆసుపత్రిలో వుంచి, ఎవరికీ చెప్పకుండా వెనక్కి తీసుకొచ్చేశారు. కాని ఒక్క రోజులోనే ఆమెకి ఆరోగ్యం ఎంతో మెరుగు పడింది. ఎందుకు ఇంటికి తీసుకొచ్చారో కారణం వారికే తెలియాలి మరి! ఏదైతేనేం ఆమెను మంచానికే పరిమితం చేశారు.
రెండ్రోజుల్లోనే కోమాలోకి వెళ్ళిపోయింది. నోట్లో వేసినవి మింగటం తప్ప, చూపులేదు, మాటా లేదు. కనీసం ట్రీట్‌మెంటూ చేయించటం లేదు. దాదాపుగా పదిహేను రోజులు అలాగే గడిచిపోయాయి. తిండి లేకుండా, అనారోగ్యంతో వున్న వారెవరైనా అన్ని రోజులు ప్రాణంతో వుండగలరా? ఆరోగ్యంగా వున్నవాళ్ళు సైతం తిండి లేకపోతే ఆకలితో చచ్చిపోతారు. 
అన్నయ్య గారబ్బాయితో చెప్పాను... ''ఇప్పటికైనా డాక్టర్లకు చూపిద్దాం. కనీసం సుఖంగానైనా చచ్చిపోతుంది. ఇది కూడా హత్యే. ఇలా వదిలేయడం, తల్లి అనే దయాదాక్షిణ్యం కూడా లేకుండా తిండి లేని పరిస్థితుల్లో చంపేయటం క్రూరమైన హత్య కాకపోతే మరేమిటి?''
విన్నా విననట్లే వుండిపోయాడు. పదిహేను రోజులు ప్రాణంతో అచేతనంగా పడి వున్నా పట్టించుకోని ఆత్మీయులున్నారని తెలిసి, మర్నాడే ప్రాణం వదిలేసింది. ఏడుపాగలేదు నాకు. కళ్ళముందే నదిలో మునిగిపోతునన వ్యక్తిని కాపాడకుండా చూస్తూ వుండిపోవటం లాంటిదే ఇది.
ప్రమాదం జరిగి రక్తంతో రోడ్డంతా తడిసిపోయి, గిలగిల కొట్టుకుంటున్న ప్రాణాన్ని, ఏ ఆసుపత్రికీ తీసుకెళ్ళకుండా, ఏ సాయమూ చేయకుండా వదిలేసినట్లే అనిపిస్తోంది. నా నిస్సహాయ స్థితికి నన్ను నేనే నిందించుకున్నాను. ఈ పాపంలో ఎంతో కొంత నాక్కూడా భాగముందంటే అది అబద్దం కాదు. వదిననను ఈసారి కాపాడుకోలేకపోయాననే అపరాధ భావన నన్ను బాధిస్తోంది. గతంలో అన్నయ్య నాకు మద్దతుగా వున్నాడు. ఈసారి నాకు మద్దతిచ్చినవారే లేరు. వదిన వారికెవరికీ అక్కర్లేని ప్రాణమైపోవటం చాలా బాధగావుంది. తల్లిదండ్రులు సైతం అక్కర్లేని వారిగా, పనికిరాని వారిగా నేటి కాలంలో మారిపోతున్నారా అన్పించింది. 
వదిన కర్మకాండలు ఘనంగా జరిగాయి. మేళతాళాలతో, తప్పెడుగాళ్ళతో కోలాహలంగా సాగాయి. ఎక్కడా తక్కువ చేయలేదు. పెద్ద ఖర్మకి కూడా మరింత ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పత్రికలలో ప్రకటనలు - 'నీవు చనిపోయిననూ మా మదిలో నిలిచే వుంటావు... నీవు లేకపోయిననూ నీ జ్ఞాపకాలతో బతికేస్తాం'. 
అవాజ్యమైన ప్రేమను ఒలకబోస్తూ రాతలు... ఆమెకి కనీసం చివరి రోజుల్లో తిండి పెట్టకపోయినా, వేలాదిమందికి పెద్ద ఖర్మ రోజున విందు భోజనాలంట... ఆమె కడుపు కాలి మరణిస్తే, ఆమెకిష్టమైన కూరలూ, వంటకాలని చెప్పి వచ్చిన వారందరికీ వడ్డిస్తారట. 
ఆమె పేరున స్వయం పాక దానాలూ, నిలువెత్తు హోర్డింగులూ, బ్రాహ్మణులతో పూజలూ, గోదానం, వస్త్రదానం, ఛత్రదానం, పాదుకా దానం... ఒకటా రెండా! బతికున్నప్పుడు ఆమె బతిమిలాడినా కాశీకి తీసుకెళ్ళనివారు, కుటుంబమంతా ఆమె అస్థికలను కాశీకి తీసుకెళ్ళి గంగలో మునుగుతారంట. ఇవన్నీ చూస్తుంటే బాధగా, వింటుంటే కర్ణకఠోరంగా అన్పిస్తోంది. పూజలు జరుగుతుండగానే మధ్యలో లేచాను.
''బాబారు... ఉండండి... వెళ్ళిపోతున్నారేమిటి?'' మాటలు విన్పిస్తున్నాయి. కలకలం రేగిందక్కడ. 
మనస్సాక్షి అంగీకరించలేదు. మనిషిని బతికించడానికి పంచినా పర్వాలేదు... ఇంత క్రూరంగా చంపేశాక, ఇవన్నీ ఎవరికోసం?
వడివడిగా అక్కడ నుండి దూరంగా వచ్చేశాను.
*రచయిత - డా||ఎమ్‌.వి.జె.భువనేశ్వరరావు గారు*
****
ఉద్ధవ గీత

