.



 🌹. ఋగ్వేద  సంహిత వచనము  - 35 🌹
✍. రచన :  దాశరధి రంగాచార్య
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మండలము 1, అధ్యాయము 3,  అనువాకము 7, సూక్తము - 4 🌻
🌴 34వ సూక్తము  🌴

ముప్పది నాలుగవ సూక్తము, ఋషి - అంగిరస పుత్రుడు హిరణ్య స్తూపుడు., దేవత - అశ్వినులు, ఛందస్సు - 9, 12 త్రిష్టుప్, తక్కినవి జగతి.

    1. అశ్వినులారా ! మీరు మేధావులు. మీ రథము సర్వత్ర సంచరించును. మీ దానము సర్వవ్యాప్తము. మీ ఉభయులది అన్యోన్య సంబంధము. అది వెలుగుగల పగటికి మంచుగల రాత్రికి ఉన్న సంబంధము వంటిది. మీరు మా ఉదయము, పగలు, సాయంత్రములందుచేయు సవన త్రయములకు విచ్చేయుడు. ఋత్విజులవద్ద నిలుచుడు.

    2. చంద్రునకు వేనకు వివాహము. ఇది దేవతలకు అందరకు తెలియును. అశ్వినులు మధుర పదార్థములను రథముమీద తీసుకొని పోవుచున్నారు. ఆ రథమునకు మూడు చక్రములు ఉన్నవి. అవి వజ్రమంతటి గట్టివి. రథము అతివేగవంతము. అందువలన పట్టుకొనుటకు మూడు స్తంభములు ఉన్నవి. అశ్వినులారా ! మీరు పగలు మూడు మారులు రాత్రి మూడు మారులు రావలెను. త్రిర్నక్తం యాథస్త్రిరశ్వినాదివా

    3. అశ్వినులారా ! మా కర్మములందలి దోషములను రోజుకు మూడుసార్లు పరిహరించుడు. మా యజ్ఞములందు మూడుసార్లు మధువును చల్లుడు. రాత్రిందివములందు మాకు బలము కలిగించు ఆహారమును ప్రసాదించుడు.

    4. అశ్వినులారా ! మా ఇంటికి మూడుసార్లు రండు. మా మిత్రుని ఇంటికి మూడుసార్లు రండు. మాకు మూడు విధముల కర్మలను బోధించుడు. ఆనందకరమగు కర్మఫలమును మూడుసార్లు ప్రసాదించుడు. మేఘము వర్షమును ఇచ్చినట్లు మూడుసార్లు అన్నము అందించుము.

    5. మూడు చక్రముల రథము మీద సూర్యపుత్రిక ఆసీనురాలయి ఉన్నది. అశ్వినులారా ! మీరు మాకు మూడుసార్లు ధనము ఇవ్వవలెను. దేవ కర్మలకు ముమ్మారు విచ్చేయవలెను. మా బుద్ధులను ముమ్మారు రక్షింపవలెను. మా బుద్ధులను ముమ్మారు రక్షింపవలెను. సౌభాగ్యమును ముమ్మారు ఇవ్వవలెను. ముమ్మారు అన్నమును ఈయవలెను.

    6. అశ్వినులారా ! ద్యులోకమునందలి ఓషధులు భూలోకమున మూడుసార్లు ఉద్భవించినవి. మూడుసార్లు ఆకాశమున పుట్టినవి. వాటిని మాకు మూడుమారులు ఇండు. మీరు బృహస్పతి పుత్రుడు శంయునకు సుఖములను ఇచ్చినారు. మా సంతానమునకు అటువంటి సుఖమును ప్రసాదించుడు. వాత, పిత్త, కఫ ధాతువులకు సుఖము శాంతి కలిగించుడు.

    7. అశ్వినులారా ! మీరు పూజ్యులు. మా వేదికమీద మూడు వరుసల దర్భలు పరచినాము. వానిపై శయనింపుడు. ప్రాణవాయువులు అవయవములను చేరునట్లు అయిష్టిక, పాశుక, సౌమిక అను త్రివేదులకు విచ్చేయగలరు.

    8. సప్త సింధు నదీ జలముతో మూడు ఆహవములలో ద్రోణ, ఆధవనీయ, పూత భృత్తులను మూడు పాత్రలందు, మూడు విధముల హవిస్సులు సిద్ధముగా ఉన్నవి. అశ్వినులారా ! మీరు మూడు లోకముల సంచరింతురు. ద్యులోకమందు ఉన్నవాడును, రాత్రింబవళ్ళు కలిగించువాడును అయిన సూర్యుని రక్షించుచున్నారు.

    9. అశ్వినులారా ! మీరు మీరథమున మా యజ్ఞమునకు వచ్చుచున్నారు. ఆ రథపు మూడు చక్రములు తెలియకున్నది. ముక్కోణపు నొగలు తెలియకున్నది. కూర్చుండు మూడు తావులందలి పట్టుకొను దండెలు తెలియకున్నవి. మీ రథమునకు గాడిదలు పూన్చినది తెలియదు. అట్లు మాకు తెలియని రథమున మీరు మా యజ్ఞమునకు విచ్చేయ వలసినదని ప్రార్థన.

    (రథము వేగవంతమని అర్థము కావచ్చును.)

    10. అశ్వినులారా ! మేము యజ్ఞమునకు పిలుచుచున్నాము. రారండు. నేతిని పూసిన మీ రథమును సూర్యుడు ఉషస్సునకు ముందే మా యజ్ఞమునకు పంపవలెను. మీనోళ్లు మధుర పదార్థములకు తగినవి. మధుర హవిస్సులను స్వీకరింపుడు.

    11. అశ్వినులారా ! ముప్పది ముగ్గురు దేవతలతోను మా యజ్ఞమునకు రాగలరు. మధుర సోమపానము చేయగలరు. మా ఆయువులను పెంచగలరు. మా పాపములను నిర్మూలించగలరు. మమ్ము ద్వేషించువానిని నాశము చేయగలరు. మీరు దయచేసి మా వద్ద ఉండగలరు. ఇది మా ప్రార్థన.

    12. అశ్వినులారా ! మిమ్ము ఆహ్వానించుచున్నాము. త్రివృతారథేవ ముప్పేటల నొగలుగల రథమున మాకు అభిముఖులయి విచ్చేయుడు. మాకు వీరవరులయిన పుత్రులను, భృత్యులను ప్రసాదించుడు. మా స్తుతులను స్వీకరించుడు. యుద్ధములందు మాకు జయములు కలిగించుడు.

