08-05-2026
నేటి కధ..
.....................................
మనదేవాలయాల్లో కనిపించే చిత్రలేఖనాలన్నీ ప్రకృతిలో లభించే ఖనిజాలు మొక్కలు సేంద్రియ పదార్థాలతో తయారుచేసిన సహజ రంగులతోనే రూపొందించబడ్డాయి. ఈ రంగులు శతాబ్దాల పాటు చెక్కుచెదరకుండా నిలవడానికి కారణం వాటి సహజసిద్ధమైన తయారీ విధానం అలాగే ఉపయోగించిన పదార్థాల నాణ్యత.
పురాతన చిత్రకళలో “పంచవర్ణాలు” అనే ఐదు ప్రధాన రంగులు విస్తృతంగా ఉపయోగించేవారు. ఎరుపు రంగు కోసం ఎర్రమట్టి (రెడ్ ఓకర్), ఇంగువ (సిన్నబార్), లక్క పురుగుల నుంచి లభించే లాక్షారసం వాడేవారు. పసుపు రంగుకు యెల్లో ఓకర్, హరితాళమనే (ఆర్పిమెంట్) ఖనిజం పసుపు మోదుగ పూలరసం ఉపయోగించేవారు. తెలుపు కోసం శంఖపుపొడి సున్నం కయోలిన్ అనే తెల్లమట్టి ఉపయోగించేవారు. నలుపు కోసం దీపాల మసి (ల్యాంప్ బ్లాక్) బొగ్గుపొడి కాల్చిన కొబ్బరి చిప్పలపొడి వాడేవారు. నీలం రంగు కోసం నీలిమందు మొక్క నుంచి తీసిన ఇండిగో అలాగే విలువైన లాపిస్ లాజులి రాయి నుంచి తయారుచేసిన అల్ట్రామెరీన్ వాడేవారు. ఇది చాలా ఖరీదైనదిగా ఉండటంతో ముఖ్యమైన దేవతా చిత్రాలకు మాత్రమే ఉపయోగించబడేది.
ఆకుపచ్చ రంగు సహజంగా దొరకడం కష్టంగా ఉండటంతో నీలం మరియు పసుపు రంగులను కలిపి తయారుచేసేవారు. లేకపోతే మాలకైట్ అనే పచ్చ రాతి పొడి లేదా ఆకుల రసం వాడేవారు.
గోధుమరంగు కోసం గెరూ మట్టి, బంగారు వర్ణం కోసం స్వర్ణపత్రాలు లేదా హరితాళాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసుకొని వాడిన సందర్భాలున్నాయి. అరుదుగా కుంకుమ పువ్వు కూడా రంగుల తయారీలో ఉపయోగించేవారు.
రంగురంగుల తయారీ ప్రక్రియ చాలా క్రమబద్ధంగా ఉండేది. ముందుగా ఖనిజపురాళ్లను శుభ్రపరచి మలినాలను తొలగించేవారు. తర్వాత వాటిని రాతి రోళ్లలో నూరి అతి మెత్తని పొడిగా మార్చేవారు. ఈ పొడి ఎంత సున్నితంగా ఉంటే రంగు అంత నాణ్యంగా గోడపై అతుకుతుంది. ఆపై ఈ పొడిని నీటిలో కలిపి, లేవిగేషన్ పద్ధతిలో బరువైన కణాలను వేరు చేసి, పైన తేలే సూక్ష్మ రంగును సేకరించి ఎండబెట్టి మళ్లీ పొడిగా తయారుచేసేవారు.
ఈ రంగులు గోడకు బలంగా అంటుకునేందుకు వేపబంక, వెలగబంక, తుమ్మబంక వంటి సహజ జిగురు పదార్థాలను కలిపేవారు. కొన్నిసార్లు కొబ్బరి నీళ్లు పాలు పెరుగు బెల్లంనీరు కూడా కలిపి రంగులకు మెరుపును నిలకడను పెంచేవారు.
అజంతా గుహలలో “ఫ్రెస్కో సెక్కో” విధానాన్ని అనుసరించారు. అంటే పొడిసున్నం పూతపై రంగులు వేయడం. చిత్రాలు పూర్తయిన తర్వాత తేనె బెల్లం నూనెలతో చేసిన మిశ్రమాన్ని పూతగా వేసి వాటిని వాతావరణ ప్రభావాల నుంచి రక్షించేవారు.
లేపాక్షి వీరభద్ర ఆలయంలో విజయనగర శైలిలోని చిత్రాలు ప్రధానంగా ఎరుపు నలుపు తెలుపు గోధుమ వర్ణాలతో కనిపిస్తాయి. ఇక్కడ మజ్జిగలో నానబెట్టిన సున్నాన్ని గోడ పూతగా ఉపయోగించేవారు.
