మత్తులో ఉంచడానికి మద్యం, భంగ్ (గంజాయి) ధత్తూర(ఉమ్మెత్త) వంటి మూలికలను ఉపయోగించేవాడు.

.....................................

ఈ వ్యాసాన్ని చదవడానికి ముందు ఇచ్చిన చిత్రాన్ని తెరిపారా చూడండి.

150 సామాన్యశకం (ACE)  సంవత్సరాలకు, అంటే 2 వ శతాబ్దానికి చెందినదిగా భావించే కౌశాంబి నుండి లభించిన ఈ మట్టిబొమ్మ నమూనా భారతదేశంతో పాటు ఆసియాలోనే మానవఉదర శస్త్రచికిత్సను చిత్రీకరించిన తొలి పురావస్తు ఆధారంగా పరిగణించబడుతోంది. ఇది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని మ్యూజియంలో భద్రపరచబడింది. ఈ కళాఖండం ఒక పురుషుని పొట్టను శస్త్రచికిత్స కోసం కోసిన దృశ్యాన్ని చూపిస్తుంది.లోపలి అవయవాలు, ముఖ్యంగా పేగులు బయటకు కనిపిస్తున్నాయి.


వత్సరాజ్యానికి రాజధానిగా ఉన్న కౌశాంబిలో ఈ నమూనా లభించింది. ఇది ప్రాచీన మానవ శరీర నిర్మాణశాస్త్రం శస్త్రచికిత్సా జ్ఞానానికి చెందిన అరుదైన ఉదాహరణ. బహుశా సిజేరియన్ వంటి ఉదర శస్త్రచికిత్సలను లేదా ఇతర విధానాలను విద్యార్థులకు ప్రదర్శించడానికి వారి విద్యా ప్రయోజనాల కొరకు  ఉపయోగించి ఉండవచ్చు. సాంస్కృతికంగా ఈ కళాఖండం కుషాణుల కాలానికి చెందినది. కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఇది చ్యవన వైద్య కళాశాలకు చెందినది.ఈ మట్టి బొమ్మతో పాటు ప్రాచీన భారత శస్త్రచికిత్సా విధానాలకు సంబంధించి సుశ్రుత సంహితలో అష్టవిధ శస్త్రకర్మలు అంటే ఛేదన, భేదన, లేఖన, వేదన, ఏషణ, ఆహరణ, విస్రావణ, సీవన అనే ఎనిమిది రకాల ప్రాథమిక శస్త్రచికిత్సా పద్ధతులు వివరించబడ్డాయి. సుశ్రుతుడు శస్త్రచికిత్సకు ముందు రోగిని మత్తులో ఉంచడానికి మద్యం, భంగ్ (గంజాయి) ధత్తూర(ఉమ్మెత్త) వంటి మూలికలను ఉపయోగించేవాడని,నొప్పి తెలియకుండా చేయడానికి సంమోహన చూర్ణాలు వాడేవాడని గ్రంథాలు చెబుతున్నాయి.


శస్త్రచికిత్సలో  101 పరికరాలు ఉండేవని అవి సింహం, పులి, జింక, కాకి, కొంగ ముక్కుల ఆకారంలో ఉండేవని, వాటిని యంత్రాలు, శస్త్రాలు అని విభజించారని సుశ్రుతుడు పేర్కొన్నాడు. గాయాలను కుట్టడానికి దారం, గుర్రపు వెంట్రుకలు, నార, అలాగే పెద్ద చీమల తలలను గాయంపై పట్టించి శరీరాన్ని వేరుచేసి కుట్లుగా వాడే విధానం ఉండేది. ఉదరాన్ని కోసిన తర్వాత పేగులను బయటకు తీసి శుభ్రం చేసి, తిరిగి అమర్చి కుట్టే శస్త్రకర్మను సుశ్రుతుడు వివరించాడు.


కౌశాంబి మట్టి బొమ్మ అటువంటి ప్రక్రియను చూపిస్తుండవచ్చును. 


చరక సంహితలో అంతర్గత వైద్యంతో పాటు శస్త్రచికిత్స అవసరాన్ని, క్షార కర్మ, అగ్ని కర్మ వంటి పద్ధతులను కూడా వివరించారు. ప్రాచీన భారతంలో ప్లాస్టిక్ సర్జరీ, కంటిశుక్లం తొలగింపు, మూత్రపిండాల్లో రాళ్లు తీయడం, ఎముకలు విరిగినప్పుడు కట్టు కట్టడం, కృత్రిమ అవయవాలు అమర్చడం వంటివి జరిగేవి. శవాలను నీటిలో ఉంచి కుళ్లబెట్టి పొరలుగా విడదీసి అంతర్గత అవయవాల నిర్మాణాన్ని అధ్యయనం చేసే మృతశరీర విచ్ఛేదన పద్ధతిని సుశ్రుతుడు ప్రవేశపెట్టాడు. ఈ పనే ఇటువంటి విద్యా నమూనాల తయారీకి ఉపయోగపడి ఉండవచ్చును. కౌశాంబి మట్టి బొమ్మ కేవలం కళాఖండం మాత్రమే కాదు.ACE  ప్రారంభ శతాబ్దాల్లోనే భారతదేశంలో శస్త్రచికిత్స ఎంత అభివృద్ధి చెందిందో వైద్య విద్యకు త్రీడైమెన్షనల్ నమూనాలు వాడేవారో తెలిపే ప్రత్యక్ష సాక్ష్యం.