 🌻. ఆలోచనామృతము :

    1. మానవ జీవితయాత్ర అనంతము. అద్భుతము. ఆశ్చర్యకరము అయినది. భగవంతుని సృష్టి సమస్తమున మానవునకు మాత్రమే ఆలోచన ప్రసాదించినాడు. ఆలోచన మానవుని ప్రగతికి, వినాశమునకు కారణభూతము అగుచున్నది.

    ఈ సూత్రమున మూడవ సంఖ్యకు తొలిసారిగా ప్రాధాన్యత ఈయబడినది. నేటికీ ఇది ప్రధానమయి ఉన్నది. త్రిలోకములు, త్రిమూర్తులు, త్రికాలములు, త్రయీవిద్యలు ఇట్లు ఎన్నియో !

    2. బండికి మూడవ చక్రము అమర్చబడినది. బరువులాగు జంతువులకు ఇది ఎంతో ఉపయుక్తమగును. కాని వేగమునకు పనికిరాదు. అందుకే అదికొనసాగలేదు.

    బండికి గాడిదలు కట్టినట్లు చెప్పబడినది.

    3. మూడు పూటల అన్నము తినుట విధించినారు. ఇది నేటికిని ఆచారముగ ఉన్నది.

    4. త్రిర్నక్తం యూథ స్త్రి రశ్వినాదివా రాత్రి మూడుసార్లు, పగలు మూడుసార్లు తిరుగుట రోజుకు ఆరుజాములు అని చెప్పుట. నాలుగు గంటలు లేక పది గడియలకు ఒక జాము. రోజుకు ఆరువది గడియలు లేక ఇరువది నాలుగు గంటలు.
🌹 🌹 🌹 🌹 🌹

 🌹. అథర్వ వేద సంహిత వచనము - 85  / Atharva Veda Hymns - 85 🌹
🌻. జీవన సమస్యలకు వేద పరిష్కారాలు 🌻
✍. రచన :  దాశరధి రంగాచార్య
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌴 . 3వ కాండము - 4వ అనువాకము - 1వ   సూక్తము - 16 -  ఋషి ఉదయ ప్రార్థన - బుద్ది వర్దనము, వర్చస్సు కొరకు 🌴

🌻.వినియోగము :
      1) బుద్ది వర్దనము కొరకు నిద్ర లేచిన తరువాత ఈ సూక్తము చదివి, ముఖము తుడుచుకొని చేతులు కడుగుకొనునది.
 
      2) వర్చస్సు కోరు బ్రాహ్మణుడు పెరుగు, తేనెను సంపాతన అభిమంత్రణలు చేసి తినవలెను. క్షత్రియునకు  పెరుగు, తేనె కలిపిన అన్నము తినిపించునది. వైశ్యాదులకు అన్నము మాత్రము తినిపించునది.  'స్నాతక్' సింహ, శార్దూలాది ఏడింటిలో ఒకదాని నాభిలోమములను లక్క, బంగారపు మణిలో పెట్టి ఈ  సూక్తముచే సంపాతన, అభిమంత్రణలు లక్క, బంగారపు మణిలో పెట్టి ఈ సూక్తముచే సంపాతన, అభిమంత్రణలు చేసి కట్టవలెను.
 
    క్షత్రియాదుల 'స్నాతకాది సప్తమర్మాణి" ఛేదించి స్థాలీపాకమున వేసి ఈ సూక్తముచే సంపాతన  అభిమంత్రణము చేసి తినవలెను. సంపాతిత, అభిమంత్రిత జలమున మునుగునది.
 
1.    ప్రాతః అగ్నిని, ప్రాతః ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. ప్రాతః మిత్రావరుణలను, ప్రాతః అశ్వినులను ఆహ్వానించు చున్నాను. ప్రాతః భాగుని పూషను, బ్రహ్మణస్పతిని, ప్రాతః సోముని, రుద్రుని ఆహ్వానించుచున్నాము.
 
2.    భగదేవత "ప్రాతర్జితః" ఉదయమును గెలిచినవాడు. అదితి పుత్రుడు. అందరిని భరించువాడు. అట్టి భగుని ఆహ్వానించుచున్నారు. రాజులు సహితము భగుని అర్చించుచున్నారు. అట్టి వానిని మేము ఆహ్వానించుచున్నాము.
 
3.    భగ దేవత సర్వ జగముల జ్ఞాత. సత్య ధన ప్రదాత. అతడు మా స్తుతులను స్వీకరించును గాక. అతడు మాకు గోసమృద్ది, అశ్వసమృద్ది కలిగించును గాక. మాకు పుత్ర, పౌత్ర, భ్రుత్యాదులను సమకూర్చును గాక.
 
4.    ఈ కర్మానుష్టామున మేము సౌభాగ్యవంతులము అగుదుము గాక. ఉదయ, మధ్యాహ్న సాయంకాలములందు మేము సౌభాగ్యవంతులము అగుదుము గాక. మఘవా! సూర్యుడు మున్నగు దేవతలు మా విషయమున మంచి మనసు గలవారలు అగుదురు గాక.
 
5.    భగదేవతయే సంపన్నుడు అగును గాక. అతని వలన మేము సంపన్నులము అగుదుము గాక. భగా! నీవు సంపన్నుడవు కదా! నిన్ను ఎల్లరు ఆహ్వానింతురు. నీవు మా కార్యక్రములందు ముందు ఉందువు గాక.
 
6.    రౌతు ఎక్కిన అశ్వము పయనించుటకు సన్నద్దమైనట్లు మాకు సంపదల నిచ్చు భగదేవతను మా యజ్ఞమునకు తెచ్చుటకు ఉషోదేవి సన్నద్దమగును గాక. అశ్వములు రథమును వలె మా వద్దకు తెచ్చును గాక.
 