కేరళ మురల్ చిత్రాల్లో గోడను ముందుగా సున్నం ఇసుక కొబ్బరినార బెల్లం వేపబంకల మిశ్రమంతో ప్లాస్టర్ చేసి నునుపుగా రుద్ది అద్దంలా తయారుచేసి ఆ తర్వాత రంగులు వేయడం ఆనవాయితీ. బృహదీశ్వర ఆలయం వంటి ప్రాంతాల్లో తంజావూరు చిత్రాలలో సహజ రంగులతో పాటు బంగారు రేకులు విలువైన రాళ్లు కూడా పొదిగేవారు.
ఈ విధానాలన్నీ విష్ణుధర్మోత్తర పురాణం శిల్పరత్న అభిలషితార్థ చింతామణి వంటి గ్రంథాల్లో వివరంగా పొందుపరచబడ్డాయి.
రంగులు వేసే కుంచెలను కూడా ఉడుత మేక పిల్లి వెంట్రుకలను ఉపయోగించి వెదురు పుల్లలతో కుంచెను (బ్రష్ ) తయారుచేసేవారు.
సహజ వర్ణద్రవ్యాలు రసాయనికంగా స్థిరంగా ఉండటం జిగురులో సూక్ష్మజీవులను నిరోధించే గుణాలు ఉండటం అలాగే సున్నం గోడలు కాలక్రమేణా గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్తో చర్య చెంది కాల్షియం కార్బోనేట్గా మారి రంగులను బలంగా స్థిరపరచడం వల్లే వందల సంవత్సరాల తర్వాత కూడా అజంతా సిత్తన్నవాసల్ వంటి ప్రాచీన చిత్రాలు ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి.
IIసేకరణII
............. జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.
*పరుగో పరుగు -3*
📷🏃🏼
రచన : మల్లిక్
రాంబాబు కిందికి వంగి ఓపిగ్గా ఏరుతున్నాడు.
"అదిగోండి గురూగారూ .... అక్కడ ఒకటి ఉంది...." అన్నాడు కిష్టయ్య.
రాంబాబు దాన్ని ఏరేశాడు.
"ఇదిగోండి గురూగారూ.... ఇక్కడ ఇంకోటి ఉంది....జాగ్రత్త గురూగారూ.... అసలే గాజు పెంకులు.... గుచ్చుకుంటాయ్....”
రాంబాబు గుర్రుగా చూశాడు కిష్టయ్య వైపు.
"ఏరా.... ఇంతకీ బాస్ ని నేనా నువ్వా.... నేనేమో నడుం పడిపోయేలా వంగి గాజు పెంకులూ అవీ ఏరుతుంటే నువ్వేమో నాకు ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తున్నావా? నువ్వు కూడా ఏరు....”
"తప్పైపోయింది గురూగారూ.... జరిగిన భీభత్సానికి నాకేం చెయ్యాలో తోచక మెదడు మొద్దుబారిపోయింది.”
కిష్టయ్య కూడా కింద కూర్చుని గాజు పెంకులు ఏరసాగాడు.
"అదికాదురా.. అసలు మనం చేసిన తప్పేంటి?...” అన్నాడు రాంబాబు గాజు పెంకులు ఏరటం ఆపి కిష్టయ్య వంక చూస్తూ.
"మిరపకాయ బజ్జీల వ్యాపారం చెయ్యకపోవడం" ఠక్కున అన్నాడు కిష్టయ్య.
“ఛస్.... నోర్ముయ్.... నేనంటుంది అదికాదు..
ఇందాక వాళ్ళొచ్చి అన్ని విరగ్గొట్టి పోయారే.... దాని గురించి...."
"అవునండి గురుగారూ.... అదే నాకు అర్థం కావడంలేదు.”
"మనిషి అందంగా లేకపోతే మనమేం చేస్తాం?".
"అవును గురూగారూ.... మనమేం చేస్తాం?"
“మొహం ఎలా ఉంటే ఫొటోలో అలానే వస్తుంది.. లేని అందం ఎక్కడనుండి వస్తుంది.... హ....” పగిలిన గాజుముక్కల వంక ఉక్రోషంగా చూస్తూ అన్నాడు రాంబాబు.
"నిజమే గురూగారూ.... మొహం ఎలా ఉంటే ఫోటోలో అలానే పడ్తుంది.... కానీ వాళ్ళలో కొందరికి మొహాలే తియ్యలేదు కదండి.... వట్టి మొండాల్ని ఫొటో తీశారు.... కొందరినేమో తల ఒక్కటే.... మెడకాయ్ దాకా తీశారండీ....బహుశా వాళ్ళకి అందుకే కోపం వచ్చి ఉంటుందంకీ...”
"ఎంత కోపం వస్తే మాత్రం స్టూడియో అద్దాలూ, ఫర్నిచరూ పగలగొడితే ఎలా....? నచ్చకపోతే మళ్ళీ తియ్యమనాలిగానీ ....”
"మీరు మళ్ళీ అలాగే తీస్తారని వాళ్ళ అనుమానం గురూగారూ....”
