90 నిమిషాలు మాత్రమే జరిగన యుద్ధం - పూసపాటి గజపతి మరణం.
......................................
ఇక్కడున్న తెలుపునలుపు చిత్రం మైసూరు మహారాజులు నివసించిన పాత రాచభవనం. ఇది 1897లో జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా భస్మీపటలమైంది. ఇదో దారునిర్మాణం, అంటే పూర్తిగా కర్రలు,చెక్కలతో నిర్మిమించిన అపురూప రాచభవనమన్నమాట.దీనికే అంబా విలాస్ ప్యాలెస్ అని పేరు. అంబా అంటే మైసూరు మహారాజుల ఆరాధ్యదైవమైన చాముండి అమ్మవారు. అప్పట్లో మైసూరు ఒడయారు రాజుల రాజభవనం పూర్తిగా గందం మరియు టేకు కలపలతో నిర్మించబడింది.ఈ కారణంగానే ఆ భవనం అగ్నికి సులభంగా ఆహుతైంది. 1897లో దసరా ఉత్సవాల సందర్భంగా జరిగిన ఒక దుర్ఘటనలో ఈ పాత చెక్క భవనం పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో రాజకుమార్తె జయలక్ష్మమ్మాణ్ణి వివాహ వేడుకలు కూడా అదే ప్రాంగణంలో జరుగుతున్నాయి. వేడుకల కోసం భారీగా దీపాలు, అలంకరణలు, హోమాలు ఏర్పాటు చేయడంతో ఒక చోట మంటలు అంటుకున్నాయి. కలపనిర్మాణం కావడంతో ఆ మంటలు వేగంగా వ్యాపించి, కాసేపటిలోనే మొత్తం భవనాన్ని ఆవరించాయి. ఆ అగ్నిప్రమాదంలో పాత రాజభవనం పూర్తిగా నాశనమైంది.
తరువాత నాలుగవ కృష్ణరాజ వడయారు పాలనలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ రూపకల్పనలో ప్రస్తుత అద్భుతమైన మైసూరు ప్యాలెస్ నిర్మించారు. ఈ కొత్త భవనం 1912లో పూర్తైంది. ఆంగ్లోఇండియన్ శైలిలో ఈ భవననిర్మాణం జరిగింది.
కలపతో నిర్మించిన రాజభవనమెుకటి ఇప్పటికి సజీవంగా వుంది. తిరువనంతపురం నుండి కన్యాకుమారికి వెళ్ళెదారిలో పద్మనాభపురమనే పట్టణముంది. ఇది 1795 వరకు తిరువనంతపురం మార్తాండవంశపు రాజుల రాజధానిగా వుండేది. నేను ఈ భవనాన్ని 2024 లో చూశాను.భవననిర్మాణం పూర్తిగా కేరళ సాంప్రదాయక పద్ధతిలో అద్భుతమైన నగిషీలతో వుంది. భవనానికి 1700 సంవత్సరంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద గోడ (గోపుర) గడియారం ఇప్పటికి పనిచేయడం విశేషం.తిరువనంతపురం రాజులంటే ఎవరో కాదు, తిరువనంతపురంలో వెలసిన శ్రీ పద్మనాభస్వామి వారి దాసులు. సామ్రాజ్యానికి అధిపతి పద్మనాభస్వామియేనని, ఆ స్వామి దాసులుగా రాజ్యాన్ని పాలిస్తున్నామని వినమ్రంగా ప్రకటించిన వారు. ఇప్పటికి మార్తాండవంశము వారే ధర్మకర్తలుగా ఉన్నవారు.
పద్మనాభ పురమంటే గుర్తుకొచ్చింది. 10 జూలై 1794 లో తీరాంధ్ర విజయనగరం జిల్లాలోని పద్మనాభపురమనే గ్రామం వద్ద విజయనగర స్వతంత్ర రాజు పూసపాటి చిన విజయరామరామ గజపతి వారికి, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి యుద్ధం జరిగింది.
ఎందుకంటే 1793 లో బ్రిటన్ వారు విజయనగరాన్ని వశపరచుకొని రాజైన
రెండో పూసపాటి చిన్న విజయరామ గజపతి రాజును విజయనగరం నుండి బహిష్కరించారు.అంతే కాకుండా పెద్ద మొత్తంలో పేష్కష్ విధించి చెల్లించాల్సిందిగా దౌర్జన్యం చేశారు. దాంతో కోపగించిన గజపతి బ్రిటన్ వారిపై యుద్ధం ప్రకటించాడు.కేవలం 90 నిమిషాల పాటే జరిగిన ఈ పద్మనాభయుద్ధంలో గజపతిరాజు బ్రిటన్ వారి అత్యాధునిక ఆయుధసంపత్తి తుపాకులు ఫిరంగుల యుద్ధతంత్రం ముందు తాళలేక యుద్ధంలోనే వీరమరణం పొందాడు. వేయిమంది వరకు సిపాయిలు నేలకొరిగారు. బ్రిటన్ సేనాని Colonel Pendargast ఆధ్వర్యంలోని సేనలో కేవలం 13 మంది హిందూస్థాన్ సిపాయిలు మాత్రమే మరణించారు.
గజపతి మరణించిన తరువాత విజయనగరం సింహాసనాన్ని ఆయన కుమారుడు పూసపాటి నారాయణ గజపతి రాజు అధిష్ఠించాడు.
ప్రముఖ పద్మనాభ యుద్ధం జరిగిన తర్వాత, బ్రిటిష్ పరపతి బాగా పెరిగి పోయింది. నారాయణ గజపతి రాజ్యాన్ని చేపట్టాడు, రాజుగా కాదు ఒక జమీందారుగా మాత్రమే.
॥సేకరణ॥
............. జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments
Post a Comment