ఉద్ధవుడు శ్రీ కృష్ణుడికి చిన్ననాటి నుంచే ఎన్నో సేవలు చేసేవాడు. ఆయనే కృష్ణుడికి రథసారధి కూడా . కాని ,తను చేసే సేవలకు ఎప్పుడూ ఏ ప్రతిఫలము ఆశించలేదు.

ద్వాపర యుగంలో తన అవతారం చాలించే ముందు, శ్రీ కృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి ,”ఉద్ధవా! నా అవతార కాలంలో ఎంతో మంది నా నుంచి ఎన్నో వరాలను ,బహుమతులను పొందారు. కాని ,నీవు ఎన్నడూ నన్ను ఏదీ కోరలేదు . కనుక నీకు ఏదన్నా ఇవ్వాలని ఉంది ,ఏమి కావాలో కోరుకో ?” అని ప్రేమగా అడిగారు.

అప్పుడు ఉద్ధవుడు ,”దేవా! నీ లీలలను అర్ధం చేసుకోవటం మా తరం కాదు, నాకు ఏ వరము వద్దు కాని,నిన్ను ఓక ప్రశ్న అడుగుదాము అనుకుంటున్నాను,అడుగవచ్చునా? “,అని వినయంగా ఇలా అడిగాడు ,“కృష్ణా !నీవు మా అందరికీ జీవించటానికి ఇచ్చిన సందేశము ఒకటి కాని నీవు జీవించిన విధానము మరొకటి.మహాభారత యుద్ధములో,నీవు పోషించిన పాత్ర ,తీసుకున్న నిర్ణయములు ,చేపట్టిన పనులు నాకేమి అర్ధం కాలేదు.దయచేసి నా సందేహములను తీర్చి నన్నుఅనుగ్రహించండి అని కోరుకున్నాడు.