రాంబాబు కిష్టయ్య వంక కొరకొరా చూశాడు.
"అంటే ఏంటి నీ ఉద్దేశం.... నేను ప్రతిసారీ ఛండాలంగా ఫొటోలు తీస్తాననా?”
"అలా నేనన్నానా గురూగారూ. ఈ ప్రజల మనస్థత్వం గురించి చెప్తున్నా..."
“హ.... నచ్చకపోతే పగలగొడ్తారట!..... పగల గొడ్తారు!!.... ఈ స్టూడియో ఏమైనా వాళ్ళ బాబు సొత్తా.... పోలీస్ కంప్లయింట్ ఇస్తాను .హు...." గొణుక్కుంటూ గాజు పెంకులు ఏర్తున్నాడు రాంబాబు.
“అవునండీ గురూగారూ.... మీరు పోలీసు కంప్లయింట్ ఇవ్వండి వాళ్ళ తిక్క వదుల్తుంది....”
“కిష్టయ్య.... ఇలా గాజు పెంకులు ఏర్తే అర్థరాత్రి దాకా ఏరాల్సిందే. చీపురుతో గది మొత్తం ఓసారి ఊడ్చి గాజు పెంకులు పేపరులోకి ఎత్తి పారెయ్.... అదిగో ఆ పడిపోయిన టేబులుని కాస్త నిలబెట్టు. కుర్చీలు అన్నీ వేటి స్థానంలో వాటిని పెట్టు.... వాడెవడో రోడ్డుమీదకి ఒక స్టూలుని విసిరేశాడు.. దాన్ని తెచ్చి లోపలపెట్టు.... ఈలోగా నేను పక్క షాపు నుండి పోలీసులకు ఫోన్ చేస్తాను ...." అన్నాడు రాంబాబు లేచి నిలబడ్తూ.
“వాళ్ళ దగ్గరనుండి నష్టపరిహారం ఇప్పించమని అడగండి గురూగారూ....” అన్నాడు కిష్టయ్య చీపురు కోసం లోపలకు వెళ్తూ.
రాంబాబు స్టూడియో బయటికి వచ్చి పక్కనే ఉన్న ఫాన్సీషాపు లోంచి నెంబరు డయల్ చేశాడు.
"హాలో.... పోలీస్ స్టేషన్...." అంది అవతల నుండి ఓ కంఠస్వరం.
"హలో సార్.... మీరు వెంటనే ఇక్కడకు రావాల్సార్...." అన్నాడు రాంబాబు ఆతృతగా.
"ఏం జరిగిందక్కడ.... హత్యా?!.... చెప్పండి హంతకుడెవరు.... షూట్ చేసేస్తాను...." అంది అవతలి కంఠస్వరం మరింత ఆతృతగా.
"హత్య కాదు సార్ .... నా ఫోటో స్టూడియోని కొందరు దుండగులు ఎటాక్ చేసి అద్దాలనీ విరగ్గొటారు సార్...."
"అవునా.... అయితే వెంటనే వస్తాను.... ఆ దుండగులు ఇంకా అక్కడే ఉన్నారా?".... షూట్ చేస్తాను...."
"వాళ్ళింకా ఎందుకుంటారు సార్.... ఎప్పుడో పారిపోయారు.”
“ఎందుకు మీ ఫోటోస్టూడియోని ఎటాక్ చేశారు? పాత పగలా?"
"అలాంటిదే సార్.... నేను వాళ్ళ ఫోటోలు బాగా తియ్యలేదని వాళ్ళ వాళ్ళకి అనిపించి కోపంవచ్చి అద్దాలు పగలకొట్టారు సార్...అయినా మొహాలు బాగోపోతే నేనేం చేస్తాను సార్...."
"ఫోటోలు బాగా తియ్యలేదని స్టూడియో అద్దాలు పగలకొట్టారా !" అవతలి గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది.
“అవును సార్... "
"ని ఫొటోస్టూడియో పేరు ఇస్మైల్ ఫొటోసూడియో కాదు కదా...." రాంబాబు ఆశ్చర్యపోయాడు.
"అవున్సార్.... అదే మీకెలా తెల్సుసార్?”
"నేను కూడా ఇందాక నీ ఫోటో స్టూడియోకి వద్దామని అనుకున్నాను .... కానీ అర్జంటు కేసొకటి తగలడంవల్ల రాలేకపోయాను....”
“మీరు రావల్సింది సార్...."
“వచ్చుంటే వాళ్ళలాగా నేను అద్దాలు పగలగొట్టే వాడిని కాదు.... నిన్ను షూట్ చేసి ఉండేవాడ్ని....”
రాంబాబు కంగారు పడ్డాడు.
"అదేంటి సార్ .... మీరు షూట్ చెయ్యాల్సింది వాళ్ళని కద్సార్ ?!!...."
