గరుడునికి రెండు తలలా ? ఎందుకు ?
.........................................
విష్ణుభగవానుడు లక్ష్మీదేవితో సహ తన వాహనమైన గరుడునితో కలిసి దర్శనమిచ్చే ఈ అద్భుత శిల్పం భారతీయ శిల్పకళలో ఒక విశిష్టస్థానం పొందింది. ఇందులో గరుడుడు దేవతలిద్దరిని తన భుజాలపై మోస్తూ, స్వర్గలోకానికి ఎగురుతున్నట్లుగా శిల్పి అద్భుతంగా ఆవిష్కరించాడు.
శిల్పం శిఖర భాగంలో విష్ణువు గంభీరంగా ఆసీనుడై ఉన్నాడు. ఆయన తలపై ఉన్న కీర్తిమకుటం ఆ దేవదేవుని మహిమను సూచిస్తుంది. చేతులలో చక్ర శంఖాలను ధరించి వున్నాడు. శంఖచక్రాలు ధర్మరక్షణకు నిదర్శనం. విష్ణుదేవుని వామాంకంపై లక్ష్మీదేవి ఆసీనురాలై వుంది.లక్ష్మీదేవి సంపదకు శుభప్రదానికి మూర్తీభవించిన రూపం.
వీరిని మోస్తున్న గరుడుడు పూర్తిగా మానవరూపంలో ఉండి శక్తికి వేగానికి ప్రతీకగా వున్నాడు. ఈ శిల్పంలో గరుడుడు రెండు శిరస్సులతో కనిపించడం ఒక ప్రత్యేక లక్షణం. ఇలా ద్విమస్తకత్వంతో కనిపించడం దక్షిణ భారత శిల్పకళలోని ఒక శైలి మాత్రమే. ఇది శిల్పుల ఊహాశక్తికి ఉదాహరణ మాత్రమే.ఇలా శిల్పులు గరుడుని ముఖలక్షణాలను అతిశయోక్తిగా చెక్కడం ద్వారా ఆయనకున్న బహుముఖ శక్తికి నిదర్శనం. ఇంకా విష్ణువుకు విశ్వసనీయ వాహనమనే భావాన్ని శిల్పులు వ్యక్తపరిచారు.
గరుడుడు వేదాల స్వరూపుడని, ఋగ్ యజుర్ సామవేదాలే అతని రెండు రెక్కలు అని పురాణాలు చెబుతాయి. కొన్ని శిల్పాల్లో ఈ వేదశక్తినే రెండు తలలుగా చూపించే సంప్రదాయం కూడా ఉంది.
శిల్పంలో అందమైన ఆకృతులు, సున్నితమైన అలంకార శైలులు అద్భుతశైలి కలవు.
ఇవన్నీ విజయనగర సామ్రాజ్యం లేదా విజయనగరానంతర కాలానికి చెందిన నాయకరాజుల కాలానికి చెందిన శిల్పాలని భావన. 16-17 శతాబ్దాల నాటి ఈ శిల్పాల్లో కర్ణకుండలాలు భుజకీర్తులు ఉదరబంధం వంటి ఆభరణాలు అత్యంత సూక్ష్మంగా చెక్కబడి ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల దేవాలయాల్లో ఇలాంటి శిల్పకళా సంప్రదాయం కనిపిస్తుంది. కంచిలోని వరదరాజ పెరుమాళ్లు గుడిలోని ఈ శిల్పం పవిత్రత, రాజసాన్ని కలిగి ఉంది. హంపిలోని విఠలాలయం, లేపాక్షి వీరభద్రాలయం గోడలపై కూడా ఇలాంటి ద్విముఖ గరుడ రూపాలు కనిపిస్తాయి.
ఈ గరుడుని రూపానికి విజయనగర సామ్రాజ్యపు ప్రసిద్ధ రాజలాంఛనం అయిన గండభేరుండ ప్రభావం ఉండవచ్చని భావించవచ్చు. రెండు తలల పక్షి చిహ్నం అజేయశక్తికి సామ్రాజ్య వైభవానికి ప్రతీక. ఈ చిహ్నం మతపరమైన శిల్పంలో ప్రతిబింబించడం ద్వారా ఆ కాలపు సంస్కృతిలో దైవత్వానికి అధికారానికి ఉన్న అనుసంధానమని స్పష్టమవుతుంది. మొత్తంగా ఈ శిల్పం విష్ణుభక్తి సంప్రదాయం దక్షిణ భారత శిల్పకళా నైపుణ్యం విజయనగర రాజవంశ వైభవం కలిసిన అపూర్వ సమ్మేళనంగా నిలుస్తున్నది.
కర్ణాటక రాష్ట్రప్రభుత్వ అధికార చిహ్నంలో రెండు తలల గండభేరుండం ఉంది. ఈ గండభేరుండం విష్ణువు నరసింహావతారంతోముడిపడి ఉంది. శరభుడిని అణచడానికి విష్ణువు గండభేరుండ రూపం దాల్చాడని పురాణ కథనం.
॥సేకరణ॥
........... జిబి.విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments
Post a Comment