దానికి కృష్ణుడు ,” “ఉద్ధవా ! ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధించాను. ఈ నాడు నీకు ఉద్ధవ గీతను బోధించటానికి ఈ అవకాసాన్ని కలిపిస్తున్నాను. నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో
తప్పకుండా అడుగు.” అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు.ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగటం మొదలు పెట్టాడు.”కృష్ణా పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా!నిన్ను గుడ్డిగా నమ్మారు కూడా . నువ్వు వారి వర్తమానము ,భవిష్యత్తు తెలిసినవాడివి . అటువంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు?మంచి మిత్రుడు అలాంటి వ్యసనములను ఎక్కడన్నా ప్రోత్సహిస్తాడా ?” పోని, ఆడనిచ్చావే అనుకో ,కనీసం వారిని గెలిపించి ఆ కౌరవులకి బుద్ధి చెప్పి ఉండ కూడదా ? అది కూడా చెయ్యలేదు. ధర్మజుడు ఆస్తంతా పోగొట్టుకుని వీధినపడ్డాడు . ఆఖరికి తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డుపడి వాళ్ళని కాపాడుండచు కదా?

కౌరవులు దుర్బుద్ధితో పరమ సాధ్వి అయిన ద్రౌపదిని, జూదంలో మోసం చేసి గెలిచారు.
కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో పాండవులని గెలిపించలేదు… ఎప్పుడో ఆవిడ
గౌరవానికి భంగం కలిగినప్పుడు ,ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు.సమయానికి ఆదుకున్న ఆపద్భాందవుడవని గొప్ప పేరుపొందావు. కాని ముందే నీవు కలుగచేసుకుని ఉంటే ఆమెకి
నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా .సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడని పించుకుంటాడు . నీవు చేసినదేమిటి స్వామి?, అని ఉద్ధవుడు ఎంతో బాధతో కృష్ణిడిని తన ఆంతర్యమేటో తెలుపమని ప్రార్ధించాడు.

నిజానికి ఈ సందేహములు మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి. కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో ఉధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతను ఈ క్రింది విధంగా బోధించాడు.“ఉద్ధవా! ప్రకృతి ధర్మ ప్రకారం అన్ని విధాలా జాగ్గ్రత్త పడేపది తగిన చర్యలను తీసుకునే వాడే గెలుపుకు అర్హుడు. దుర్యోధనుడికి జూదములో ప్రావీణ్యము లేకపోయినా ఆస్తిపరుడు. కనుక తన అర్హత ప్రకారం ఆస్తిని పణంగా పెట్టాడు.ఎంతో తెలివిగా తన మామ చేత పందెమును వేయించాడు., ధర్మరాజు మాత్రం , పందెములను నా చేత వేయించాలి అని అనుకోలేదు ,నా సహాయమును కోరలేదు.

శకుని , నేను ఆడి ఉంటె జూదము ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెమును శకుని వేయగలిగేవాడా? లేక అతను చెప్పిన పందెము నాకు పడేది కాదా ? నీవే చెప్పు ?సరే ఇదిలా ఉంచు, ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటంటే, “నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను . కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు ,ఇటువైపు ఎట్టి పరిస్థితిలో కూడా కృష్ణుడు రాకూడదు.” అని ప్రార్ధించాడు. దాంతో ఏమీ చేయలేక చేతులు కట్టుకుని ,తన పిలుపుకోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను.ధర్మజుడు సరే భీముడు,అర్జునుడు,నకుల సహదేవ్వులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారేకాని ఏ మాత్రము నా సహాయము కోరలేదు. అలాగే ద్రౌపది కూడా. దుస్సాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో అందరితో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతలనే నమ్ముకుంది.

చివరికి తన ప్రయత్నములన్నీ విఫలమయ్యాక గొంతెత్తి నన్ను పిలిచింది, సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి నేను ద్రౌపదిని ఆ నాడు రక్షించలేదా? అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు.కృష్ణిడి సమాధానములకి ఉద్ధవుడు భక్తితో చెలించి ,కృష్ణా !అలాగైతే మాలాంటి సామాన్యులు సంగతి ఏంటి ? మేము చేసే కర్మలలో కూడా నీవు కోరితే కల్పించుకుని సహాయం చేస్తావా?అవసరమైతే మమల్ని చేదు కర్మలు చేయకుండా కాపాడుతావా? అని చక్కటి ప్రశ్న వేశాడు ఉద్ధవుడు .దానికి శ్రీ కృష్ణుడు చిన్నగా నవ్వుతూ ,”ఉద్ధవా ! మానవ జీవితం, వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను , వాటిలో కలుగ చేసుకోను. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను అదే భగవంతుని ధర్మము “ అని వివరించాడు.