“షటప్.... నా ముగ్గురు కూతుళ్ళూ నీ దగ్గరికి వచ్చి ఫోటో తియ్యమంటే వాళ్ళ కాళ్ళని మాత్రం ఫోటో తీసి పంపిస్తావా. యూ...చెప్పు... ఆ స్టూడియో ఎగ్జాక్ట్ గా ఎక్కడుంది.... షూట్ చేస్తాను.... అడ్రసు చెప్పు.... " అట్నుండి అరిచాడు ఇన్స్ పెక్టర్ శ్రీరామ్.
“ఎడ్రసా?.... ఏమోనండి.... నాకు తెలీదండి.... అసలు కంప్లయింట్ ఏమీ లేదండీ.... డ్రాప్ చేసుకుంటున్నా....” వణికే కంఠంతో అని ఫోన్ డిస్కనెక్ట్ చేసి తడబడే అడుగుల్తో స్టూడియో వైపు వెళ్ళాడు రాంబాబు.
"ఏవండీ గురూగారూ...కంప్లయింట్ ఇచ్చారా?.... వాళ్ళచేత నష్టపరిహారం ఇప్పిస్తానని అన్నారా?.” అన్నాడు అప్పుడే లోపలికి అడుగుపెడ్తున్న రాంబాబుని చూసి కిష్టయ్య.
"షూట్ చేస్తానని అన్నాడు ఇన్స్ పెక్టర్...." అన్నాడు రాంబాబు జుట్టు పీక్కుంటూ.
"షూట్ చెయ్యడం ఎందుకండీ గురూగారూ.... మనకి నష్టపరిహారం ఇప్పిస్తే చాలునని చెప్పలేక పోయారా?”
“షూట్ చేస్తానని చెప్పింది వాళ్ళని కాదు.... మననే....”
“అదేంటి గురూగారూ.... మధ్యలో మనమేం చేశాం?" కిష్టయ్య ఆశ్చర్యపోయాడు.
"ఆ ఇన్స్ పెక్టర్ గారి అమ్మాయిలు కూడా మన స్టూడియోలో ఫొటోలు దిగారట....”
"అదీ సంగతి...." అన్నాడు కిష్టయ్య అర్ధం అయిందన్నట్లుగా తల కిందికీ మీదికీ ఊగిస్తూ.
"అయినా అందులో మన తప్పేముందిరా.... నేను ఫొటో తీసే సమయానికి వాళ్ళు అటు ఇటు కదిలుండొచ్చుగా....”
“అంతేనండీ గురూగారూ.... ఈ రోజుల్లో నీతికి నిజాయితీకి విలువలేదండి.. కానండి గురూగారూ చివరికి సత్యమే జయిస్తుందండి.... మొన్న అదేదో సినిమా చూశాం కదండీ.... అందులో కూడ చివరికి సత్యమే జయించింది కదండీ .... ఏం సినిమా అండీ అదీ?....”
"అన్ని సినిమాల్లో చివరికి సత్యమే జయిస్తుందిలే" విసుక్కున్నాడు రాంబాబు.
"ఏ మాటకామాటే చెప్పుకోవాలి గురూగారూ.... ఇందాక వచ్చినోళ్ళు కాస్తంత మానవత్వం ఉన్న వాళ్ళే.. మనమీద అస్సలు చెయ్యే వెయ్యలేదు.."
"అద్దాలన్నీ పగలగొట్టారు.... అదిచాలదా ? మా నాన్నకీ విషయం తెలుస్తే దొక్క చీరేస్తారు.... ఫొటో స్టూడియో వద్దూ నా బొందావద్దు.... ఇంటికి వచ్చెయ్యమంటారు....”
"మీ నాన్నగారికి ఎలా తెలుస్తుంది గురూగారూ" కొత్త అడ్డాలు. బిగించెయ్యండి.... విరిగిన కుర్చీలు బాగుచేయించెయ్యండి...."
"ఏం దానికి తక్కువ డబ్బు అవుతుందని అనుకున్నావా?...."
"అయినా మీ నాన్నగారు హైదరాబాద్ వచ్చినప్పుడు కదా...."
"వస్తే.... ఈ విరిగిపోయిన అద్దాలు అవీ చూశాడంటే నన్ను జీళ్ళ పాకం లాగా సాగదీస్తాడు....”
తల రెండు చేతుల్తో పట్టుకున్నాడు రాంబాబు. కిష్టయ్య రాంబాబు వంక జాలిగా చూశాడు.
“అసలీవేళ ఎంత నష్టం జరిగుంటుందండీ గరూగారూ?"
రాంబాబు డ్రాయరు సొరుగులోంచి కాగితం పెన్ను తీసాడు.
“ఏమేం విరిగాయో చెప్పు.... ల్కెక కడదాం ..."
కిష్టయ్య చెప్పసాగాడు.
సరిగ్గా అదే సమయంలో స్టూడియోలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఇద్దరూ తలలు తిప్పి అతని వంక చూశారు.
