హళేబీడులో నాట్య సరస్వతి, శిలలో పలికిన అద్భుత విన్యాసం.
....................................
హొయసల శిల్పకళా వైభవానికి తలమానికంగా నిలిచే హళేబీడు హొయసలేశ్వర దేవాలయంలో కొలువైన నాట్య సరస్వతి శిల్పం భారతీయ శిల్ప చరిత్రలోనే అపూర్వమైన కళాఖండం. సాధారణంగా వీణాపాణిగా శాంతమూర్తిగా పద్మాసనంలో కనిపించే సరస్వతీ దేవిని ఇక్కడ నాట్య భంగిమలో చిత్రించడం హొయసల శిల్పుల అసాధారణ సృజనకు ఊహాశక్తికి నిదర్శనం.
హొయసల రాజధాని ద్వారసముద్రం మరోపేరు హళేబీడు. హళేబీడులోని ఈ దేవాలయం ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఉంది. దేవాలయం బయటి గోడలపై చెక్కిన వేలాది శిల్పాల్లో నాట్య సరస్వతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాధారణంగా సరస్వతిని విద్యకు, జ్ఞానానికి ప్రతీకగా చూస్తాం. కానీ హళేబీడులో ఆమె నాట్యం చేస్తూ కనిపిస్తుంది. ఆమె శరీరంలోని త్రిభంగ వంపు, అంటే మెడ నడుము మోకాలు వద్ద మూడు చోట్ల వంగిన తీరు కాలి మడమల లయబద్ధమైన కదలిక చూస్తే శిల ఈ క్షణంలోనే నాట్యం చేస్తుందేమో అనిపిస్తుంది. ఇది కేవలం శరీర సౌందర్యం కాదు. సంగీతం నృత్యం విజ్ఞానం విడదీయలేనివని చెప్పే తాత్విక సంకేతం. జ్ఞానం నిశ్చలంగా ఉండేది కాదు. అది నాట్యంలా చైతన్యంతో ప్రవహించేది అని హొయసల శిల్పులు కఠిన శిల .లో నిరూపించారు.
ఈ నాట్య సరస్వతి చతుర్భుజి. నాలుగు చేతుల్లో నాలుగు పవిత్ర చిహ్నాలు ఉన్నాయి. ఒక చేతిలో తాళపత్ర గ్రంథం ఉంది. తాళపత్రం వేదాలకు సకల శాస్త్రాలకు మూలం. రెండో చేతిలో అక్షమాల అంటే జపమాల ఉంది. జపమాల నిరంతర సాధనకు, ధ్యానానికి మనో ఏకాగ్రతకు గుర్తు. మూడో చేతిలో కలశం ఉంది. కలశంలోని పవిత్ర జలం సృజనాత్మకతకు నిత్య నూతనత్వానికి పవిత్రతకు గుర్తు. నాలుగో చేతిలో వీణ ఉంది. వీణ నాదబ్రహ్మలకు లలితకళలన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇలా జ్ఞానం ధ్యానం సృజన కళ అనే నాలుగు అంశాల సమతుల్య రూపమే ఈ నాట్య సరస్వతి.
హొయసల శిల్పులు ఈ అద్భుతాన్ని సృష్టించడానికి క్లోరిటిక్ షిస్ట్ అనే బలపపు రాయిని ఎంచుకున్నారు. తవ్వినప్పుడు మెత్తగా ఉండే ఈ శిల శిల్పికి కావలసినంత సూక్ష్మతను అందచేస్తుంది. అందుకే సరస్వతిదేవి ధరించిన కిరీటంలోని నగిషీలు, మెడలో మూడు వరుసల హారాలు, చెవులకు కర్ణ కుండలాలు, చేతులకు కంకణాలు, నడుముకు వడ్డాణం, కాళ్లకు గజ్జెల అందెలు అన్నీ ఒక్కొక్కటి విడిగా, కదిలేలా చెక్కారు. ఆమె కట్టుకున్న చీర మడతలు, పైట కొంగు గాలికి రెపరెపలాడుతున్నట్లు, వేళ్ల గోళ్లు, అరికాలి గీతలు కూడా సూది మొనతో చెక్కినంత సహజంగా ఉన్నాయి. ఇది శిల్పకళా పరాకాష్ట అనడంలో సందేహం లేదు.
ఈ శిల్పానికి గొప్ప సాంస్కృతిక నేపథ్యం కూడా ఉంది. హొయసల రాజు విష్ణువర్ధనుని రాణి శాంతలాదేవి తన కాలంలో గొప్ప నర్తకి, సంగీత విద్వాంసురాలు, మేధావి. రాజాస్థానంలో ఆమె నృత్య ప్రదర్శనలు చేసేదని శాసనాలు చెబుతున్నాయి. అలాంటి విద్యావంతురాలైన మహారాణి ప్రోత్సాహం, స్ఫూర్తితోనే శిల్పులు సరస్వతిని నాట్య రూపంలో మలిచి ఉంటారని చరిత్రకారులు భావిస్తారు. అంటే ఈ శిల్పం కేవలం దేవతా మూర్తి కాదు, ఆనాటి స్త్రీ శక్తికి, విద్యకు, కళకు సమాజం ఇచ్చిన గౌరవానికి ప్రతిరూపం.
క్రీ.శ. 1121లో నిర్మాణమైన ఈ దేవాలయం 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల దండయాత్రలకు గురై పాక్షికంగా ధ్వంసమైంది. అయినా నాట్య సరస్వతి శిల్పం చెక్కుచెదరకుండా నేటికీ తన కళా సౌరభాన్ని వెదజల్లుతూనే ఉంది. వానకు, ఎండకు, కాలానికి తట్టుకుని 900 ఏళ్లుగా నాట్యం చేస్తోంది. బేలూరు, హళేబీడు వెళ్లే ప్రతి కళాభిమానికి, చరిత్ర ప్రేమికుడికి ఈ నాట్య సరస్వతి ఒక దృశ్య కావ్యం. రాయిని కవిత్వంగా మలచడం అంటే ఏమిటో ఈ శిల్పం చూస్తే అర్థమవుతుంది.
॥సేకరణ॥
.............. జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments
Post a Comment