7.    ఉషోదేవత అనేక గుర్రములు, ఆవులు పుత్రాదులతో కూడి మాకు శుభములు కలిగించుచు మా ఇంట ఉదయించును గాక. ఉషో దేవతలారా! మీరు జలము నిచ్చువారు. సకల గుణసంపన్నలు. మీరు మాకు నిత్యము శుభములు కలిగింతురు గాక.
🌹 🌹 🌹 🌹 🌹

 🌷. శ్రీ శివ మహా పురాణము - 79 🌷
రచన ✍. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. విద్యేశ్వర సంహితా 🌴
అధ్యాయము - 20
🌻. పార్థివ శివలింగ పూజా విధి - 2 🌻

మంత్రేణ యామిషుమితి న్యాసం కుర్యాచ్ఛివస్య చ | అధ్యవో చదితి ప్రేవ్ణూధివాసం మనునా చరేత్‌ || 17

మనసా సౌయ ఇతి దేవతాన్యాసమాచరేత్‌ | అసౌ యోsవసర్పతీతి చాచరేదుపసర్పణమ్‌ || 18é

నమోస్తు నీలగ్రీవాయేతి పాద్యం మనునా హరేత్‌ | ఆర్ఘ్యం చ రుద్రగాయత్ర్యాsచమనం త్ర్యంబకేణ చ || 19

పయః పృథివ్యామితి చ పయసా స్నానమాచరేత్‌ | దధిక్రావ్‌ణ్ణతి మంత్రేణ దధిస్నానం చ కారయేత్‌ || 20

'యామిషుం' అను మంత్రముతో శివునకు న్యాసమును చేయవలెను. 'అధ్యవోచత్‌' అను మంత్రముతో ప్రేమపూర్వకముగా అధివాసమును చేయవలెను (17).

'అసౌ యస్తామ్రః' అను మంత్రముతో లింగము నందు ఇష్టదైవమగు శివుని న్యాసమును ఆచరించవలెను. 'అసౌ యోsవసర్పతి' అను మంత్రముతో శివుని సమీపించవలెను (18).

'నమో అస్తు నీలగ్రీవాయ' అను మంత్రముతో పాద్యము నీయవలెను. 'తత్పురుషాయ' అను రుద్రగాయత్రితో ఆర్ఘ్యమును, 'త్ర్యంబకం యజామహే' అను మంత్రముతో ఆచమనమును ఈయవలెను (19).

'పయః పృథివ్యామ్‌' అను మంత్రముతో పాల అభిషేకమును, 'దధిక్రావ్‌ణ్ణో' అను మంత్రముతో పెరుగు అభిషేకమును చేయవలెను (20).

ఘృతం స్నానే ఖలు ఘృతం ఘృతపావేతి మంత్రతః | మధువాతా మధునక్తం మధుమాన్న ఇతి త్ర్యృచా || 21

మధుఖండ స్నపనం ప్రోక్తమితి పంచామృతం స్మృతమ్‌ | అథవా పాద్యమంత్రేణ స్నానం పంచామృతేన చ || 22

మానస్తోకే ఇతి ప్రేవ్ణూ మంత్రేణ కటి బంధనమ్‌ | నమో ధృష్ణవే ఇతి వా ఉత్తరీయం చ ధాపయేత్‌ || 23

యాతే హే తిరితి ప్రేవ్ణూ ఋక్‌ చతుష్కేణ వైదికః | శివాయ విధినా భక్తశ్చరేద్వస్త్ర సమర్పణమ్‌ || 24

'ఘృతం ఘృతపావా' అను మంత్రముతో నేతి అభిషేకమును చేయవలెను. 'మధువాతా, మధునక్తం మధుమాన్నః' అను మూడు మంత్రములతో (21),

మధువును, చక్కెర నీటిని ఉపయోగించి అభిషేకించవలెను. ఈ అయిదు ద్రవ్యములతో చేయు అభిషేకమునకు పంచామృత స్నానమని పేరు. ఇట్లు గాక, పాద్య మంత్రముతో పంచామృత స్నానమును అర్పించవచ్చును (22).

'మనస్తోకే' అను మంత్రముతో ప్రేమపూర్వకముగా శివునకు కటిబంధనమును, 'నమో ధృష్ణవే' అను మంత్రముతో ఉత్తరీయమును ఈయవలెను (23).

వైదికభక్తుడు 'యా తే హేతిః' అను నాల్గు మంత్రములతో ప్రేమపూర్వకముగా శివునకు యథావిధిగా వస్త్రమును సమర్పించవలెను (24).

నమః శ్వభ్య ఇతి ప్రేవ్ణూ గంధం దద్యాదృచా సుధీః | నమస్తక్షభ్య ఇతి చాక్షతాన్‌ మంత్రేణ చార్పయేత్‌ || 25

నమః పార్యాయ ఇతి వా పుష్పం మంత్రేణ చార్పయేత్‌ | నమః పర్ణ్యాయ ఇతి వా బిల్వపత్ర సమర్పణమ్‌ || 26

నమః కపర్దినే చేతి ధూపం దద్యాద్యథావిధి | దీపం దద్యాద్యథోక్తం తు నమ ఆశవ ఇత్యృచా || 27

నమో జ్యేష్ఠాయ మంత్రేణ దద్యాన్నైవేద్యముత్తమమ్‌ | మనునా త్ర్యంబకమితి పునరాచమనం స్మృతమ్‌ || 28

భక్తుడు పవిత్రమగు మనస్సు గలవాడై 'నమః శ్వభ్యః' అను మంత్రముతో ప్రేమతో గంధము నీయవలెను. 'నమస్తక్షభ్యః' అను మంత్రముతో అక్షతల నర్పించవలెను (25).

'నమః పార్యాయ' అను మంత్రముతో పుష్పమును, 'నమః పర్ణ్యాయ' అను మంత్రముతో మారేడు పత్రమును సమర్పించవలెను (26).

'నమః కపర్దినే చ' అను మంత్రముతో యథావిధిగా ధూపము నీయవలెను. 'నమ ఆశవే' అను మంత్రముతో యథావిధిగా ధూపము నీయవలెను (27).

'నమో జ్యేష్ఠాయ' అను మంత్రముతో ఉత్తమమగు నైవేద్యమును, 'త్రంబకం' అను మంత్రముతో పునరాచమనమును అర్పించవలెనని స్మృతులు చెప్పుచున్నవి (28).

ఇమాం రుద్రాయేతి ఋచా కుర్యాత్ఫల సమర్పణమ్‌ | నమో గోష్ఠ్యాయేతి ఋచా సకలం శంభవేsర్పయేత్‌ || 29

మానో మహాంతమితి చ మానస్తోకే ఇతి తతః | మంత్రద్వయేనైక దశాక్షతై రుద్రాన్‌ ప్రపూజయేత్‌ || 30

హిరణ్య గర్భ ఇతి త్ర్యృచా దక్షిణాం హి సమర్పయేత్‌ | దేవస్య త్వేతి మంత్రేణ హ్యభిషేకం చరేద్బుధః || 31

దీప మంత్రేణ వాశంభోర్నీ రాజన విధిం చరేత్‌ | పుష్పాంజలిం చరే ద్భక్త్యా ఇమాం రుద్రాయ చ త్ర్యృచా || 32

'ఇమాంగ్‌ం రుద్రాయ' అను మంత్రముతో ఫలము నర్పించవలెను. 'నమో గోష్ఠ్యోయ' అను మంత్రముతో సర్వమును శివునకు అర్పించవలెను (29).