🏃🏽
*సశేషం*
*భైరవవాక - 3*
🔱
రచన: ఇందూ రమణ
ముడతలు పడి చిరగడానికి సిద్దంగా ఉన్న ఉత్తరాన్ని జాగ్రత్తగా విప్పాడు పాత్రో.
"డియర్ పాత్రో!
నువ్వు మళ్ళా ఆంధ్రాలో అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది. నీకు స్వాగతం పలకడానికి నేను ప్రస్థుతం ఆంధ్రాలో లేను. బీహార్ బోర్డర్ లో ఉంటున్నాను. నువ్వు అభిమానంతో రాసిన లేఖ ఇంట్లో వాళ్ళు శ్రీకాకుళం నుంచి నాకు భద్రంగా పంపారు.
నీతో పాటు తోడుగా రావటానికి మా ఇంట్లో ఆ మాత్రం పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరున్నారు చెప్పు?
అందుకే ఇందులో విపులంగా ఎలా వెళ్ళాల్సిందీ రాస్తున్నాను. జాగ్రత్త సుమీ!.
వాల్తేరు స్టేషన్ లో ఆగే ముందు మీకు ఓ చిన్న స్టేషన్ తగుల్తుంది. అక్కడ రాయపూర్ రైలు ఆపుతారు. ఏ ఎక్స్ ప్రెస్ అన్నా ఆపుతారు గాని, రెండు.... మూడు నిమిషాలకంటే ఎక్కువసేపు ఏ ట్రైను అక్కడ ఆగదు.
మీరు ఆ వ్యవధిలో ఆ స్టేషన్ లో దిగిపొండి.
అది చందన పురి రైల్వేస్టేషన్. కానీ, ఆ వూరు పేరు మాత్రం గోపాలపురం. అక్కడ నుండి మీరు చందన పురి వెళ్ళడానికి ప్రతి అయిదు నిమిషాలకి ఓ బస్సు ఉంటుంది.
చందన పురిలో దిగాక మీరు బైట ఎక్కడా ఉండకండి. దేవస్థానం సత్రాలు చాలా ఉంటాయి. ఓ గది అద్దెకు తీసుకోండి. అక్కడ్నుంచీ మీకు సహాయకారిగా ఉండడానికి నా ప్రాణ స్నేహితుడి అడ్రస్ క్రింద రాస్తున్నాను. అతడిని ఎలాగైనా కలుసుకో! ఇప్పుడు అతని సెల్ నెంబరు మారిపోయింది. ఈ మధ్య కాంటాక్ట్ లేడు.
అతను అదే ఊరులో బ్యాంక్ ఆఫీసర్ గా చాలాకాలం నుండి పనిచేస్తున్నాడు. నీ ప్రయాణం పూర్తయి ఇల్లు చేరాక నాకో చిన్న లేఖ రాయి. ఉంటాను.
నీ ప్రియమైన విశ్వం...
క్రింద అడ్రస్ విపులంగా రాసి ఉంది. పర్సు తీసి ఉత్తరాన్ని అందులో భద్రంగా దాచాడు ప్రాతో.
ఆ ఉత్తరం అంతా ఇంగ్లీషులోనే రాసిఉంది. వారిద్దరి మధ్య ఆంగ్లమే అనుబంధవారధి.
పాత్రోకి తెలుగు చదవటం ... రాయటం రాదు. అయితే, ఎవరైనా ఎలా మాట్లాడినా అర్ధం చేసుకోగలడు. కాని జవాబు చెప్పలేడు. శ్రీకాకుళంలో తను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో 'విశ్వం' తో పరిచయం అయింది. ఆ పరిచయం స్నేహమై తనకి ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల రుచి చూపించింది. విశ్వం గాని తనని విశాఖ... విజయనగరం ప్రాంతాలు తీసుకువెళ్ళి చూపించకపోతే అసలు తనకి ఆంధ్రా ప్రాంతంతో పరిచయమే ఉండేది కాదు.
కీకారణ్యం లాంటి శ్రీకాకుళం అడవి ప్రాంతాల్లో ఓ అడవిమృగంలా తనూ ఆ ఆర్నెళ్ళూ పడి ఉండాల్సి వచ్చేది.
విశ్వం పుణ్యమా అని తెలుగును కొంతైనా అర్ధం చేసుకోగలుగుతున్నాడు. ఇప్పుడు కూడా ఈ పుణ్యక్షేత్రం సందర్శించడానికి విశ్వం తోడుగా వచ్చివుంటే ఎంత బావుణ్ణు?
శ్రీకాకుళం వదిలేసి ఆరేళ్ళు అవుతోంది. ఈ ఆరేళ్లలో ఎన్ని మార్పులు... ఎన్ని చేర్పులు... ఎన్ని కూర్పులు.