ఉద్ధవుడు ఆశ్చర్య చెకితుడై “ అయితే కృష్ణా ! మేము తప్పుదారి పట్టి పాపములను మూట కట్టుకుంటుంటే నువ్వలా దగ్గెరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా ,ఇదెక్కడి ధర్మము అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు “ఉద్ధవా ! నీ మాటలను నీవే జాగ్రత్తగా గమనించు . నీకే అర్ధమవుతుంది.భగవంతుడు నీతోనే ,నీలోనే ఉన్నాడని , నిన్ను దగ్గెరుండి గమనిస్తున్నాడని గుర్తించినప్పుడు, నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు ?”ఈ సత్యాన్ని మరిచినప్పుడే మానవుడు తప్పు దారి పడతాడు అనర్ధాలని కొని తెచ్చుకుంటాడు . ధర్మరాజు జూదము గురించి నాకు తెలియదనుకోక పోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నాను అని అతను గుర్తించి ఉంటే ఆట పాండవులకు అనుగుణంగా సాగేది “ అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీ కృష్ణుడు.కృష్ణుడు బోధించిన మధురమైన గీతను విని ఉద్ధవుడు ఎంతో ఆనందించి తన సంశయములన్నిటినీ తీర్చినందుకు కృతజ్ఞతా భావంతో కృష్ణుడిని నమస్కరించాడు.

నీతి:

పూజలు ,ప్రార్థనలు భగవంతుడి సహాయమును కొరటానికి చేసే కర్మలే కదా! కాని, సంపూర్ణ విశ్వాసము వీటికి తోడైతే అంతటా ఆయనే కనిపిస్తాడు. భగవద్ గీతలో కూడా శ్రీ కృష్ణుడు ఇదే బోధించా
డు .

యుద్ధములో అర్జునిడికి కృష్ణుడు రథ సారధిలా వ్యవహరించి అతనికి కర్తవ్యమును బోధ చేసాడే కాని , అతని బదులు స్వయంగా యుద్ధము చేయలేదు . అలాగే మనలో ఉన్న భగవంతుడిని గుర్తించి ఆయనని మన జీవిన రథసారధి చేసుకుంటే మనకి కూడా అర్జునిడిలా అన్నిట్లో తప్పక విజయం కలుగుతుంది. మన మంచి చెడులను ఆ భగవంతుడే చూసుకుంటాడని నమ్మాలి. ఆ నమ్మకమే మనని అన్ని వేళలా కాపాడుతుంది!

--(())--
 
****
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - ఏకాగ్రత (10 )
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

( సృష్ఠి ) కాల చక్రం.,పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది ఇప్పటివరకు ఎంతో మంది శివులు  
ఎంతోమంది విష్ణువులు , ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు, ఇప్పటివరకు 50 బ్ర,హ్మలు వచ్చారు.
ఇప్పుడు నడుస్తుంది 51 వాడు. 
అయినా ఈ శరీరముకోసం వెంపర్లాడకతప్పదు, ఈ శారీరపోషణకొరకు , సంపదకొరకు, ప్రేమ  కొరకు  ఇలా ....ఇలా  జాడ్యాలకు చిక్కి నోరులేని జీవాలాగా  యుగ యుగాలు జరిగిపోతున్నాయి 
శరీరం , మనస్సు,  బుద్ధి,   ఆత్మ ,  సర్వాత్మ. (మహా శూన్యం)
శరీరం నుండి సర్వాత్మ దగ్గరికి వెళ్లి, మళ్లీ సర్వాత్మ దగ్గర నుండి శరీరానికి వచ్చే ప్రయాణం పేరే 'ధ్యానం'.
ప్రపంచాన్ని చూడు. 
తనలో ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నాను అని చూడు., 