'మనో మహాంతమ్‌, మానస్తోకే' అను రెండు మంత్రములతో ఏకాదశరుద్రులను అక్షతలతో పూజించవలెను (30).

'హిరణ్యగర్భః' అను మూడు మంత్రములతో దక్షిణ నీయవలెను. విద్వాంసుడు 'దేవస్య త్వా' అను మంత్రముతో అభిషేకమును చేయవలెను (31).

దీప మంత్రముతో శివునకు నీరాజనమీయవలెను. తరువాత 'ఇమాంగ్‌ం రుద్రాయ' అను మూడు మంత్రములతో రుద్రునకు దోసెడు పుష్పములను భక్తితో సమర్పించవలెను (32).

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

 🌷. శ్రీ శివ మహా పురాణము - 80 🌷
రచన ✍. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. విద్యేశ్వర సంహితా 🌴
అధ్యాయము - 20
🌻. పార్థివ శివలింగ పూజా విధి - 3 🌻

మా నో మహాంతమితి చ చరేత్ర్పాజ్ఞః ప్రదక్షిణమ్‌ |
మానస్తోకేతి మంత్రేణ సాష్టాంగ ప్రణమేత్సుధీః || 33

ఏష తే ఇతి మంత్రేణ శివముద్రాం ప్రదర్శయేత్‌ |
యతో యత ఇత్యభయాం జ్ఞానాఖ్యాం త్ర్యంబకేణ చ || 34

నమస్సే నేతి మంత్రేణ మహాముద్రాం ప్రదర్శయేత్‌ |
దర్శయే ద్ధేను ముద్రాం చ నమో గోభ్య ఋచానయా || 35

పంచముద్రాః ప్రదర్శ్యాథ శివమంత్ర జపం చరేత్‌ |
శత రుద్రియ మంత్రేణ జపేద్వేద విచక్షణః || 36

ప్రాజ్ఞుడు 'మా నో మహాంతమ్‌ ' అను మంత్రముతో ప్రదక్షిణమును చేసి, పవిత్రమగు మనస్సుతో 'మానస్తోకే' అను మంత్రమును పఠించి, సాష్టాంగముగా నమస్కరించవలెను (33).

 'ఏష తే రుద్ర' అను మంత్రముతో శివముద్రను, 'యతో యతః' అను మంత్రముతో అభయముద్రను, ' త్ర్యంబకమ్‌ ' అను మంత్రముతో మహాముద్రను 'నమో గోభ్యః' అను మంత్రముతో ధేను ముద్రను చూపవలెను (35).

ఈ విధముగా పంచముద్రలను చూపి, శివమంత్రమును జపించవలెను. వేదవేత్త శతరుద్రీయము (రుద్రాధ్యాయము) ను జపించవలెను (36).

తతః పంచాంగ పాఠం చ కుర్యాద్వేదవిచక్షణః |
దేవా గాత్వితి మంత్రేణ కుర్యాచ్ఛంభోర్విసర్జనమ్‌ || 37

ఇత్యుక్త శ్శివపూజాయా వ్యాసతో వైదికో విదిః |
సమాసతశ్చ శృణుత వైదికం విధిముత్తమమ్‌ || 38

ఋచా సద్యోజాతమితి మృదాహరణ మాచరేత్‌ |
వామదేవాయ ఇతి చ జల ప్రక్షేపమాచరేత్‌ || 39

అఘోరేణ చ మంత్రేణ లింగనిర్మాణ మాచరేత్‌ |
తత్పూరుషేణ మంత్రేణాహ్వానం కుర్యాద్యథా విధి || 40

తరువాత వేదవేత్త పంచాంగమును పఠించవలెను. 'దేవా గాతు' అను మంత్రముతో శివునికి ఉద్వాసన చెప్పవలెను (37).

ఇంతవరకు శివపూజ యొక్క వైదిక విధానము విస్తరముగా చెప్పబడినది. ఇపుడు ఉత్తమమగు ఆ వైదిక విధి యొక్క సంగ్రహరూపమును వినుడు (38).

'సద్యో జాతం' అను మంత్రముతో మట్టిని తీసుకువచ్చి, 'వామదేవాయ' అను మంత్రముతో జలమును ప్రోక్షించవలెను (39).

'అఘోరేభ్యః' అను మంత్రముతో లింగమును నిర్మించి, 'తత్పురుషాయ' అను మంత్రముతో శివుని యథావిధిగా ఆహ్వానించవలెను (40).

సంయోజ యేద్వేదికాయా మీశాన మనునా హరమ్‌ |
అన్యత్సర్వం విధానం చ కుర్యాత్సంక్షేప తస్సుధీః || 41

పంచాక్షరేణ మంత్రేణ గురుదత్తేన వా తథా |
కుర్యాత్పూజాం షోడశోపచారేణ విధివత్సుధీః || 42

భవాయ భవనాశాయ మహేదేవాయ ధీమహి |
ఉగ్రాయ ఉగ్రనాశాయ శర్వాయ శశి మౌలినే || 43

అనేన మనునా వాపి పూజయేచ్ఛంకరం సుధీః |
సుభక్త్యాచ భ్రమం త్యక్త్వా భక్త్యైవ ఫలదశ్శివః || 44

'ఈశానః' అను మంత్రముతో శివుని వేదికపై ప్రతిష్ఠించి, భక్తుడు శుద్ధమగు మనస్సు గలవాడై, మిగిలిన విధానము నంతనూ సంక్షేపముగా చేయవలెను (41).

భక్తుడు పంచాక్షరి మంత్రముతో గాని, గురువు ఇచ్చిన మంత్రముతో గాని షోడశోపచార పూజను యథావిధిగా చేయవలెను (42).