చరకుడు చరక సంహితలో శస్త్రచికిత్సకు సంబంధించి అష్టవిధ శస్త్రకర్మలు అని ప్రత్యేకంగా విభజించలేదు.ఆ విభజన ముఖ్యంగా సుశ్రుతసంహితలో కనిపిస్తుంది.చరక సంహితలో శస్త్రచికిత్స అవసరమైన సందర్భాలు, శస్త్రకర్మ సూత్రాలు, శల్యతంత్ర ప్రాధాన్యత విస్తృతంగా చర్చించబడ్డాయి. చరకుడు వైద్యాన్ని కాయచికిత్స (శరీరచికిత్స)కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా, శస్త్రచికిత్స అనివార్యమైన వ్యాధులలో శస్త్రప్రణిధానం చేయాలని స్పష్టం చేశాడు. సుశ్రుతుడు వివరించిన అష్టవిధ శస్త్రకర్మలు అంటే ఛేదన అనగా కోయడం, భేదన అనగా చీల్చడం, లేఖన అనగా గీరడం, వేదన అనగా కుట్టడం లేదా రంధ్రం చేయడం, ఏషణ అనగా శల్యాన్ని వెతికి తీయడం, ఆహరణ అనగా దోషాన్ని బయటకు తీయడం, విస్రావణ అనగా రక్తం లేదా చీము కార్పించడం, సీవన అనగా కుట్టివేయడం. 

చరక సంహిత సూత్రస్థానం, చికిత్సాస్థానంలో ఈ కర్మలన్నీ వేర్వేరు వ్యాధుల చికిత్సలో ప్రస్తావించబడ్డాయి. ఉదాహరణకు గుల్మ రోగంలో భేదన, విద్రధిలో విస్రావణ, అర్శస్సులో క్షార కర్మ, అగ్ని కర్మ, ఛేదన, భగందరంలో ఛేదన, క్షారసూత్ర ప్రయోగం, అశ్మరిలో ఆహరణ, వ్రణ చికిత్సలో సీవన, వ్రణశోధనలో లేఖన వంటివి చరకుడు వివరించాడు. చరకుడు శస్త్రకర్మ చేయకముందు రోగి బలం, దోషస్థితి, దేశ, కాలం పరిశీలించాలని, పూర్వకర్మగా స్నేహన, స్వేదన, వమన, విరేచనాలతో శరీరాన్ని సిద్ధం చేయాలని చెప్పాడు. శస్త్రకర్మ తర్వాత వ్రణితోపచారం, పథ్యాపథ్యం, రక్షోఘ్న ధూపనం, గుగ్గులు, నింబ, హరిద్ర వంటి ద్రవ్యాలతో వ్రణ శుద్ధి చేయాలని సూచించాడు. శస్త్రాలు మంచి ఉక్కుతో, పదునుగా, నిర్దిష్ట ఆకారంలో ఉండాలని, వాటిని క్షారోదకం లేదా అగ్నిలో శుద్ధి చేయాలని చరకుడు పేర్కొన్నాడు. శస్త్రచికిత్సలో అయోగ్యత అంటే చేయకూడని స్థితులు, యోగ్యత అంటే చేయదగిన స్థితులు, ఉపద్రవాలు, వాటి నివారణ చరక సంహితలో వివరంగా ఉన్నాయి. చరకుడు శస్త్రతంత్రాన్ని అంగీకరించినా, కాయచికిత్సతో నయం కాని స్థితిలో మాత్రమే శస్త్రం ప్రయోగించాలని, వీలైనంత వరకు ఔషధ, క్షార, అగ్ని కర్మలతోనే వ్యాధిని తగ్గించే ప్రయత్నం చేయాలని అభిప్రాయపడ్డాడు. అందువల్ల అష్టవిధ శస్త్రకర్మల మూల సిద్ధాంతం సుశ్రుతునిదైనా, ఆ కర్మల అనువర్తన, చికిత్సా విధానం, రోగి నిర్వహణ చరక సంహితలో విస్తృతంగా కనిపిస్తుంది, ఈ రెండు గ్రంథాలు కలిసే ప్రాచీన భారత శస్త్రచికిత్సా విజ్ఞానానికి పునాది వేశాయి.

॥సేకరణ॥

............... జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