అప్పుడు వంటరివాడు. ఇప్పుడు ఓ ఇంటి వాడయ్యాడు. పిల్లలు తోడయ్యారు. ఉమ్మడిగా సాగిన అన్నదమ్ములు ఎవరికి వారయ్యారు. చిన్నప్పటినుండి ఎంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా మెలిగిన అన్నదమ్ములు ఎవరికీ ఏమీ కానట్టు ఎవరికి వారు దూరం దూరంగా వెళ్ళిపోయారు.
విధి విచిత్రం. అంతేనేమో!
ఈ ఆరేళ్ళలోనూ మళ్ళా ఆంధ్రాలో అడుగు పెట్టే అవకాశంగాని.... అదృష్టంగాని కలుగలేదు.
విశ్వం మాత్రం ఓసారి రాయగడ మజ్జి గైరమ్మ గుడికి వచ్చి అలా మా ఊరు వచ్చాడు. ఒరిస్సా రాష్ట్రంలో వున్న ఓ మారుమూల పల్లె మా వూరు. అక్కడికి
దగ్గరలోనే ఉద్యోగం వెలగబెడుతున్నాడు తను. రాయగడలో అమ్మవారి దర్శనం కాగానే అక్కడ నుంచి వచ్చీరాని ఒరియా మాట్లాడుతూ ఎంతో ప్రయాసతో మా వూరు చేరాడు విశ్వం. తనే దగ్గరుండి నాల్రోజులు విశ్వంకి ఒరిస్సా అంతా చుట్టబెట్టి చూపించాడు. భువనేశ్వర్, కుర్దారోడ్, పూరీ, కోణార్క్ దేవాలయాలు సందర్శించాడు విశ్వం.
ప్రస్తుతం ఇద్దరం సంసారులం అయ్యాం, బాధ్యతలూ పెరిగాయి. పిల్లల చదువులు
... సమస్యలు మీదపడ్డాయి. తనిప్పుడు పెళ్ళయి ఇద్దరు పిల్లల తండ్రయ్యాడు.
📖
రైలు కుదుపులకు ఉలిక్కిపడి తేరుకున్నాడు పాత్రో!
కొత్తవలస రైల్వేస్టేషన్ లో ఆగింది రాయపూర్ ఎక్స్ప్రెప్రెన్. ఎంతసేపు ఆగిందో గాని ఆగి ఆగనట్టు ఆగి మళ్ళా స్పీడందుకుంది రైలు.
ఏదో ఆనకట్ట దాటుతోంది. రైలు కూతలో మార్పు స్పష్టమైంది కిటికీలో నుంచి బైటకు చూసాడు పాత్రో దూరంగా ...కనుచూపు మేరలో...
ఎత్తైన కొండల నడుమ ఏదో గుడి విద్యుద్దీప కాంతులతో తళతళ మెరుస్తోంది.
రైల్లో ఎదురుగా కూర్చున్నతని మాటలను బట్టి అదే తాము చేరాల్సిన గమ్యస్థానం అని పాత్రో గ్రహించాడు. చందన పురి శిఖరం అదేనని తెలిసి భక్తి పారవశ్యంతో కిటికీ ఊచలు పట్టుకొని పరీక్షగా బైటికి చూసాడు.
రైలు తన మానాన తాను పరిగెడుతోంది.
తమ గమ్యం చేరువవుతున్న కొద్ది రైలు గమనం మందగిస్తునట్లనిపిస్తోంది పాత్రోకి.
రెండు కొండల నడుమ కాలిబాట. పచ్చని చెట్ల మధ్యపరచిన తెల్లటి తీవాచీలా కనుచూపు మేరలో గోచరిస్తోంది గోపురం. చుట్టూ కటిక చీకటి వలన కాలిబాటకి ఇరు వైపుల ఉన్న దీపపుకాంతి పాలనురుగు ప్రవహిస్తున్నట్టూ ఉంది. కొండ చివర శంఖు చక్ర నామాలు రంగు రంగుల బల్బులతో చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఎత్తైన కొండకు దిగువున మధ్యలో చిన్న గోపురం కనిపిస్తోంది.
బంగారు రంగులో మెరుస్తున్న ఆంజనేయ స్వామి గోపురం బోర్లించిన శఠగోపంలా ఉంది.
పాత్రో ఆ దృశ్యం చూసాడు. కానీ, అతనికి అఁవేమిటో అర్ధంకాలేదు.
అందమైన ఆ దృశ్యం చందనపురి క్షేత్రానికి కాలిబాటన పోయేందుకు మెట్ల మార్గమని ఎదర సీట్లో కూర్చున్న ప్రయాణీకుల ద్వారా తెలుసుకున్న పాత్రో మనస్సు ఎంతో పులకించిపోయింది. అప్పటికే రైలు గోపాలపురం చేరుకుంది.
చందన పురి రైల్వే స్టేషన్ లో ఆగింది రైలు.