లేదా, 'భవాయ ... మౌలినే' (భవుడు, సంసారమును నశింపజేయువాడు, ఉగ్రుడు, ఉగ్రదోషములను నశింపజేయువాడు, సంహారకర్త, చంద్రుని శిరస్సుపై ధరించువాడు నగు మహాదేవుని ధ్యానించెదము) (43)

అను మంత్రముతో శంకరుని, భక్తితో, భ్రమలను వీడి పూజించవలెను. శివుడు భక్తిచేత మాత్రమే ఫలముల నిచ్చును (44).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 🌹. అథర్వ వేద సంహిత వచనము - 86  / Atharva Veda Hymns - 86 🌹
🌻. జీవన సమస్యలకు వేద పరిష్కారాలు 🌻
✍. రచన :  దాశరధి రంగాచార్య
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌴 . 3వ కాండము - 4వ అనువాకము - 2వ   సూక్తము - 17 -  పాడి పంట కొరకు జల ప్రార్ధన 🌴

🌻.వినియోగము :
1) వ్యవసాయమందు పొలమునకు చేరి నాగలికి కాడిని కట్టవలెను. ఈ సూక్తముచే వలపలి ఎద్దును కట్టి   దున్నుచు ఈ సూక్తము పూర్తి అయినంత కర్త అరక నడుపువానికి అప్పగించవలెను. మూడు చాళ్ళు పూర్తి   అయినంత అగ్నిని స్థాపించి దీనిచే ఇంద్రునకు పురోడాశము, అశ్వినులకు స్థాలీపాకము సమర్పించి పూజించి  అంతిమ రేఖలోనికి సంపాతములు తేవలెను.

   2) వృషలాభము కొరకు ఒకే రూపపు దూడ గల ఆవు పాల అన్నములో గూగలము లవణము కలిపిన ముద్దలు చేసి దీనిచే సంపాతన అభిమంత్రణలు చేసి తినిపించవలెను.
 
      3)    దున్నిన మూడు చాళ్ళను కర్త 8వ మంత్రముచే అభిమంత్రించ వలెను.
 
      4) అద్భుత మహాశాంతి యందు నాగటి చాలు మధ్యన హల సంసర్గమైనపుడు ఈ సూక్తము శాన్త్యుదకమున         అనుయోజనము చేయవలెను.
 
      5) యజ్ఞవాస్తు సంస్కారమున 4వ మంత్రముచే నవీన అగ్నిని స్థాపించవలెను.
 
      6) అగ్ని చయన కర్మమున క్షేత్రమును దున్ను నాగలిని 'బ్రహ్మ' ఈ సూక్తముచే అభిమంత్రించునది. 2వ  మంత్రముచే గింజలు నాటి నాటిన వాటిని అధ్వర్యుడు అనుమంత్రించ వలెను.
 
1.    మేధావులు నాగళ్ళను పొలము దున్నుటకు ఉపయోగింతురు. మేధావులే హవిరూప అన్నసాధనకు ఎద్దుల మెడ మీద నాగలిని పెట్టుదురు.
 
2.    రైతులారా! అరకలకు నాగళ్ళు కట్టండి. నాగళ్ళకు ఎద్దులను చేర్చండి. మొలక వచ్చునట్టి గింజలను విత్తండి. ధాన్యము త్వరగా ఫలించి కొడవలికి అందును గాక.
 
3.    వాడియై, నేలను చీల్చగల నాగలికి గల వజ్రము వంటి కర్రు రైతుకు సుఖములు కలిగించును. దాన్యాదులు పండించి సోమ యాగమునకు ఉపకరించును. భూమిలోనికి చొచ్చుకొని సాగును.
 
4.    ఇంద్రుడు నాగటి చాలునందు చేరును గాక. పూష దానిని రక్షించును గాక. అట్టి నాగటి చాలు మాకు ప్రతి ఏట పాడి, పంట కలిగించును గాక.
 
5.    మాకు సుఖములు కలుగుటకు నాగళ్ళు నేలను దున్నును గాక. మాకు సుఖము కలుగునట్లు నాగళ్ళు ఎద్దులను అనుసరించును గాక. సుఖముల, హలముల అధిష్టాన దేవతలారా! మా హవితో సంతృప్తులు కండి. మాకు చక్కని పంటలు కలిగించండి.
 
6.    ఎద్దులు సుఖములు కలిగించును గాక. రైతు సుఖముగా విత్తును గాక. నాగలి సుఖకరమై సాగును గాక. పగ్గములు సుఖముగా కట్టబడును గాక. సుఖ దేవతలారా! చర్నాకోలను సుఖమునకే ప్రేరణ కలిగించండి.
 
7.    ఆదిత్య వాయు దేవతలారా! ఈ పొలము నందు మేము ఆర్జించు హవిని అందుకొనండి. ఆకాశము నందున్న జల దేవతలు దున్నిన ఈ చేలను తడుపుదురు గాక.
 
8.    సీతే! - నాగేటి చాలా! వన్దామహే - నమస్కరించు చున్నాము. మాకు సౌభాగ్యములు కలిగించుము. మా విషయమున మంచి మనసు కలిగి ఉండుము. మాకు సుఫలవు అగుము.
 
9.    సీతే! నీవు మధుర జల సంయుక్తవు. విశ్వేదేవతలు, మరుత్తులచే అనుగ్రహించ బడిన దానవు. పాడి పంట కలిగించుచు జల సహితవై మాముందు నిలువుము,
🌹 🌹 🌹 🌹 🌹
 🌹. ఋగ్వేద  సంహిత వచనము  - 36 🌹
✍. రచన :  దాశరధి రంగాచార్య
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మండలము 1, అధ్యాయము 3,  అనువాకము 7, సూక్తము - 5 🌻
🌴 35వ సూక్తము  🌴

ముప్పది అయిదవ సూక్తము, ఋషి - అంగిరస పుత్రుడు హిరణ్యస్తూపుడు, దేవత - సవితృడు, ఛందస్సు - 1,9 జగతి, మిగిలినవి త్రిష్టుప్.

    1. మా క్షేమమునకు తొలుత అగ్నిని ఆహ్వానించుచున్నాము. రక్షణకొఱకు మిత్రావరుణులను ఆహ్వానించుచున్నాము. జంగమములను స్వస్థానమున నిలుపు రాత్రిని ఆహ్వానించుచున్నాము. మమ్ము కాపాడుటకు సవితృని, సూర్యుని ఆహ్వానించుచున్నాము.

    ( రాత్రీం జగతో నివేశనీం జగత్తుని నిలిపి ఉంచు రాత్రి అనునది ఎంత సత్యవచనము !)

