పురాతన దేవాలయాలలో చిత్రలేఖనాలు వందల సంవత్సరాలైనా ఎందుకు పాడుకావు ?

.....................................

 మనదేవాలయాల్లో కనిపించే చిత్రలేఖనాలన్నీ  ప్రకృతిలో లభించే ఖనిజాలు మొక్కలు సేంద్రియ పదార్థాలతో తయారుచేసిన సహజ రంగులతోనే రూపొందించబడ్డాయి. ఈ రంగులు శతాబ్దాల పాటు చెక్కుచెదరకుండా నిలవడానికి కారణం వాటి సహజసిద్ధమైన తయారీ విధానం అలాగే ఉపయోగించిన పదార్థాల నాణ్యత.


పురాతన చిత్రకళలో “పంచవర్ణాలు” అనే ఐదు ప్రధాన రంగులు విస్తృతంగా ఉపయోగించేవారు. ఎరుపు రంగు కోసం ఎర్రమట్టి (రెడ్ ఓకర్), ఇంగువ (సిన్నబార్), లక్క పురుగుల నుంచి లభించే లాక్షారసం వాడేవారు. పసుపు రంగుకు యెల్లో ఓకర్, హరితాళమనే (ఆర్పిమెంట్) ఖనిజం పసుపు మోదుగ పూలరసం ఉపయోగించేవారు. తెలుపు కోసం శంఖపుపొడి సున్నం కయోలిన్ అనే తెల్లమట్టి ఉపయోగించేవారు. నలుపు కోసం దీపాల మసి (ల్యాంప్ బ్లాక్) బొగ్గుపొడి కాల్చిన కొబ్బరి చిప్పలపొడి వాడేవారు. నీలం రంగు కోసం నీలిమందు మొక్క నుంచి తీసిన ఇండిగో అలాగే విలువైన లాపిస్ లాజులి రాయి నుంచి తయారుచేసిన అల్ట్రామెరీన్ వాడేవారు. ఇది చాలా ఖరీదైనదిగా ఉండటంతో ముఖ్యమైన దేవతా చిత్రాలకు మాత్రమే ఉపయోగించబడేది.

ఆకుపచ్చ రంగు సహజంగా దొరకడం కష్టంగా ఉండటంతో నీలం మరియు పసుపు రంగులను కలిపి తయారుచేసేవారు. లేకపోతే మాలకైట్ అనే పచ్చ రాతి పొడి లేదా ఆకుల రసం వాడేవారు.


గోధుమరంగు కోసం గెరూ మట్టి, బంగారు వర్ణం కోసం స్వర్ణపత్రాలు లేదా హరితాళాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసుకొని వాడిన సందర్భాలున్నాయి. అరుదుగా కుంకుమ పువ్వు కూడా రంగుల తయారీలో ఉపయోగించేవారు.


రంగురంగుల తయారీ ప్రక్రియ చాలా క్రమబద్ధంగా ఉండేది. ముందుగా ఖనిజపురాళ్లను శుభ్రపరచి మలినాలను తొలగించేవారు. తర్వాత వాటిని రాతి రోళ్లలో నూరి అతి మెత్తని పొడిగా మార్చేవారు. ఈ పొడి ఎంత సున్నితంగా ఉంటే రంగు అంత నాణ్యంగా గోడపై అతుకుతుంది. ఆపై ఈ పొడిని నీటిలో కలిపి, లేవిగేషన్ పద్ధతిలో బరువైన కణాలను వేరు చేసి, పైన తేలే సూక్ష్మ రంగును సేకరించి ఎండబెట్టి మళ్లీ పొడిగా తయారుచేసేవారు.

ఈ రంగులు గోడకు బలంగా అంటుకునేందుకు వేపబంక, వెలగబంక, తుమ్మబంక వంటి సహజ జిగురు పదార్థాలను కలిపేవారు. కొన్నిసార్లు కొబ్బరి నీళ్లు పాలు పెరుగు బెల్లంనీరు కూడా కలిపి రంగులకు మెరుపును నిలకడను పెంచేవారు.


అజంతా గుహలలో “ఫ్రెస్కో సెక్కో” విధానాన్ని అనుసరించారు. అంటే పొడిసున్నం పూతపై రంగులు వేయడం. చిత్రాలు పూర్తయిన తర్వాత తేనె బెల్లం నూనెలతో చేసిన మిశ్రమాన్ని పూతగా వేసి వాటిని వాతావరణ ప్రభావాల నుంచి రక్షించేవారు.

లేపాక్షి వీరభద్ర ఆలయంలో విజయనగర శైలిలోని చిత్రాలు ప్రధానంగా ఎరుపు నలుపు తెలుపు గోధుమ వర్ణాలతో కనిపిస్తాయి. ఇక్కడ మజ్జిగలో నానబెట్టిన సున్నాన్ని గోడ పూతగా ఉపయోగించేవారు.

కేరళ మురల్ చిత్రాల్లో గోడను ముందుగా సున్నం ఇసుక కొబ్బరినార బెల్లం వేపబంకల మిశ్రమంతో ప్లాస్టర్ చేసి నునుపుగా రుద్ది అద్దంలా తయారుచేసి ఆ తర్వాత రంగులు వేయడం ఆనవాయితీ. బృహదీశ్వర ఆలయం వంటి ప్రాంతాల్లో తంజావూరు చిత్రాలలో సహజ రంగులతో పాటు బంగారు రేకులు విలువైన రాళ్లు కూడా పొదిగేవారు.

ఈ విధానాలన్నీ విష్ణుధర్మోత్తర పురాణం శిల్పరత్న  అభిలషితార్థ చింతామణి వంటి గ్రంథాల్లో వివరంగా పొందుపరచబడ్డాయి. 


రంగులు వేసే కుంచెలను కూడా ఉడుత మేక పిల్లి వెంట్రుకలను ఉపయోగించి వెదురు పుల్లలతో కుంచెను (బ్రష్ ) తయారుచేసేవారు.

సహజ వర్ణద్రవ్యాలు రసాయనికంగా స్థిరంగా ఉండటం జిగురులో సూక్ష్మజీవులను నిరోధించే గుణాలు ఉండటం అలాగే సున్నం గోడలు కాలక్రమేణా గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌తో చర్య చెంది కాల్షియం కార్బోనేట్‌గా మారి రంగులను బలంగా స్థిరపరచడం వల్లే వందల సంవత్సరాల తర్వాత కూడా అజంతా సిత్తన్నవాసల్ వంటి ప్రాచీన చిత్రాలు ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి.


IIసేకరణII

............. జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