మధ్యాహ్నం నిద్ర మంచిదేనా ? ఎంతసేపు ?

........................................

మనిషికి నిద్ర అంటే శరీరం స్విచ్ ఆఫ్ చేసుకోవడం కాదు, అది శరీరాన్ని మెదడును రిపేర్ చేసుకునే సమయం ఇంకా చెప్పాలంటే ఛార్జింగ్ పెట్టినట్టు. నిద్రపోకపోతే మనిషి బతకలేడు. మెలకువగా ఉన్నప్పుడు మెదడులో వ్యర్థ పదార్థాలు  టాక్సిన్స్ పేరుకుపోతాయి, ముఖ్యంగా బీటా-అమిలాయిడ్ అనే ప్రోటీన్, ఇది ఎక్కువైతే అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి వ్యాధులు వస్తాయి. నిద్రపోయినప్పుడు మెదడులోని గ్లింపాటిక్ వ్యవస్థ యాక్టివ్ అయ్యి ఈ చెత్తనంతా బయటకు పంపేస్తుంది, అందుకే మంచి నిద్ర తర్వాత తల తేలికగా ఉంటుంది. 

పగలంతా నేర్చుకున్న విషయాలు, అనుభవాలు నిద్రలోనే దీర్ఘకాల జ్ఞాపకాలుగా మారతాయి, పరీక్ష ముందు రాత్రి సరిగా నిద్రపోతే చదివింది గుర్తుంటుంది, నిద్రలేకపోతే ఏకాగ్రత పోతుంది, కొత్తగా ఏమీ నేర్చుకోలేం. నిద్రలో గ్రోత్ హార్మోన్ విడుదల అవుతుంది, అది కండరాలు, కణజాలాలు, ఎముకలు రిపేర్ చేయడానికి, కొత్త కణాలు తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే పిల్లలు ఎక్కువ నిద్రపోతారు, ఎదుగుతారు. గాయాలు త్వరగా మానాలన్నా నిద్ర అవసరం. నిద్రపోతున్నప్పుడు శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే సైటోకైన్స్ అనే ప్రోటీన్లను తయారు చేస్తుంది. రోజూ 7-8 గంటలు నిద్రపోయే వాళ్లకు జలుబు, ఫ్లూ త్వరగా రావు.నిద్ర తక్కువైతే చిన్న జబ్బులు కూడా త్వరగా తగ్గవు. వ్యాక్సిన్లు కూడా సరిగా పనిచేయవు. ఆకలిని కంట్రోల్ చేసే లెప్టిన్  గ్రెలిన్ హార్మోన్లు నిద్రపైనే ఆధారపడతాయి. నిద్ర తక్కువైతే గ్రెలిన్ పెరిగి ఆకలి ఎక్కువవుతుంది. లెప్టిన్ తగ్గి కడుపు నిండిన ఫీలింగ్ రాదు.అందుకే నిద్రలేమి ఉన్నవాళ్లు లావు అవుతారు. అలాగే ఇన్సులిన్ పనితీరు దెబ్బతిని షుగర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.

 సరిగా నిద్రపోకపోతే చిన్న విషయానికే చిరాకు కోపం ఏడుపు వస్తాయి. మెదడులో భావోద్వేగాలను కంట్రోల్ చేసే అమిగ్డాలా భాగం నిద్రలేమితో ఎక్కువ రియాక్ట్ అవుతుంది. డిప్రెషన్ యాంగ్జైటీ ఉన్నవాళ్లకు నిద్ర సమస్యలు సాధారణం. నిద్రలో బీపీ  గుండె కొట్టుకునే వేగం తగ్గి గుండెకు విశ్రాంతి దొరుకుతుంది. రోజూ 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే హైబీపీ గుండెపోటు స్ట్రోక్ రిస్క్ 45% పెరుగుతుంది. పెద్దవాళ్లకు రోజుకు 7-9 గంటలు పిల్లలకు 9-14 గంటలు వృద్ధులకు 7-8 గంటలు నిద్ర అవసరం. 

తిండి, నీళ్లు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. ఫోన్ ఛార్జింగ్ లేకుండా పనిచేయనట్టు నిద్ర లేకుండా మెదడు, శరీరం పనిచేయవు. ఒక్క రాత్రి నిద్ర చెడితే మర్నాడు పని సరిగా చేయలేం రోజుల తరబడి నిద్రలేకపోతే ప్రాణానికే ప్రమాదం.

ఇకపోతే మధ్యాహ్నం నిద్ర మంచిదే  కానీ ఎంతసేపు అనేది ముఖ్యం. చిన్న కునుకు వేయడం చాలామందికి మంచిది. దీన్నే పవర్ న్యాప్ అంటారు. 10-20 నిమిషాల కునుకు మెదడును రీఫ్రెష్ చేస్తుంది. దృష్టి జ్ఞాపకశక్తి పనితీరు మెరుగుపడతాయి. NASA పైలట్లపై చేసిన పరిశోధనలో 26 నిమిషాల నిద్ర పనితీరును 34% పెంచిందని తేలింది. నిద్రలేమి వల్ల వచ్చే చిరాకు ఒత్తిడి తగ్గుతాయి, మూడ్ బాగుంటుంది. వారానికి 1-2 సార్లు మధ్యాహ్నం నిద్రపోయే వారిలో గుండె జబ్బుల రిస్క్ తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

షిఫ్ట్ పని చేసేవాళ్లు రాత్రి సరిగా నిద్రపోని వాళ్లకు మధ్యాహ్నం కునుకు అవసరం. 30 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోతే గాఢనిద్రలోకి వెళ్లిపోతారు, లేచాక మత్తుగా  తల బరువుగా అనిపిస్తుంది.దీన్ని స్లీప్ ఇనర్షియా అంటారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నిద్రపోతే రాత్రి నిద్ర పాడవుతుంది. నిద్రలేమి ఉన్నవాళ్లు అస్సలు పడుకోకూడదు. ప్రతిరోజూ గంటకు పైగా నిద్రపోవడం డయాబెటిస్ గుండె జబ్బులు డిప్రెషన్‌కు సంకేతం కావచ్చు. అది అలవాటుగా మారితే డాక్టర్‌ను కలవడం మంచిది.

ఆయుర్వేదం ప్రకారం కఫము ఉన్నవాళ్లు స్థూలకాయులు జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు పగలు నిద్రపోకూడదు. వేసవి కాలంలో చిన్న పిల్లలు వృద్ధులు  బాగా అలసిపోయినవాళ్లురోగులు మాత్రం పడుకోవచ్చు. సరైన పద్ధతి ఏమిటంటే మధ్యాహ్నం 1 నుంచి 3 మధ్య 10-20 నిమిషాలు మాత్రమే పడుకోవాలి. చీకటిగా వున్న నిశ్శబ్ద ప్రదేశం చాలా ముఖ్యం. కుర్చీలో కూర్చుని తల వాల్చినా చాలు. 25 నిమిషాలకు అలారం పెట్టుకోండి. లేచిన వెంటనే ముఖం కడుక్కుని కాస్త నడవండి. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు రోజూ 15-20 నిమిషాలు మధ్యాహ్నం కునుకు తీస్తే మెదడుకు శరీరానికి మంచిదే. గంటలకొద్దీ పడుకుంటే మాత్రం అనారోగ్య సమస్య. మీకు రాత్రి 7-8 గంటలు హాయిగా నిద్రపడుతుంటే, పగలు నిద్ర అవసరం లేదు.

II సేకరణII

............... జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