    2. సూర్యుడు నల్లని లోకమునుండి వచ్చును. దేవతలను, మానవులను వారివారి స్థానములందు ఉంచుచు వచ్చును. సర్వ లోకములను చూచుచు వచ్చును. బంగారు రథముమీద వచ్చును. దేవో యాతి భువనాని పశ్యన్

    3. వెలుగులు పరుచు భానుడు ఆకసము నుండి దిగుచున్నాడు. ఎక్కు చున్నాడు. తెల్లని రెండు గుఱ్ఱముల రథమున దేవయజన స్థానములకు వచ్చుచున్నాడు. దూరదేశము నుండి వచ్చుచున్నాడు. సకల పాపములను హరింప చేయుటకు వచ్చుచున్నాడు.

    4. సూర్యుని రథము సర్వత్ర సంచరించుచున్నది. సువర్ణమయమయినది. బంగారు స్తంభములు కలది. సూర్యుడు అట్టి రథమును ఆరోహిం'చినాడు. బయలుదేరినాడు. చీకట్లను పారద్రోలినాడు. చిత్ర కిరణములతో బంగారు వెలుగులు పరచినాడు.

    5. సూర్యుని అశ్వములు, శ్యాయవములు అనుపేరు గలవి. వాటి పాదములు తెల్లనివి. దేవతలతో కూడి ఉండునవి. సూర్యుని బంగారు నొగల రథమును లాగునవి. అవి సూర్య సహితములయి దశదిశల కాంతులు చిమ్ముచున్నవి.

    6. లోకములు మూడు. వాటిలో రెండు సూర్యుని సమీపమున, ఒకటి దూరమున ఉన్నవి. రథ చక్రము మేకుమీద ఆధారపడినట్లు, చంద్ర నక్షత్రాదులు సూర్యునిమీద ఆధారపడి ఉన్నవి. సూర్యరూపము తెలిసినవాడు ఈ విషయము తెలిసిన వాడగును.

    7. సుపర్ణ అను సూర్యరశ్మి యోగ ప్రసారము గలది. గంభీరమయినది. సకల ప్రాణప్రదాత. మార్గదర్శి. లోకములందు వ్యాపించునది. రాత్రి అయినది. ఆ వెలుగులు ఏవి ? అవి ఎచట దాగినవి ? ఎవడు ఎరుగును ?

    8. సూర్యుడు దశదిశలను నింపినాడు. ప్రాణులను వారి స్థానముల నిలిపినాడు. మూడు లోకములను, సప్త సింధులను ప్రకాశింప చేసినాడు. అతడు "హిరణ్యాక్షః" బంగారు కన్నులవాడు. యజమాని కొఱకు రత్నములు తెచ్చును.

    9. "హిరణ్యపాణిః" సవితా, బంగారు కిరణములుగల సవితృడు బహువిధ దర్శనములవాడు. సమస్తము చూచుచున్నవాడు. ద్యావా పృథ్వుల మధ్య సంచరించుచున్నాడు. అతడు రోగములను శమింప చేయును. సవితృడు సూర్యుని చేరును. అంధమయ జగమును దాటును. అంతరిక్షమును ప్రకాశింపచేయును.

    (సవితా - సూర్యుని వేరువేరుగా పేర్కొన్నాడు. బహుశః గుణభేదము కావచ్చును. సూర్యశాస్త్రజ్ఞులు తెలియగలరు.)

 10. హిరణ్యహస్తుడు జగములకు ప్రాణదాత అగును. ప్రాణములు నిలుపువాడు అగును. ధనవంతుడు అగును. అతనిని ప్రతిరాత్రి స్తుతింతుము. అతడు అసురులను యాతుధానులను నిరాకరించును. యజనమునకు అభిముఖుడయి విచ్చేయును.

    (రాక్షస గుణముగలవారు రాక్షసులు. యాతుధానులు మాయావులు)

    11. సవితా ! నీ మార్గములు పూర్వ సిద్ధములు. వాటిమీద దుమ్ములేదు. అవి సుఖప్రయాణమునకు తగినవి. నీవు అట్టి చక్కని మార్గముల మీద రావలసినది. మమ్ము రక్షించవలసినది. మా గురించి దేవతలకు తెలియచెప్పవలసినది. ఇది మా ప్రార్థన.

        (ప్రథమ మండలమున ఏడవ అనువాకము సమాప్తము.)

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


[శ్రీ మూకశంకర విరచిత  మూక పంచశతి
🔱 శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన🔱
🌹 పాదారవిందశతకం:భావము - 27
▪▪▪▪▪▪▪▪▪▪▪
శ్లోకము:-
కవీనాం చేతోవన్నఖరరుచి సంపర్కి విబుధ
స్రవంతీ స్రోతోవ త్పటుముఖరితం హంసకరవైః |
దినారంభ శ్రీవ న్నియత మరుణచ్ఛాయ సుభగం
మదంతఃకామాక్ష్యాఃస్ఫురతు పదపంకేరుహయుగమ్ ||27||
▪▪▪▪▪▪▪▪▪▪▪
***********
భావము:
దేవీ చరణ కమలం నఖర రుచి ( న- ఖర- రుచి సంపర్కి : కఠినభావ సంపర్కం లేనిది, నఖర- రుచి సంపర్కి : గోళ్ళ కాంతులతో గూడినది) కవుల మనస్సువలె, రాయంచల కూతలచే అందెల రవళిచే ప్రతిధ్వనించు గంగా ప్రవాహమువలె అరుణోదయ కాంతిచే మనోహరం అయిన, ఉషఃకాల శోభవలె కామాక్షీదేవి చరణకమల ద్వంద్వం నా మనస్సున స్ఫురించుగాక!

శ్రీ ఆదిశంకరాచార్య విరచిత
మనీషా పంచకం-వివరణ-5
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
మనీషా పంచకం - 5 .
( ముగింపు )

జగద్గురువులు, ఆదిశంకరుల గురించి ఎప్పుడు మననం చేసుకున్నా, వారికి చండాలుని రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, కొంత వాదన తరువాత, బ్రహ్మజ్ఞానం ప్రసాదించడం, అనే విషయం కూడా చదువుకుంటూనే ఉంటాము.

ఒకప్పుడు ఆదిశంకరులు, కాశీక్షేత్రంలో, గంగానదిలో పవిత్ర స్నానం చేసి, కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి బయలు దేరగా, అదే సమయానికి, వారికి ఎదురుగా, నాలుగు కుక్కలను ముందుపెట్టుకుని, ఒక ఛండాలుడు ఎదురు అయ్యాడు. తనకు ఎక్కడ మైల సోకుతుందో అని, శంకరులు కలతచెంది, ఆ చండాలుని దూరంగా పొమ్మని గద్దించారు.