పోర్టర్ కేకలకి ... జనాల సందడికి ఇహాని కొచ్చాడు పాత్రో. అప్పటికే ఆత్రంగా ఎదురు చూస్తున్నారు పాత్రో కుటుంబ సభ్యులు. వాళ్ళకు ఎక్కడ దిగాలో ఏఁవిటో ఏఁవీ అర్ధంకావటం లేదు.
ఓ అర్ధగంట ముందు. 'మనం తరువాత వచ్చే స్టేషన్ లోనే దిగాలని' పాత్రో చెప్పాడందరికీ. ఆ స్టేషన్ ఇదేనా అన్న ఆతృత వాళ్ళందరి మొహాల్లోను ద్యోతకమవుతోంది.
గబగబా సామాన్లన్నీ లెక్కపెట్టాడు పాత్రో.
అందర్నీ ముందు దిగమని తను లోపలి నుంచి సామాన్లన్నీ అందించాడు. అప్పటికే గార్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.
ట్రైన్ నెమ్మది ... నెమ్మదిగా పట్టాల పైన స్పీడందుకుంటోంది. పాత్రో ఒక్క ఉదుటన రైలు పెట్టేలో నుంచి క్రిందకు గెంతాడు.
క్రింద పడాల్సిన పాత్రోని ఎవరో అమాంతం పట్టుకొని పడకుండా నిలబెట్టారు.
అందరూ ఒక దగ్గర నిలబడ్డారు. తన వాళ్ళందర్నీ పరికించి చూసాడు పాత్రో.
తండ్రి!
ముదుసలి సరిగ్గా నడువలేడు... ఏడీ?! లేడే!! ఏమయ్యాడు. ట్రైన్ లోనే ఉండిపోయాడా?! ఆ ఆలోచన మనసులో మెదిలేసరికి ఉలిక్కిపడ్డాడు పాత్రో, తండ్రి కోసం పరికించి చూసాడు.
ఓ మూల సిమ్మెంటు కుర్చీలో కాళ్ళు తేలేసి కూర్చున్నాడు పాత్రో తండ్రి.
తల్లి
తల్లి వంక చూసాడు. తల పండినా జవసత్వాలింకా వడలిపోలేదన్నట్లే నిటారుగా నిలబడి ఉంది. ఆమె మొహం లో ముసలితనం కనిపించినా ముసుగు మూలాన ఎవరూ ఆమెకి తనంతటి కొడుకు ఉన్నట్టు గ్రహించలేరు. సన్నగా, రివటలా చూపరులకు నాజూకుగా కనిపిస్తుంది.
భార్య!
ఓమూల నక్కి నిలబడింది. నున్నగా దువ్విన పాపిడి మధ్య సింధూరం, నుదుటన బొట్టు. ఆమె కూడా తలమీదు గా ముసుగు కప్పుకుని ఓరకంట చూస్తూ నిలబడింది. ఆమెలో ఒరియా వాళ్ళ సాంప్రదాయాలు కొట్టొచ్చినట్టూ కనిపిస్తున్నాయి.
పిల్లలిద్దర్నీ పనిపిల్ల ఆడిస్తోంది.
పనిపిల్ల!
ఆమె వైపు రెప్పవేయకుండా చూసాడు పాత్రో.
"బప్పా బప్పా!" పాత్రోని పట్టి కుదిపేస్తూ పిలిచాడు పాత్రో కొడుకు.
నాలుగేళ్ల కొడుకు ఎదో కొనమని మారాం చేసేసరికి పాత్రోకి పట్టరాని కోపం వచ్చింది.
"ఏమాత్రం పరిచయం లేని ఈ ప్రాంతంలో ఎలా నెట్టుకురావాలా' అని ఆలోచిస్తున్న పాత్రోకి చిరాగ్గానే కాదు బెరుకుగానూ ఉంది.
ఫ్లాట్ఫాం మీద జంగిడితో తినుబండారాలు అమ్ముకుంటూ తిరుగుతున్నాడో కుర్రాడు. ఆ జంగిడిలోని జిలేబి ఒకటి కొని కొడుక్కి, కూతురికి పంచి ఇచ్చాడు పాత్రో.
పాత్రో తల్లి సిమ్మెంటు కుర్చీ మీద కూలబడి ప్లాస్టిక్ సజ్జలో నుంచి కిళ్ళీ సరంజామా తీసి బైటపెట్టింది. గబగబా అయిదు జర్దా కిళ్ళీలు కట్టి భర్తకి, కొడుక్కి, కోడలికి అందించింది. పనిపిల్ల తన కిళ్ళీ తనే అడిగి తీసుకుంది.
పిల్లలిద్దరూ తమకీ కిళ్ళీలు కావాలని మారాం చేసారు. వాళ్ళకీ ఆకుల్లో వక్క మాత్రం వేసి కిళ్ళీల్లా చుట్టి అందించింది పాత్రో తల్లి.
అరగంటకి అరగంటకీ కిళ్లి నోట్లో పడందే వాళ్ళకి ఏపనీ తోచదు. ఇంటిల్లపాదీ కిళ్ళీలేందే ఉండలేరు. కాలు కదపలేరు.