1 కృతాయుగం, 2 త్రేతాయుగం, 3 ద్వాపరయుగం, 4 కలియుగం నాలుగు యుగాలకు 1 మహయుగం, 71 మహ యుగాలకు 1మన్వంతరం, 14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)
15 సందులకు ఒక ప్రళయం (, క కల్పం) , 1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  
1000 యుగాలకు ఒక రాత్రి  (ప్రళయం.) , 2000 యుగాలకు ఒక దినం., ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం. , ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి , 1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు. , 7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు .14 మంది మనువులు., ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. శ్వేతవరాహ యుగంలో ఉన్నాం, 5 గురు భాగాన కాలంకు 60 సం 
1 గురు భాగాన కాలంకు 12 సం, 1 సంవత్సరంకు 6 ఋతువులు, 1 సంవత్సరంకు  3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి, 1 సం. 12 మాసాలు, 1 సం.  2 ఆయనాలు, 1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు , 27 నక్షత్రాలు - వివరణలు, 12 రాశులు, 9 గ్రహాలు, 8 దిక్కులు, 108 పాదాలు, 1 వారంకు 7 రోజులు, పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.
ఇలా కాల చక్రం కదులుతుంది దీనితో మానవుని మేధస్సు అనే చక్రం కదులుతుంది 

మొదటిది- వ్యవహారం; రెండవది- అనుభవం.
కలకు నిద్ర ఆధారం,.ప్రపంచంకు మాయ ఆధారం.
అనుభవం  కలల పాలవుతున్నది, వ్యవహారం విజృంభిస్తున్నది , తెలివిగలవాణ్ణి నిద్రముంచేస్తుంది, ప్రపంచం అంతా మాయ కమ్ము కుంటున్నది. మరి ఏకాగ్రతకు దారి ఏది ?
నిగ్రహశక్తి , అనుగ్రహశక్తి తోడైతే ఉకాగ్రత తప్పక లభించును 

--(())--     

గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 30 📚

దేహీ నిత్య మవధ్యో-యం దేహే సర్వస్య భారత |
తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి || 30

సృష్టి సమస్తమూ ఒక దిశగా వ్యక్తమగుచుండగా, మరియొక దిశగా అవ్యక్తమును చేరుచూ మరల వ్యక్తమగుచుండును. వ్యక్తము కానపుడు సూత్రప్రాయముగను, వ్యక్తమగునపుడు రూపాత్మకముగను ఒకే తత్త్వము నిలచియున్నది.

చోటులోని కనపని నీరు వర్షమైనప్పుడు వ్యక్తముగను, భూమికి చేరి ప్రవహించునపుడు 'నది' యగును. ఉత్తర దక్షిణ ధృవములందు కఠినమైన మంచుగడ్డ యగును. సూర్యరశ్మిచే మరల క్రమశః చోటును చేరును. మరల అవ్యక్త మగును. కాలక్రమమున మరల వర్షముగ వ్యక్తమగును.

సృష్టిలోని సమస్త వస్తువులూ అట్టివే. వ్యక్తావ్యక్తముగ చక్ర భ్రమణమున అగుపించుచూ అదృశ్యమగుచూ, నిరంతరమూ వుండును.

ఈ ధర్మమును తెలిసినవాడు దేనికిని శోకింపడు. అతనికి జననము - మరణము అనునవి మిథ్యా పదములే. కనుక జీవుల పుట్టుకయందు ఉత్సాహము, మరణము నందు దుఃఖము వానికి కలుగవు.

పుట్టునవి - చచ్చునవి అని ఏమియూ లేవు. శాశ్వత దర్శన మొక్కటే యుండును. దానియందతడు ఉపస్థితుడై యుండును.