అప్పుడు ఛండాలుడు ఏమాత్రం బెదరకుండా, ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వుతో,

శ్లో. అన్నమయా దన్నమయ మథవా చైతన్యమేవ చైతన్యాత్ /
ద్విజవర ( యతివర ) దూరీ కర్తుమ్ వాంచ్ఛసి కిమ్ బ్రూహి గచ్ఛ గచ్ఛేతి...

' ఓ బ్రాహ్మణుడా ( ఓ యతీశ్వరుడా ! ) ! నీవు దేహము నుండి దేహమును దూరంగా వెళ్ళమంటున్నావా ? లేక చైతన్యము నుండి చైతన్యమును తొలగమంటున్నావా ? అన్ని శరీరాలు పాంచభౌతిక నిర్మితములు అయినప్పుడు, ఒకదానికి దూరంగా ఇంకొకటి వెళ్ళవలసిన అవసరం ఏమి వున్నది ? ఒకవేళ ఆత్మను దూరంగా వెళ్ళమని మీ అభిప్రాయం ఐతే, ఆత్మను ఎలా దూరంగా పంపగలను ? దేని నుండి దూరంగా పంపాలి ? ' అని ప్రశ్నల వర్షం గుప్పించాడు. .

ఈవిధమైన జ్ఞాన సంబంధ వచనములు చండాలుని నోటి ద్వారా విన్న శంకరులు, దిగ్భ్రమని చెంది, తన తప్పిదమును గ్రహించి, చండాలునికి శిరస్సు వంచి నమస్కరించారు. ఆశువుగా ఈ అయిదు శ్లోకాలు చెప్పారు. అవే ' మనీషా పంచకం ' గా ప్రసిద్ధికెక్కాయి. ఆశ్లోకాలలో, ఆత్మదర్శి అయిన వాడు, చండాలుడైనా,బ్రాహ్మణుడు అయినా అతడే నాగురువు అని చెప్పారు.

( ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవలసింది, ప్రతి చండాలుడూ తనకు గురువు అని శంకరులు చెప్పలేదు. ఆత్మదర్శి అయినవాడు, ఏ జాతి వాడైనా తన గురువే అని చెప్పినట్లు అర్ధం చేసుకోవాలి. )

వెంటనే నాలుగుకుక్కలతో వున్న ఛండాలుడు, అదృశ్యమయ్యాడు. నాలుగు వేదములతో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆదిశంకరులను ఆశీర్వదించి, ప్రస్థాన త్రయం పై భాష్యములు వ్రాయమని ఆదేశించి, అంతర్ధానమయ్యాడు. శివునిఆజ్ఞ మేరకు, ఆదిశంకరులు బదరికాశ్రమానికి వెళ్లి, భాష్య రచనకు అంకురార్పణ చేసారు. ,

అసలు ఏమిటి ఈ మనీషా పంచకం ? ఆదిశంకరులకు, ఆ పార్వతీపతి, పరమేశ్వరుడు, శంకరుడు, చండాలుని రూపంలో, తత్వబోధ చేసిన తరువాత, జగద్గురువులు చెప్పిన ఈ అయిదు శ్లోకములో ఏమివున్నది ? అనేజిజ్ఞాస మనకందరకూ కలుగుతూనే వుంటుంది. ఈ అయిదు శ్లోకములు కంఠతా పెట్టవలసినవి. భావము తెలుసుకోవలసినవి. ఉపదేశ వాక్యములుగా స్వీకరించి, ఆచరణలో పెట్టవలసినవి.

దీనిపై స్వామి సుందర చైతన్యుల వారు లఘు వ్యాఖ్య వ్రాసారు. ఇంకా, ఎందరో గురువులు తమ జ్ఞాన యజ్ఞ పరంపరలో శిష్యులకు బోధించారు. వాటిని గౌరవిస్తూ, మనం రోజూ ఒక శ్లోకంతో ముందుకు వెళదాం. భావము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, భక్తి శ్రద్దలతో.

ఇందులో వున్న విషయములు, గంభీరమైనవి. అందువలన, మన మేధస్సుకు కొద్దిగా వత్తిడి పెట్టి, ఈ లక్ష్యంలో కృతకృత్యులం కావాలని జగద్గురువు ఆదిశంకరులని ప్రార్ధిస్తూ, ముందుకు అడుగు వేద్దాం.

*
శ్లో. జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్పుటతరా యా సంవిజృమ్భతే
యా బ్రహ్మాది పిపీలికాన్త తనుషు ప్రోతా జగత్సాక్షిణీ /
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్
చ౦డాలోస్తు స తు ద్విజోస్తు గురు : ఇత్యేషా మనీషా మమ // 1

శ్లో. బ్రహ్మయివాహమిదం జగచ్ఛ సకలం చిన్మాత్ర విస్తారితం
సర్వం చైత ద విద్యయా త్రిగుణయా శేషం మాయా కల్పితం /
ఇద్హం యస్య దృఢామతి : సుఖతరే నిత్యే పరే నిర్మలే
చ౦డాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషామమ // 2 .

శ్లో. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచో గురో
ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృ శతా నిర్వ్యాజ శాంతాత్మనా
భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ // 3 .

శ్లో. తిర్యజ్ నరదేవతాభి రహమిత్యన్త : స్పుటాగృహ్యతే
యద్భాసా హృదయాక్ష దేహ విషయాభాన్తి స్వతో >చేతనా :
తాం భాస్యై : పిహితార్క మండల నిభామ్ స్ఫూర్తిమ్ సదా భావయ
న్యోగీ నిర్వృత మానసో హి గురురిత్యేషా మనీషామమ // 4 .

శ్లో. యత్ సౌఖ్యామ్బుధి లేశ లేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నివృత :
యస్మిన్ నిత్య సుధామ్బుధౌ : గలిత ధీ బ్రహ్మయివ న బ్రహ్మవిద్
య : కశ్చిత్స సురేంద్ర వందిత పదౌ నూనం మనీషామమ // 5 .

( నిన్నటి దానికి కొనసాగింపు.)

