మర్రిచెట్టు కొమ్మకు 60 వేల మందా అందునా తలకిందులుగానా !

.............................................

మర్రిచెట్టు కొమ్మకు 60 వేలమందా అందునా తలకిందులుగానా !

 

ఎలాగో  తెలుసువాలంటే  సమాచారం పూర్తిగా చదవల్సిందే. కాస్తా ఎక్కువగానే వుంది, అయితేనేమి బాగుంది.


తిరునెల్వేలి జిల్లాలోని తిరుక్కురుంగుడి అళగియ నంబి పెరుమాళ్ ఆలయ గోపురంపై చెక్కబడిన ఈ అద్భుతమైన శిల్పం నాయక శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది.ఇది మహాభారతంలోని గరుడపరాక్రమ ఘట్టాన్ని సజీవంగా కళ్లకు కడుతున్నది. అమృతాన్ని దేవతలనుండి సాధించి సవతితల్లి అయిన కద్రువకు దాస్యం చేస్తున్న తన తల్లి వినతను విడిపించడం కోసం గరుత్మంతుడు ఆకాశంలో ఎగురుతున్న భంగిమలో ఈ శిల్పం మలచబడింది.


గరుడుడు ధర్మానికి కట్టుబడినవాడు. అపారమైన బలంకలవాడు. ఈ శిల్పంలో గరుడుని శరీరం మానవరూపంలో ముఖం గరుడపక్షి ముక్కుతో విశాలమైన రెక్కలు పూర్తిగా విప్పార్చుకుని గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్తున్నట్లుగా అత్యంత కమనీయంగా చెక్కారు. తన కాలి పంజాల్లో ఒక ఏనుగును ఒక తాబేలును పట్టుకుని గరుడుడు ఉన్నాడు.అవి నిజానికి పూర్వజన్మలో వారసత్వ ఆస్తి కోసం దురాశతో కొట్టుకున్న విభావసుడు సుప్రతీకుడు అనే సోదరులు.వారు శాపవశాన జంతు రూపాలు పొందినవారు. ఈ కథకు మరింత ఉత్కంఠను జోడిస్తూ గరుడుడు తన ముక్కుతో ఒక పెద్దమర్రి చెట్టు కొమ్మను కూడా మోస్తున్నట్లు చెక్కబడింది.ఆ కొమ్మ అమితమైన బరువుకు విరిగిపోయే సమయంలో దానికి వేలాడుతూ తపస్సు చేసుకుంటున్న వాలఖిల్య ఋషులు ఉన్నారని గరుడుడు గ్రహించాడు. వారు కిందపడి మరణించకుండా కాపాడటం కోసం గరుత్మంతుడు ఒకేసారి ఆ భారీ కొమ్మను ఏనుగును తాబేలును మోస్తూ ఆకాశంలో ఎగిరాడు.ఇది అతని బలానికి కరుణకు ప్రతీక. శిల్పంలో గరుడుని అలంకారాలు నాయక కాలం వైభవాన్ని తెలియజేస్తాయి. తలపై కిరీటమకుటం రత్నాల పొదిగినట్లు సూక్ష్మమైన చెక్కడాలతో ఉంది. చెవులకు మకర కుండలాలు మెడలో మూడు వరుసల కంఠహారాలు వాటి మధ్యలో కౌస్తుభ మణి వంటి పెద్ద పతకం భుజాలపై కేయూరాలు మణికట్టుకు కంకణాలు నడుముకు రత్నాల ఒడ్డాణం కాళ్లకు గజ్జెలతో కూడిన కడియాలు ధరించి ఉన్నాడు. వక్షస్థలంపై యజ్ఞోపవీతం స్పష్టంగా కనిపిస్తుంది. నడుముకు చుట్టిన పీతాంబరం గాలికి రెపరెపలాడుతున్నట్లుగా నాజూకు మడతలతో చెక్కారు. రెక్కలపై ఒక్కో ఈకను విడివిడిగా సన్నని గీతలతో చూపడం వల్ల రెక్కలు కదులుతున్నట్లుగా వున్నాయి. ముక్కు వంపు కళ్లలోని తీక్షణత కండలు వంపులు తిరిగిన భుజాలు గరుడుని వీరత్వాన్ని పలికిస్తున్నాయి. కొమ్మకు వేలాడుతున్న వాలఖిల్య ఋషులను అతి సూక్ష్మంగా తలపై జటాజూటంతో, ధ్యానముద్రలో చూపడం శిల్పి నైపుణ్యానికి తార్కాణం. ఏనుగు తొండం తాబేలు డిప్ప మీది గీతలు కూడా సహజత్వం ఉట్టిపడేలా ఉన్నాయి.


 తిరుక్కురుంగుడి ఆలయం 108 దివ్యదేశాలలో ఒకటి. నమ్మాళ్వార్ జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శిల్పాలు కేవలం అలంకారాలు కావు. యాత్రికులకు గాధలు చెప్పే దృశ్య పురాణాలు.


