విజయనగర సామ్రాజ్యపు రాజలాంఛనాలలో వరాహం, సూర్యచంద్రులు ఖడ్గం ఎందుకు ఉన్నాయి ?
...........................................
దక్షిణ భారత రాజవంశాల చరిత్రలో రాజలాంఛనాలు వారి గుర్తింపు, శక్తి, సార్వభౌమత్వానికి ముఖ్యమైన ప్రతీకలుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యానికి వరాహం, ఖడ్గం, సూర్యచంద్రులు ఎంత ప్రాధాన్యమో, అదే విధంగా శాతవాహన, పల్లవ, పాండ్య, చాళుక్య, చోళ, హొయసల, కాకతీయ, రెడ్డి, నాయక, వడయార్ వంశాలకు కూడా అంతే ప్రాధాన్యత గల ప్రత్యేక రాజచిహ్నాలుoడేవి. ఇవి నాణేలు శాసనాలు దేవాలయాలు జెండాలపై ఆ రాచముద్రలు కనిపిస్తూ ఆయా రాజ్యాల సంస్కృతిని, మత విశ్వాసాలను రాజకీయ శక్తిని తెలియజేస్తాయి.
మొదటగా శాతవాహనులు దక్కన్ ప్రాంతాన్ని పాలించారు. వారి చిహ్నాల్లో సింహం ఏనుగు చైత్యం పడవ వంటి బొమ్మలు కనిపిస్తాయి. వారి నాణేలపై ఉజ్జయిని గుర్తు స్వస్తిక నదిలో ఓడ వంటి గుర్తులు ఉండేవి.సింగం శక్తికి ఏనుగు బలానికి గుర్తులు. ఓడవారి సముద్ర వాణిజ్య శక్తిని సూచిస్తాయి.
పల్లవుల కాలంలో సింహం ప్రధాన చిహ్నంగా నిలిచింది. సింహం పౌరుషానికి బలానికి గుర్తు. మహాబలిపురం, కాంచీపురం ప్రాంతాల్లో సింహస్తంభాలు విరివిగా కనిపిస్తాయి. వారి నాణేలపై నంది కూడా ఉండేది. నంది శైవ సంప్రదాయాన్ని తెలియజేస్తుంది.
చోళుల చిహ్నం పులి. పులి కూడా బలానికి పౌరుషానికి గుర్తు.వారి జెండాను పులికొడి అని పిలిచేవారు అంటే గాండ్రిస్తున్న పులి అని అర్థం. నాణేలు, శాసనాలపై పులి బొమ్మ తప్పనిసరిగా ఉండేది. కొన్ని చోట్ల పులితో పాటు చేపలు, విల్లు కూడా కనిపిస్తాయి, ఇవి ఇతర రాజ్యాలపై వారి ఆధిపత్యాన్ని గెలుపును సూచిస్తాయి.అంటే చోళులు వారిని జయించి వారి రాజముద్రలను స్వీకరించారు. పాండ్యుల చిహ్నం రెండు చేపలు. ఇవి మధురై ప్రాంతపు సమృద్ధిని, వైగై నదికి వున్న ప్రాధాన్యాన్ని తెలియచేస్తాయి.
చాళుక్యులు వరాహాన్ని తమ చిహ్నంగా ఎంచుకున్నారు. ఇది విష్ణువు వరాహావతారాన్ని సూచిస్తుంది. వరహా అవతారంలో భూమిని విష్ణువు ఏ విధంగా రక్షించాడో అదే విధంగా వారు కూడా తమ రాజ్యాన్ని ఇతరుల నుండి రక్షించినవారిగా భావించుకున్నారు.
తూర్పు చాళుక్యులు కూడా ఇదే వరహ చిహ్నాన్ని కొనసాగించారు. అయితే వారి శాసనాల్లో సూర్యచంద్రులను కూడా జోడించారు.అంటే సూర్యచంద్రులున్నంత వరకు తమసామ్రాజ్యం వుంటుందని వారి భావన. హొయసలుల చిహ్నం చాలా ప్రత్యేకమైనది. ఒక వీరుడు సింహాన్ని కత్తితో పొడిచి చంపే వీరోచిత దృశ్యాన్ని వారు తమ రాజముద్రగా ఉపయోగించారు. ఇది వారి వంశపుగాథను తెలియజేస్తుంది.
కాకతీయులు కూడా వరాహాన్ని తమ చిహ్నంగా స్వీకరించారు. వారి శాసనాలపై నాణేలపై వరంగల్లు కోటపై దేవాలయాలపై ఈ చిహ్నం కనిపిస్తుంది. రెడ్డి రాజుల చిహ్నం నంది. వారు శివభక్తులు కావడంతో నంది బొమ్మను విస్తృతంగా వాడారు. నాణేలు, శాసనాల్లో నంది ముందు శివలింగం కూడా కనిపిస్తుంది. నంది ( ఎద్దు) వ్యవసాయానికి మూలస్థంభం లాంటిది.
మైసూరు వడయారుల చిహ్నం గండభేరుండ అనే రెండు తలల పక్షి. ఇది అత్యంతశక్తి,కి అజేయతకు గుర్తు. గండభేరుండం నేటికీ కర్ణాటక రాష్ట్ర చిహ్నంగా ప్రసిద్ధి.
విజయనగర రాజులు వరాహం, ఖడ్గం, సూర్యచంద్రులను తమ ప్రధాన చిహ్నాలుగా వాడారు. వరహ అవతారంలో ఏ విధంగానైతే విష్ణువు భూమిని కాపాడినాడో అదే విధంగా తమ రాజ్యాన్ని కాపాడగలమని దీనిభావం. వరహం బలానికి వేగానికి రౌద్రానికి కూడా చిహ్నం. వారి రాజలాంఛనంలోని కత్తి విజయనగర ప్రభువుల శౌర్యానికి అంతులేని విజయాలకు గుర్తు. సూర్యచంద్రులంటే సూర్యచంద్రులున్నంత వరకు తమ రాజ్యం వుంటుందని భావన.
నాయక రాజులు విజయనగర ప్రభావంతో ఆ వైభవాలను అవే చిహ్నాలను కొనసాగించారు. తంజావూరు నాయకులు చేప వరాహం శంఖుచక్రాలను రాజముద్రలో తీసుకొన్నారు. వీరు శ్రీరాముడి బొమ్మతో నాణేలు కూడా ముద్రించారు. మధురై నాయకులు పాండ్యుల సంప్రదాయం ప్రకారం చేపలను తమ చిహ్నంగా వాడారు. వారి నాణేలు శాసనాల్లో గరుడుడు వైష్ణవ చిహ్నాలు కూడా కనిపిస్తాయి.
ఈ విధంగా చూస్తే, ఈ రాజలాంఛనాలు కేవలం అలంకారాలు మాత్రమే కావు. వాటిలో ప్రతి రాజవంశం యొక్క మత విశ్వాసం శక్తి పరాక్రమం విజయం రాజకీయ ఆశయాలు ప్రతిబింబిస్తాయి. ఈ చిహ్నాలను అర్థం చేసుకుంటే దక్షిణ భారత చరిత్ర మరింత సులభంగా, స్పష్టంగా అవగతమవుతుంది.
॥సేకరణ॥
............. జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం

Comments
Post a Comment