ఏ ఆనంద సాగర కణలేశమును అనుభవించి,  ఇంద్రాదులు ఆనందిస్తున్నారో,  జ్ఞాని దేనిని ప్రశాంతంగా అనుభవిస్తునాడో, ఏ శాశ్వత ఆనంద సాగరంలో,  అతని చిత్తము లయించి పోయిందో, అతడు బ్రహ్మ వేత్తకాదు, బ్రహ్మమే. అతని పాద పద్మములకు ఇంద్రుడు కూడా నమస్కరిస్తాడు. అని నా నిశ్సితాభిప్రాయము .

క్లుప్త వివరణ : సౌఖ్య అంబుధి= సుఖమనే సముద్రం, లేశ లేశ౦= సూక్ష్మాతి సూక్ష్మమైన. సుధ అంబుధి = అమృత మయమైన ఆనంద సముద్రము. సురేంద్ర వందిత పదౌ = ఇంద్రుడు అంతటి వాడు కూడా పూజించే పాదములు.

లౌకిక జీవన వ్యాపారముల నుండి దూరమై, శ్శాశ్వత బ్రహ్మానంద సాగరం లో మునకలు వేసేవాడే జీవన్ముక్తుడు.   జీవన్ముక్తుడు అయిన తరువాత, జీవుడు వుండే స్థితిని ఆదిశంకరులు ఈ శ్లోకంలో అద్భుతంగా వర్ణించి,  మహత్తరమైన మనీషా పంచకాన్ని ముగిస్తున్నారు. .

మొదటి నాలుగుశ్లోకాలలో,  మహావాక్య చతుష్టయం గురించి చెప్పిన జగద్గురువులు, ఈ శ్లోకంలో జ్ఞానియైన వాడు వుండే వైభవాన్ని ప్రస్తుతిస్తున్నారు. ఆత్మ ఆనంద స్థితిని సముద్రంతో పోల్చి,  అనంతమైనదనే భావన తీసుకువచ్చారు.  సాగరం అనంతమైనది కదా !  అట్టిసాగరం లోని చిన్న బిందువునైనా అనుభవించినట్లైతే  సుధాంబుధిలో మునకలు వేసినట్లే,  అని మనకు విశ్వాసం కలిగిస్తున్నారు.

' బ్రహ్మ విద్ బ్రహ్మయి వ భవతి ' బ్రహ్మమును తెలియువాడు బ్రహ్మమే అగుచున్నాడు అనే ఉపనిషద్ వాక్యాన్ని అనుసరించి,  జ్ఞానము, బ్రహ్మము రెండు కావని విశదీకరించారు,  జగద్గురువులు.

జంతు జన్మలో, కర్మలకు కర్తృత్వ భావనలు వుండవు కనుక, వాటికి పాప పుణ్యముల ప్రసక్తి వుండదు.  కానీ మానవజన్మలో, సంచిత ప్రారబ్ద ఆగామి కర్మలను అనుభవించ వలసిన పరిస్థితి వున్నది.  వెనుకటి జన్మల వాసనలను వెంట బెట్టుకుని వచ్చి, వాటిని అధిగమించి, మోక్షసాధన చేయవలసిన అవసరం వున్నది.

మన శాస్త్రముల ప్రకారము,,

వాసనలు

శరీరం / మనస్సు / బుద్ధి  /
దర్శించేవాడు / భావించేవాడు / విచారణ చేసేవాడు

విషయం  :  వస్తువులు / వుద్రేకములు / ఆలోచనలు.

వీటిని నియంత్రణ చేసుకుంటూ, వాసనలను నిర్మూలన చేసుకోవాలి, ధ్యానమార్గం ద్వారా.

ఇది మనీషాపంచకము.  చండాలుని యందును, బ్రాహ్మణుని యందును ఏక వస్తు దర్శనం చేయవలెననే ఉజ్వలస్థితి.  మనుష్యులందరూ, మనీషులై ( మహాత్ములు అయి ) మహర్షులై, తరించాలనే అభిలాషతో, ఆదిశంకరులు,  చండాలుని రూపంలో వున్న పరమేశ్వర దర్శనం చేసుకుని, మనలను అనుగ్రహించిన జ్ఞాన ప్రసాదం.

ఉపసంహారం :

మనము ఈ అయిదు రోజులుగా మననం చేసుకున్న శ్లోకములు, కంఠతా పెట్టి, పెద్దల దర్శనం చేసుకున్నప్పుడు, ఇందులోని నిగూఢార్థములు వారితో చర్చిస్తూ వుంటే, వేదాంత మార్గం సుగమం అవుతుంది.  ఎందుకంటే, ఇందులోని ఒక్కొక్క శ్లోకం, ఒక ఉపదేశ వాక్యం అని తెలుసుకున్నాము కదా !

శ్రద్ధతో నాతో అయిదురోజులూ ప్రయాణించి, స్పందించిన మిత్రులకు ధన్యవాదములు.

మనలో, చాలామందికి ఒక అనుమానం వస్తూ ఉంటుంది,  ప్రాధమిక దశలో.   ఏమని అంటే, ' వికృతరూపంతో జుగుప్సాకరంగా కనిపించే ఛండాలుని గురువు గా చూడమని గురుదేవులు ఎలా చెప్పారు, అని. '  అవును కదా !

కొద్దిగా లోతుగా వెళ్తే, ఆదిశంకరులు, కనబడిన ప్రతి ఛండాలనీ గురువుగా చూడమని చెప్పలేదని విశదం అవుతుంది.  ఛండాలుడు శంకరులను జ్ఞానతత్వం తో ప్రశ్నించిన తరువాత,  అతనిలోని, బ్రహ్మభావం తెలుసుకుని, శంకరులు చెప్పిన శ్లోక పంచకం ఇది.

మనకు భగవద్గీతలో, జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ అయిదవ అధ్యాయంలో, 18 వ శ్లోకం లో ఇదే విషయము చెప్పారు.

శ్లో. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తినీ /
శుని చైవ స్వపాకే చ పండితా : సమదర్శన : //

జ్ఞాన సంపన్నుడైన పండితుడు, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలైన వాని యందును, ఛండాలుని యందునూ, సమదృష్టితోనే వుండును.

అనగా, చైతన్యము గల ప్రతి దానిలో పరమాత్మను చూడడమనే, అర్ధం చేసుకోవాలి గానీ, పై చెప్పిన అందరినీ తీసుకువచ్చి, ప్రక్క ప్రక్కన నిలబెట్టి, పూజ చేయమని కాదు కదా ! వారిని చూసినపుడు, ఏహ్యభావం కలుగకుండా, పరమాత్మ భావంతో వుండమని అర్ధం.

🕉🌞🌏🌙🌟🚩

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