ఇట్టి దర్శనము మాత్రమే సమస్త శోకముల నుండి జీవుని తరింప జేయగలదని 'గీతోపనిషత్తు' బోధించు చున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

[15:
 *****************************
నేటి నా పాట పాట సంఖ్య:-605.
******************************
రచన:- మహేష్ వూటుకూరి  ✍️
9640713717.
దోర్నాల.
 ప్రకాశం జిల్లా.
12/04/2023.
***************
పాట సందర్భంపై నా విశ్లేషణ.
***************************
ఓ  కోట్లకు పడగెత్తినోడికి ఎంత మంది అమ్మాయిలు చూసినా నచ్చడు .. ఓ మద్యతరగతి అమ్మాయి నచ్చుతుంది..కాని   వారికి డబ్బున్న వాళ్ళంటే నచ్చదు.
 అమ్మాయి కి అబ్బాయి ఇష్టమే  కాని కుటుంబం మాటే నా మాట అంటుంది. ఇలా ఒకరికొకరు  ఇష్టం అయిష్టాల మద్య  అందరిని ఒప్పించే ప్రయత్నం తన ప్రేమ ను నెగ్గించుకొనే ప్రయత్నం లో అన్ని వదులుకొని వస్తాడు
 నీవు ఒప్పుకునే వరకు నీ  ఇంటి ముందే కుక్కలా ఉంటానని వేడుకుంటాడు. అందరి మనసు కరుగుతుంది
 ప్రేమ విజయవంతం అవుతుంది. అన్ని సంఘటన లతో సాగుతోంది ఈ పాట.
**********************************************
పల్లవి:-
*********
ప్రాణం పోసుకున్నా 
అజంతా శిల్పమా
ఎన్నాళ్ళుగానో  
వెతుకుతున్నానే నీ కోసమే.!!

అభిమానం మెండుగున్నా
మద్యతరగతి నిరాడంబరమా..
అన్ని ఉన్నా నాకు 
లేనిది  నీ తోడేనే!!

!!ప్రాణం పోసుకున్న 
అజంతా శిల్పమా!!
చరణం:-
**********
ఎంతగా ప్రేమించినా వరమే ఇవ్వవు
ఎంతగా ఆశించినా  ఇసుమంతైనా చలించవు
ఇలా నీవు ఉండటంతో నాలో మరింతగా
నీపై ప్రేమ పెరిగెనే అందమా అపురూపమా..
సిరి చందనపు చిరునవ్వుమా..!!

నీ ఆటలు నా కాడా సాగవులే
మా ఇంటి మాటే నా మాటలే
నీ పప్పులు మాకాడా ఉడకవులే
మాదంతా ఒకటే మాటలే..!!

అంతస్తులు  అహంకారాలు మీరులే
అంతంత మాత్రపు జీవితాలు మావిలే
నక్కకు నాగలోకమంతా దూరములే
మీకు మాకు పొసగదులే మా జోలికి రాకులే..!!
పల్లవి:-
*********
ప్రాణం పోసుకున్న
అజంతా శిల్పమా
 చరణం:-
***********
నొప్పించనులే  ఎవ్వరిని
ఎట్లాగైనా ఒప్పిస్తానులే  అందరిని
నిప్పులా కాల్చినా నీటిలో  నాన్చినా
భరిస్తున్నానే నీకోసం 
సహిస్తున్నానే మన ప్రేమ కోసం!!

కొత్తగా వెతకను ఆశలే లేవసలు
నువ్వేనే నా సర్వస్వం 
నీకై  నా జీవితమంతా  ఎదురు చూస్తానే వుంటానే
నీవు కాదన్నా అవునన్నా నువ్వేలా   ఈ జన్మకీ నా శ్రీమతివి నేనేలే  నీ శ్రీవారిని.!!

అన్ని వదిలేసుకోని వచ్చాను 
చచ్చేవరకు  ఇట్లాగే వుంటాను
అశలన్ని వదులుకోని వచ్చానులే
నీ ఇంటి ముందు కుక్కలా  కాపలా కాస్తుంటా..

నీవు కరుణించి ముద్దపెడితే తింటానే
ముద్దు పెడితే బ్రతుకుతానే 
నీ ప్రేమ కోసమే నే  మరణిస్తానే..
ఓ నా ప్రేమా ఓ  నా ప్రాణమా నా ప్రియతమా.
 పల్లవి:-
******
ప్రాణం పోసుకున్న
అజంతా శిల్పమా
అభిమానం మెండుగున్నా 
మద్యతరగతి నిరాడంబరమా..!!
****************************

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