గరుడుని రెక్కల్లోని చలనం ఋషుల ముఖాల్లోని తపోనిష్ఠ జంతువుల వివరాలు మొదలైనవి 16వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు వర్ధిల్లిన మధురై నాయక రాజుల శిల్పకళా నైపుణ్యానికి పరాకాష్ఠ. నాయక రాజులు పాత ఆలయాలను పునరుద్ధరించి ఉన్నత శిల్పాలతో గోపురాలను తీర్చిదిద్దారు. తిరుక్కురుంగుడి ఆలయం పాండ్య చోళ విజయనగర నాయక శైలుల సమ్మేళనంగా ఉంటుంది. గరుడాళ్వార్ వైష్ణవ సంప్రదాయంలో విష్ణు వాహనుడిగా వేదస్వరూపుడిగా పూజలందుకుంటాడు.గరుడ మంత్రం సర్పవిషానికి భూతభయానికి విరుగుడుగా భక్తులు నమ్ముతారు. ఈ గోపుర శిల్పంలో గరుడుని అంజలి ముద్ర లేకపోయినా కర్తవ్య నిర్వహణలో ఆవేశం తల్లిపట్ల భక్తి లక్ష్యంపట్ల ఏకాగ్రత ధర్మంపట్ల నిబద్ధత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం రాతిశిల్పమే కాదు, భక్తి వీరత్వం కరుణలను ఒకేచోట ఆవిష్కరించిన గొప్పకళాఖండం.


గరుత్మంతుడు ఏనుగును తాబేలును మోస్తున్న ఘట్టానికి మహాభారతం ఆదిపర్వంలోని ఉపాఖ్యానం వుంది.


పూర్వజన్మలో విభావసుడు సుప్రతీకుడు అనే ఇద్దరు సోదరులు మహర్షులు. వీరి తండ్రి మరణించిన తర్వాత తండ్రి ఆస్తి పంపకం విషయంలో ఇద్దరికీ తగాదా వచ్చింది. విభావసుడు పెద్దవాడు సుప్రతీకుడు చిన్నవాడు. చిన్నవాడు ఆస్తిని సమంగా పంచాలని కోరగా పెద్దవాడు తనకు ఎక్కువ భాగం కావాలని పట్టుబట్టాడు. ఇద్దరూ పండితులైనా దురాశ అహంకారం వల్ల ఒకరినొకరు శపించుకున్నారు. విభావసుడు “నీవు ఏనుగువై పుట్టు” అని తమ్ముడిని శపించగా సుప్రతీకుడు “నీవు తాబేలువై పుట్టు” అని అన్నను తిరిగి శపించాడు. ఇలా శాపఫలితంగా విభావసుడు పెద్ద తాబేలుగా సుప్రతీకుడు పెద్ద ఏనుగుగా ఒకే సరస్సులో జన్మించారు. అయినా వారి పూర్వజన్మ వైరం పోలేదు. ఏనుగు నీటిలోకి దిగినప్పుడల్లా తాబేలును కొడుతూ తాబేలు ఏనుగు కాళ్లుపట్టుకుని లాగుతూ నిరంతరం పోరాడుతూ ఉండేవి.


అమృతం కోసం స్వర్గానికి వెళ్తున్న గరుత్మంతుడికి మార్గమధ్యలో విపరీతమైన ఆకలి వేసింది. తన తండ్రి కశ్యపుడు నీకు తగిన ఆహారం ఆ సరస్సులో పోట్లాడుకుంటున్న ఏనుగు తాబేలు. వాటిని భుజించి తర్వాత నీ కార్యం సాధించు. వాటి పూర్వ వైరం వల్ల అవి ఇప్పటికీ కొట్టుకుంటున్నాయి. వాటిని సంహరించడం అధర్మం కాదు పైగా వాటికి శాపవిమోచనం కలుగుతుందని సలహా ఇచ్చాడు. దాంతో గరుడుడు ఆ సరస్సు దగ్గరకు వెళ్లి తన పంజాలతో ఏనుగును తాబేలును ఒక్కసారిగా ఎత్తుకున్నాడు. వాటిని తినడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ ఎగురుతుండగా ఒక పెద్ద మర్రిచెట్టు కొమ్మ కనిపించింది. ఆ కొమ్మమీద వాలి తినబోతుండగా ఆ కొమ్మ గరుడుని బరువుకు విరిగి కిందపడసాగింది. ఆ కొమ్మకు తలకిందులా వేలాడుతూ తపం ఆచరిస్తున్న బొటనవేలంతవున్న 60 వేల మంది వాలఖిల్య ఋషులను  గరుడుడు చూశాడు. వారిని మరణం నుండి  కాపాడటానికి మర్రికొమ్మతో సహా పైకి ఎగిరాడు. చివరికి హిమాలయాల్లోని ఒక నిర్జన ప్రదేశంలో దిగి, మరో వటవృక్షంపైన వాలఖిల్య బుుషులను వదలి, ఆ ఏనుగు తాబేలును భుజించి ఋషులను సురక్షితంగా దింపి తన ప్రయాణం కొనసాగించాడు.


ఇలా గరుడుడు ఏనుగును తాబేలును మోయడం వెనుక మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది ఆకలి తీర్చుకోవడం. రెండవది తండ్రి ఆజ్ఞ పాటించడం. మూడవది శాపగ్రస్తులైన ఆ ఇద్దరు సోదరులకు శాపవిముక్తి కలిగించడం. దురాశ వల్ల సోదర ద్వేషం వల్ల మనుషులు ఎంతటి హీన స్థితికి దిగజారతారో ధర్మమార్గంలో నడిచేవాడు ఎంతటి కష్టంలోనైనా ఇతరులకు హాని చేయకుండా ఎలా ప్రవర్తిస్తాడో ఈ ఘట్టం తెలియజేస్తుంది. 


IIసేకరణII

..............జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