సామన్లన్నీ సర్దుకొని బయల్దేరబోతున్న తరుణంలో హడావిడిగా ఓ ఆసామి వాళ్ళ దగ్గరకు వచ్చాడు.
"నమస్కారం సాబ్" ఒరియాలోనే పలకరించాడతను.
"నమస్తే!"
పాత్రో నమ్రతగానే అన్నా అతనెవరో అర్ధం గాక అయోమయంగా ఆ ఆసామి వైపు చూస్తుండిపోయాడు.
"తమరు యాత్రకే కదా సార్ వచ్చింది" అతనన్నాడు.
"ఆఁ !" పాత్రో సమాధానం వింటూనే పాత్రో తండ్రి వాళ్ళ దగ్గరకు చేరుకున్నాడు.
"నేను యాత్రకు వచ్చేవాళ్ళకు గైడ్ గా వ్యవహరిస్తుంటాను. ఇప్పటి నుంచి ఆఖరున మీరు ఇక్కడ రైలు ఎక్కిన వరకూ మీతోనే ఉంటాను. రోజంతా నా ఖర్చు కూడా మీరే భరించి చివరన మీకు తోచినంత పైకం ఇవ్వండి చాలు" అన్నాడు గైడ్.
ఒరియాలోనే అనర్గళంగా చెప్పాడతను.
పాత్రోకి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
తండ్రికేసి ప్రశ్నార్ధకంగా చూసాడు.
"నేను మీకు బరువుగా అన్పిస్తాననుకో కండి. మీతో పాటే... మీ కుటుంబసభ్యుడి గా కలిసిపోతాను. మీరేం తింటే నాకూ అదే పెట్టండి." చెప్పాడు గైడ్-
"అందుకోసం కాదు.!" నీళ్ళు నములుతూ అన్నాడు పాత్రో. పాత్రో తండ్రి మాత్రం వాళ్ళ సంభాషణ అంతా వింటున్నా సారాంశం అర్థం చేసుకోలేక పోతున్నాడు.
"నా వలన ఉపయోగం ఏఁవిటని ఆలోచిస్తున్నారా?!" మళ్ళా గైడే అన్నాడు.
"...." పాత్రో సమాధానం మౌనమే అయింది.
"మీరు ఇక్కడ్నుంచి నిశ్చింతగా ఉండొచ్చు. మిమ్మల్ని ఇక్కడ నుంచి క్షేత్రానికి తీసుకు వెళ్ళే భారం నాది. భాష మీకు సమస్య కాదు. ఎందుకంటే నాలా ఇలా ఒరియా అనర్గళంగా ఇక్కడున్న 'గైడ్' లెవరూ మాట్లాడలేరు. నేనూ ఒరియా దేశం నుండే ఇక్కడకు వలస వచ్చేసాను. మీకు ఏం కావాలన్నా ... మీరు ఏo కొనాలన్నా నేను వాళ్ళతో తెలుగులో మాట్లాడి ఆ సారాంశం మీకు ఒరియాలో వివరిస్తాను." అతను ఇంకా ఏదో చెప్పాలనే అనుకున్నాడు.
పాత్రోకి అప్పటికి గాని గైడ్ విలువ అర్ధం కాలేదు. విషయం అర్ధమయ్యాక మధ్య లోనే సంభాషణ ముగిస్తూ పాత్రో "పదండి మళ్ళా మనకి 'చందనపురికి' వెళ్ళడానికి బస్సులుంటాయో!! ఉండవో?!" మాట మారుస్తూ. అతన్ని తమ యాత్రకు మార్గ దర్శకుడిగా నిర్ణయం వ్యక్తపరుస్తూ అన్నాడు పాత్రో.
క్రింద ఉన్న ఓ సూట్ కేస్ గబాలున అందుకుంటూ గైడ్ మళ్ళా అన్నాడు ముందుకు దారి తీస్తూ.
"నా పేరు పాండే. మీరు సింపుల్ గా ఎలా పిలిచినా పలుకుతాను. 'గైడ్ గారూ' అన్నా పలుకుతాను. ఏమంటారు?!" చిన్నగా మందహాసం చేస్తూ అన్నాడు గైడ్.
"అలాగే! మీరీ బ్యాగ్ పట్టుకోండి. ఆ సూట్ కేస్ నాకు ఇచ్చేయండి" అని గైడ్ చేతిలో ఉన్న సూట్ కేస్ లాక్కుంటూ అతనికి తన బుజాన తగిలించిన బ్యాగ్ అందించాడు పాత్రో.
పాత్రో ఉద్దేశ్యం గ్రహించి పాండే మనసు లోనే నవ్వుకున్నాడు.
బహుశా అదే ఆ సూట్ కేస్ వాళ్ళ ప్రాణం అని అనుకున్నాడు గైడ్.
🔱
*సశేషం*
꧁

Comments
Post a Comment